హరినిందుజూపుమని, కనత్కనక మణిమయకర కరణక్రీంకార శబ్దపూర్వకంబుగా దిగ్ధతిదంత భేదన పాటన ప్రశస్తంబగు హస్తంబున సభామండప స్తంభంబు వ్రేసిన వ్రేటు తొడన దశదిశలును మిణుగురులు సెదఱజిటిలి పెటిలిపడి..."
ఇలా ఈ వర్ణన రెండు పేజీల పర్యంతం సాగుతుంది ఈ రెండు పేజీల అతికష్టమైన ఈ పోతన్న తెలుగును వేణుమాధవ్ మొత్తం తన కంచుకంఠంతో చదివి వినిపించేవాడు
ఈ తెలుగును గ్రాంథికమని మనం రోజూ రేడియోలోనూ, వార్తాపత్రికల్లోనూ వినే, చదివే తెలుగును వ్యావహారికమని పల్లెటూళ్లలో గ్రామీణులు మాట్లాడే తెలుగును గ్రామ్యమని - ఇలా తెలుగును ఎన్ని రకాలుగా మాట్లాడవచ్చో ఆయన వివరించి చెప్పేవాడు గ్రామ్యాన్నే మనం మాండలికం అంటాం
మాండలికానికి ఉదాహరణగా వేణుమాధవ్ ఒక జోక్ చెప్పేవాడు.
ఒకసారి అప్పట్లో, అంటే 1956లో ఆంధ్రప్రదేశ్ యేర్పడిన కొత్తల్లో తెలంగాణకు చెందిన కె.వి.రంగారెడ్డి అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి దగ్గరకు వెళ్ళి "యేం సంజీవరెడ్డి! నాకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతివి?" అని అడిగాడట అప్పుడు సంజీవరెడ్డి "నీ వెనక జనం లేరు గదప్పా!" అన్నాట్ట. అప్పుడు కె. వి. రంగారెడ్డి "నువ్వు నాకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆళ్ళే వస్తరు" అన్నాట్ట. కె. వి. రంగారెడ్డి గొంతును, సంజీవరెడ్డి గొంతును అనుకరిస్తూ వేణుమాధవ్ ఈ జోక్ చెప్పినప్పుడు జనమంతా గొల్లున నవ్వేవారు. కె. వి. రంగారెడ్డి గొంతులోని తెలంగాణ యాసను, సంజీవరెడ్డి గొంతులోని రాయలసీమ యాసను, వేణుమాధవ్ చాలా అద్భుతంగా ధ్వనింపజేసేవాడు
శిష్టవ్యావహారిక భాషకు ఉదాహరణగా సినిమాల్లో నటీనటులు మాట్లాడే సంభాషణల్ని ఉదాహరణలుగా చెప్పేవాడు. ఎన్. టి. రామారావు, నాగేశ్వరరావు మాట్లాడుకున్నప్పుడు వినిపించే తెలుగును ఆయన వ్యవహారిక భాషకు ఉదాహరణగా చెప్పేవాడు. ఇలా చెణుకులను, భాషలోని వివిధ పలుకుబళ్ళను, యాసలను, సామెతలను, జోక్స్ను ఆయన ప్రదర్శించే విధానం తెలుగు భాషలోని అనేక వైవిధ్యాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడేది. ఆయనకు తెలుగంటే విపరీతమైన అభిమానం ఉండేది. ఎన్ని మాండలికాలున్నా, ఎన్ని యాసలున్నా తెలుగుభాష ఒక్కటే అనే వాస్తవాన్ని ఆయన అనేకసార్లు చెబుతూండేవాడు.
కళకు ప్రాంతీయ భేదాలు ఉండకూడదని కళ అనేది ప్రపంచ ప్రజలందర్నీ యేకం చేయ్యాలని అంటుండేవాడు. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి (UNO) జనరల్ అసెంబ్లీలో మిమిక్రీ ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి మిమిక్రీ కళాకారుడు వేణుమాధవ్
అక్కినేని నాగేశ్వరరావు అనేకమార్లు మా సినిమా హీరోలకంటే వేణుమాధవ్ ఎన్నో రెట్లు గొప్పవాడు అని చెబుతుండేవాడు. ఎందుకంటే "సినిమా హీరోకు మేకప్ వేసే వాడుంటాడు. డైలాగ్స్ రాసేవాడుంటాడు, ఇంకా ఎంతో మందుంటారు. కానీ వేణుమాధవ్ ఒక్కడే మిమిక్రీ కళను ప్రదర్శిస్తూ వేలమంది సినిమావాళ్ళను మనముందుంచుతాడు" అంటాడు ఏ. ఎన్. ఆర్
వేణుమాధవ్కు స్నేహితులంటే ఎంతో ఇష్టం ఆయనకున్న ముగ్గురు స్నేహితులు - సి. నా.రె, మిక్కిలినేని, గుమ్మడి - తనతో కలుపుకుని ఈ నల్గుర్ని "ఇష్టచతుష్టయం" అనేవారుట. వీళ్ళు నల్గురు అనేకసార్లు కలుసుకొని ఒకరికొకరు తోడునీడగా ఉండేవారు.
నన్నూ వేణుమాధవ్ చాలా అభిమానించేవాడు. ఒకసారి ఆయన హైదరాబాద్లో మోకాలు ఆపరేషన్ (Knee Replacement Operation) చేయించుకుని వరంగల్కు తిరిగొస్తూ తన ఇంటికి వెళ్లకుండానే "నవీన్ను కలిసిపోవాల"ని మా ఇంటికొచ్చి గంటసేపు కూర్చొని వెళ్లాడు. నాల్గు రోజులు కనిపించకపోతే "నవీన్ గారూ! ఎలా ఉన్నారు?" అంటూ పలకరించేవాడు నాకొచ్చిన అవార్డులన్నీ మీకూ వస్తాయి" అంటుండేవాడు. ఆ మహా కళాకారుడికి నా జోహార్లు. నా జీవితంలో ఆయన లేని లోటును ఎవరూ పూడ్చలేరు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
అ
ఇక తెలుగు వెబ్సైట్లకు గూగుల్ యాడ్స్ సపోర్ట్
ప్రజాదరణ పొందిన తెలుగు వెబ్సైట్లకు ఇక గూగుల్స్ యాడ్వర్డ్స్, గూగుల్ యాడ్సెన్స్ మద్దతుతో ప్రకటనలు లభించనున్నాయి. దీంతో తెలుగు పబ్లిషర్లు, ప్రకటనకర్తలు ఇంటర్నెట్లో అసంఖ్యాకంగా ఉన్న తెలుగు వారికి చేరువకావచ్చు. 'గూగుల్ ఫర్ తెలుగు' పేరుతో 27 - 6 - 18న జరిగిన ఒక కార్యక్రమంలో కంపెనీ ఆగ్నేయాసియా భారత మార్కెట్ల వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ మాట్లాడారు. 'ఇంటర్నెట్లో భారతీయభాషల కంటెంట్కు విపరీతమైన డిమాండ్ ఉంది ఇది రోజురోజుకీ భారీగా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలుగు వెబ్సైట్లు బ్లాగులకు కూడా ప్రకటనల ఆదాయం సమకూర్చేందుకు గూగుల్ యాడ్వర్డ్స్ గూగుల్ యాడ్సెన్స్ను అందుబాటులోకి తెస్తున్నాం' అన్నారు.
గత 18 నెలల్లో నెట్ వినియోగదారుల సంఖ్య భారత్లో పెరిగినంత వేగంగా మరెక్కడా పెరగలేదన్నారు. ప్రస్తుతం కొత్తగా ఇంటర్నెట్ వినియోగిస్తున్న ప్రతి పదిమందిలో తొమ్మిది మంది భారతీయ భాషల్లోనే నెట్ చూస్తున్నట్టు ఆనందన్ చెప్పారు. 2021 నాటికి యాభై కోట్ల మందికి పైగా నెట్ వినియోగదారులు భారతీయ భాషల్లో నెట్ వినియోగిస్తున్నారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రతి భారతీయుడికి ఇంటర్నెట్ చేరువ చేయాలన్నదే గూగుల్ లక్ష్యమన్నారు. ఆదాయం లేకపోవడంతో ప్రస్తుతం తెలుగులో సరైన కంటెంట్ అందుబాటులో లేకపోవడమే పెద్ద సమస్యగా ఉందన్నారు గూగుల్స్ యాడ్ వర్డ్స్, గూగుల్ యాడ్సెన్స్ టూల్స్తో ఈ లోటు తీరుతుందన్నారు.
ప్రస్తుతం దేశంలో ఆన్లైన్ ప్రకటన మార్కెట్ రూ 10,000 కోట్లు ఉంటే అందులో డిజిటల్ ప్రకటన మార్కెట్ వాటా ఐదుశాతం మాత్రమేనని గూగుల్ ఇండియా మార్కెటింగ్ సొల్యూషన్స్ డైరెక్టర్ షాలిని గిరీష్ చెప్పారు. 2021 నాటికి ఆన్లైన్ యాడ్స్ మార్కెట్ సుమారు రూ 29,250 కోట్లకు చేరుతుందన్నారు. అందులో డిజిటల్ ప్రకటనల వాటా 35 శాతం వరకు ఉంటుందని చెప్పారు. భారతీయ భాషల్లో హిందీ తర్వాత తెలుగులో ఎక్కువమంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. (ఆంధ్రజ్యోతి 28 - 6 - 2018)
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018
15