పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యువరాజులైన శ్రీ వీరపురుషదత్తప్రభువు ఆనందార్హతుల ఆశ్రమంలో ధర్మగిరి విహారంలోనే చదువుకొంటున్నారు. ఆ ప్రభువున్ను ధర్మగిరి దిగి మహాసభకు వేంచేసినారు. వారికి పదునెనిమిది సంవత్సరాలు. వారు శ్రీ శాంతిమూల మహారాజు సింహాసనమునకు ఎడమచేతివైపున యువరాజు సింహాసనం అధివసించి ఉన్నారు. బ్రహ్మదత్తప్రభువు మహారాజు భావాలు తెలియజేయగానే యువరాజు వీరపురుషదత్తప్రభువు లేచి తండ్రిగారి పాదాల వ్రాలి “మహాప్రభూ! నాకున్నూ తమ సేనతో రావడానికి అనుజ్ఞ ఇవ్వాలని ప్రార్థిస్తున్నా” అని కోరినారు. మహారాజు చిరునవ్వుతో కుమారుని లేవనెత్తి అర్ధసింహాసనాన కూర్చుండబెట్టుకొన్నారు.

మహారాజు కుమారుణ్ణి చూచి "ప్రభూ! మీరు తప్పక రావలసిందే కాని, మీరు ముఖ్యంగా ఉజ్జయిని వెళ్ళవలసి ఉన్నది. ఇక్కడ వసంతోత్సవాలు అయినగాని మేము కదలము. రుద్రసేన మహారాజు మిమ్ము చూడాలనీ, మిమ్ము తమ హృదయానికి అదుముకోవాలనీ రాయబారము పంపినారు. మీరు మా ప్రతినిధులుగా పదివేల సైన్యం తీసుకొని ఉజ్జయిని వెళ్ళాలి” అని చిరునవ్వు మోమును వెలిగింప పలికినారు. వసంతోత్సవాలు ఫాల్గుణ శుద్ధ పంచమి నుండి పూర్ణిమ వరకు జరుగుతవి. ఇంక రెండు దినాలే ఉన్నది.

శాంతిమూల మహారాజు మాటలు ఎప్పుడూ గంభీరంగా ఉంటాయి. యుద్ధంలో ఎంత శుద్ధసత్వంతో విజృంభిస్తారో తదితర సమయాలలో అంత శాంతమూర్తిగా ప్రత్యక్షమౌతారు. దేవదత్తబిరుదాంకితుడూ, ఉత్తమ బ్రాహ్మణుడూ, సాంఖ్యాయనస గోత్రీకుడూ, ధాన్యకటకానికి తూర్పున ఉన్న ధనక రాష్ట్రాధిపుడు, ధనకవంశజుడు అయిన అడవిప్రియబల దేవదత్తప్రభువూ, శాంతి మూలమహారాజు సహాధ్యాయులు. శాంతిమూల మహారాజునకు నలుబది అయిదు సంవత్సరాలున్నవి. ఆయన విశాలఫాలంలో ప్రజాప్రియత్వం అమృత శాంతిమయమై ప్రజ్వలిస్తూ ఉంటుంది.

తండ్రి మాటలు యువరాజశ్రీ వీరపురుషదత్త ప్రభువునకు అర్థం కాలేదు. ఎందుకు తాను ఉజ్జయిని పోవాలి? రుద్రసేన మహారాజు తన్ను చూడాలని కోరడంలో ఉద్దేశం ఏమిటి? వీరపురుషదత్త ప్రభువు అంత కన్న ఆలోచింప దలచుకొనలేదు. మాఠరిగోత్రజ అయిన మహారాణి తన తల్లి సారసికాదేవితో తానీ విషయం మాట్లాడి, తన గురువు ఆచార్య ఆనందులవారి సెలవుపొంది, ససైన్యంగా ఉజ్జయిని వెళ్ళవలసి ఉంది. ఈ ఆలోచనలతో తన ప్రాణ స్నేహితుడైన బ్రహ్మదత్త ప్రభు వైపు చూచినాడు యువరాజు. ఆ సేనాపతి చిరునవ్వుతో “ప్రభూ! నేను ముహూర్తం పెట్టి సేవను సిద్ధంచేసి, సేనాపతిని నియమించి తమకు వార్త పంపుతాను” అని పలికినాడు.

సభ్యులెవ్వరికీ మాళవమహారాజు శ్రీ వీరపురుషదత్త ప్రభువును తమ కడకు రాయబారిగా ఎందుకు పంపుమని కోరినారో అర్థంకాలేదు. మహారాజు సాభిప్రాయంగా బ్రహ్మదత్త ప్రభువువైపు చూడగానే అచ్చట అధివసించియున్న పండితులు లేచి శ్రీశాంతమూల మహారాజును, వీరపురుషదత్త ప్రభువును, ధర్మప్రభువైన సేనాపతి స్కంధ విశాఖాయనక ప్రభువును, ఇక్ష్వాకులను, రాజకుటుంబాలను, సర్వలోకాన్ని ఆశీర్వదించారు.