పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందరు లేచి తథాస్తనిరి. మహారాజు సింహాసనంనుండి లేచి యువకుడైన స్కందవిశాఖ ప్రభువు భుజంపై కుడిచేయిమోపి, యువరాజు వీరపురుషదత్తుని మహారాజ ప్రాసాదానికి రమ్మనికోరి వారిరువురితో వెడలిపోయినారు.

బ్రహ్మదత్తప్రభువుది సుందరమైన విగ్రహం. ఆ ప్రభువు ధనుః ప్రమాణము (ఈనాడు ఆరడుగులు) కంటే ఒక అంగుష్టము ఎక్కువ పొడుగువాడు. పెద్దతల, విశాలస్కంధము. ఏనుగుల మూర్ధాలవంటి భుజాలు, కొండచరియవంటి వక్షం, మధ్యమమైన కోలమోమూ, గోమూర్ధకటీ, తీర్చిన కనుబొమలు, ఎత్తైన నాసికామూలం, గరుడచంపక నాసికల సంశ్లేషమైన ముక్కు సమానమయిన ఉత్తరాధరోష్ఠాలు, కమలకల్ముల చిబుకమూ, అంబకర్ణాలు, పోతపోసిన కంచుకంఠము, సమమైన చెంపలు, స్నిగ్ధఫాలం వీనితో వెలిగిపోతూ ఉండే ఆతడు వేద వేదాంగ పారంగతుడు, బ్రహ్మజుడు. కనుకనే ఆ ప్రభువును బ్రహ్మదత్తుడనే వారు.

విశాఖాయనక ప్రభువు నడక సింహపు నడక. మాట గంభీరము. పైశాచీ ప్రాకృతపాలీ సమ్మిశ్రితమైన ఆంధ్రభాషలో అనర్గళధారగా కావ్యసృష్టి చేస్తాడు. ఆ కావ్యాలు వీణపై అతడు పాడుతూంటే రాళ్ళు కరిగిపోతాయని ప్రజలు చెప్పుకుంటారు. విశాఖాయనకప్రభువు శాంతిమూల మహారాజుతో కలిసి కక్ష్యంతరాలు దాటి, మహారాజ ప్రాసాదాంతర్గతి సభామందిరం చేరాడు. మహారాజు విశాఖాయనక ప్రభువును అచట నిలిపి, దౌవారికులు దారి చూపుతూ ఉండగా పరిచారకులు కొలుస్తూ ఉండగా యువరాజుతో కలిసి లోనికి వెళ్ళిపోయినారు.

మహారాజు వెళ్ళిపోగానే బ్రహ్మదత్తప్రభువు మందిరం మధ్యనున్న సింహాసనానికి కొంచెం దూరంగా ఉత్తర కుడ్యం ప్రక్కనున్న ఆసనంపై అధివసించినాడు. ఆ మందిరము సంపూర్ణాలంకారయుతమై కుబేరభవనాన్ని మించి ఉంది. గోడలన్నీ చిత్రాలతో నిండి ఉన్నాయి. అయినా ఆ భవనంలో అతిత్వమేమీలేదు. మహారాజు బ్రాహ్మణ భక్తి కలవాడు. అగ్నిష్టోమ మాచరించిన క్రతుకర్త, ఉత్తమ బ్రాహ్మణ క్షత్రియుడు. బ్రహ్మదత్తుడు ఆ మందిరంలో ఒంటిగా కూర్చుండి, ఏవేవో ఆలోచించుకొంటూ ఉన్నాడు. ప్రజలు భగవత్స్వరూపులు, రాజులు ధర్మస్వరూపులు, ఋషులు పుణ్యస్వరూపులు. ఇంక బౌద్ధభిక్షువులు కర్మానుష్టాన స్వరూపులా!

ఇంతలో కొందరు చెలులు కూడ రా ఒక సఖియ భుజంపై చేయి వేచి, పదియారేళ్ళ జవ్వని ఒకర్తు ఆ సభామందిరంలోనికి గంభీరంగా నడుస్తూ వచ్చినది. ఆ యువతి మందిరంలోని రాగానే బ్రహ్మదత్తుడు లేచి నిలబడినాడు. ఆమె బ్రహ్మదత్త ప్రభువును చూచింది. ఆమెను బ్రహ్మదత్తుడు చూచి తల వాల్చుకొన్నాడు. ఆయమ సౌందర్యము అనన్యము. అతని సౌందర్యము అద్భుతము. ఆమె తెల్లబోయి ఆగిపోయినది. వెంటవచ్చే సఖివైపు ఎవరు వీరు అన్నట్లుగా చూచింది. ఆమె ఆ మందిరంలోనే ఉండవలసినదని మహారాజు ఆజ్ఞ.