పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమ భాగం

వీరాంగనా సైన్యయాత్ర

ఆ మర్నాడు అంగరక్షణీదళం కూర్చుని రథారూఢూరాలై సాలగ్రామం వచ్చింది. శాంతిశ్రీరాకుమారి. ఆమెకు తారానికా యశోదా అతిసన్నిహితులయ్యారు. ఇక్ష్వాకు శాంతిశ్రీతోపాటు పూంగీయశాంతశ్రీయు, బాపిశ్రీ, షష్టిశ్రీరాకుమారి కూడా రథాలధివసించి వచ్చినారు.

తమ చెలిక తైలందరికి రాజకుమారికలు విలువిద్యా, కత్తిసాము, గుఱ్ఱపుస్వారి, రథచోదకత్వమూ నేర్పినారు. వారి గజములకు మాత్రము మావటీండ్రనే వుంచుటకు నిశ్చయించుకొన్నారు. గండరగండనాశనీ బృందము గజసాహిణిలుగా సిద్ధమైనది ఈ రహస్యము పూంగీయశాంతశ్రీ బాపిశ్రీలే ఏర్పాటు చేసినారు. ఇక్ష్వాకు శాంతిశ్రీ రాజ కుమారికి చాలా నెలల వరకు ఏమీ తెలియలేదు. ఆ రాకుమారికలు యిద్దరు శాంతిశ్రీ జీవితంలో సేనానాయకత్వం గుప్తమై ఉన్నదనిన్నీ, పులమావిని నిరుత్తరుణ్ణి చేయడంలో ఆ శక్తే పైకి విజృంభించిందనీ నిశ్చయానికి వచ్చారు. ఇక్ష్వాకు శాంతిశ్రీ కడ దిట్టమైన అంగరక్షణీ బలం ఉంది. ఆ బలం అంతా ఉపయోగించి దానికి సహాయంగా తమ చెలులను, పరిచారికలను దిట్టరులైనవారిని ఏరి సిద్దం చేశారు. అంతా సిద్దం అనుకోగానే ఆ బాలికలిద్దరూ తమ వదినదగ్గరకు వచ్చి ఈమాటా ఆమాటా ప్రారంభించారు. కొంతసేపటికి పూంగీయ శాంతశ్రీ ఇక్ష్వాకు శాంతిశ్రీని చూచి,

“వదినా! నువ్వు ఆ పులమావిని అంతచిత్రంగా ఓడించగలిగావు! యుద్ధనిర్వహణ శక్తి ఎప్పుడు అలవరచుకొన్నావు?” అని ప్రశ్నించింది.

ఇక్ష్వాకు శాంతిశ్రీ: నేను యుద్ధనిర్వహణ నేర్చుకోవడం ఏమిటి నా కేమీ తెలియదు!

పూంగీయ శాంత: ఈ మాటలకేమిలే వదినా.

ఇ. శాంతి: నిజంగా నేను ఏలా చేయగలిగానో? నాకే ఆశ్చర్యం వేస్తుంది తలచుకుంటే!

బాపిశ్రీ: ఏది ఎట్లా అయితే ఏం ! మాకో రూఢివార్త తెలిసింది వదినా. దాని విషయం నీ ఆలోచనకు వచ్చాము.

ఇ. శాంతి: నా ఆలోచన ఏమిటమ్మా?

బాపిశ్రీ: ఆ రాక్షసుడు పులమావి నిన్ను వివాహమాడితీరుతాడట. నువ్వు వప్పుకోనంత వరకూ దేశంలో ఉన్న కన్యలకు ఉపద్రవం కలిగిస్తూ ఉంటాడట. అలా దినానికో బాలికను బలాత్కరిస్తాడట. ఆ విషయమై మామయ్యగారికి గడువు పెట్టి రాయబారం పంపాడట.

ఇ. శాంతి: ఏమిటీ పులమావి ఇంతపనికి తెగిస్తాడా? ఎప్పుడు వచ్చింది గడువు రాయబారం?

పూం. శాంత: నిన్న సాయంకాలం వదినా! అందుకని నీ దగ్గరకు ఆలోచనకు వచ్చాను.

అడివి బాపిరాజు రచనలు - 6

• 203 •

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)