పుట:Ammanudi-May-2019.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రంలో సర్వతోముఖమైన సారస్వత కృషిచేసి వాసి కెక్కిన ప్రముఖులెందరో ఉన్నారు.

కాని, వారి మార్గం-మార్గ కవితానుకారి. వారు ఎంత నవీన సమస్య నెత్తుకొని వ్రాస్తూన్నా వారి రచనల్లో అగ్గలమైన సాంస్కృతిక వాసన గుప్పుమనక తప్పదు.

ఇక, సుబ్రహ్మణ్యశాస్రిగారు ఏది వ్రాసినా దేశపథం పట్టిస్తారు. ఆయన నాటకాల్లో అఖండ రాజమర్యాదలతో విలసిల్లే తెలుగు రాజులూ, అతి “లౌక్యం” లో ముదరబండిన తెలుగు మంత్రివృద్దులూ, మాటలాడిన ప్రతీమాటనూ కావ్యంగా మెరిపించగల తెలుగు మహాకవులూ ప్రత్యక్షమవుతారు.

కథల్లో, నిండు పాలకుండల్లాంటి తెలుగు కుటుంబాలూ, కొత్త బంతిపూవుల్లాంటి పల్లెపడుచులూ కనిపిస్తారు.

వ్యాసాల్లో, వ్యాఖ్యానాల్లో మాట పరువంతో నిశితతర్కం చూపే ఒక ఆంధ్ర మనిషి కనిపిస్తాడు. వెరసి - ఒక మాటలో చెప్పవలసి వస్తే - సుబ్రహ్మణ్యశాస్త్రిగారి రచన అంతా తెనుగు జాతికి అంకితం. దీనికోసం ఆయన తన సంస్కృతాంధ్ర సంస్కారాన్నంతా ఒకొక్కప్పుడు మూటకట్టి ఒకచోట పెట్టి..ఎంత మట్టానికైనా దిగి తెనుగు వాతావరణం సృష్టించడంలో చరితార్థులవుతారు.

ఆయన ఆంధ్రాభిమానానికి తోడు ప్రశంసార్దమైనది అసాధారణమైన అభ్యుదయదృష్టి ఈనాడు భాషా, సంఘ, సంస్కారాల గురించి ఎవరు ఎట్లా మాటలాడినా పేల పిండి. శాస్త్రిగారు రచన చురుగ్గా చేసేనాటికి కత్తులబోను. భాషా సంస్కారం గురించి తల పెడితే చీల్చి చెండాడే వృద్దపండితులొక ప్రక్క సమాజ సంస్కారం గురించి ఎత్తితే నిప్పులు చెరిగే సనాతన వాదులు రెండో పక్క రెండు కక్ష్యలనూ ధిక్కరించి, తాను నమ్మిన భావావళిని రచనల ద్వారా ప్రచారం చెయ్యడంలో-గుండెలు దీసిన బంటు శ్రీ శాస్త్రిగారు.

స్త్రీ వునర్వివాహ విషయంలో వీరేశలింగం పంతులుగారి వాక్కు ప్రభుసమ్మతంగా హుంకరిస్తే... శాస్త్రిగారి కథలు కాంతా సమ్మతంగా తెలుగు గుండెలను కరిగించి వేశాయి. వితంతు దయనీయ స్థితిని లోకానికి ఇంతగట్టిగా వాదించి చెప్పిన వకీలు మరొకరు కనిపించరు.

చేసే చేసే గ్రాంథికాంధ్ర రచనను విడిచి తెనుగు మసస్సులోనికి దూనుకువెళ్ళి వాడుక భాషను వట్టుకున్నారు. గ్రాంథికం మార్చి వ్యవహారికం చెయ్యవచ్చు. కాని యీయన వ్యానహారం వేరు. ఇంకొకరికి పట్టుబడడు. ఈయన రచన ఏదిచదివినా ఇది కసబడి పోతుంది!

శాస్త్రిగారి రచనల్లో ఒక పరమోద్దేశం స్పుటంగా కనబడుతుంది. హిందువుల ఆర్షమతం చాలా గొప్పదే. అయితే ఏం లాభం? అది శిధిలమూ, విషమమూ అయిపోయింది. దాన్ని అభిమానంతో కప్పితే ఏం లాభం? దాని కలరూపు స్పష్టంగా గుర్తించి ధైర్యంగా సంస్కరించాలి. ఈ భావ ప్రచారం కోసం అగ్రజాతుల అహంకారాలూ, మాలిన్యాలూ, అన్యమత మాత్సర్యాలూ, సోమరితనం, స్త్రీల పతనం వస్తువులుగా తీసుకుని పరశ్ళతంగా రచనలు సాగించారు.

శాస్త్రిగారి రచనలు రెండు విధాలుగా విభజించవచ్చును.

1. ప్రగతిశీల రచనములు

2. రసైక రచనములు, అని.

ఒక సిద్ధాంతం ప్రచారం చెయ్యడానికి రమణీయ సన్నివేశాలు కల్పించి చేసిన రచనలు మొదటి తరగతివి.

ఉన్న విచిత్ర సంవిధానాలను, వింత కథలనూ ఉపయోగించుకొని ప్రజ్ఞతో కావ్యత్వ సిద్ధిని పొందించిన రచనలు రెండవ శ్రేణికి చెందుతాయి. శాస్త్రిగారు యీ రెండు విధాలైన రచనలూ సమృద్ధిగానే చేశారు.

1 మార్గదర్శి 2. మొదటి దాడి 3. పెళ్లాడ దగ్గ మొగాడేడే 4 తాపీ మేస్త్రి 5. తల్లిప్రాణం 6. ఇల్లాంటి తవ్వాయి వచ్చిపడితే మొదలైన కథలనేకం తొలి జాతివి.

రాజరాజు నిగళబంధనం, కలంపోటు మొదలైన నాటకాలూ, వడ్లగింజలు, యావజ్జీవంహోష్యామి, ఇల్లుబట్టిన.... ఆడపడుచు, గులాబీ అత్తరువూ మొదలైన కథానికలూ రెండవజాతికి చెందినవి.


శాస్త్రిగారి రచనలమాట తల పెట్టేసరికి -మొట్టమొదట చిన్నకథలు జ్ఞాపకం వస్తాయి. ఎన్నాళ్లకిందట చదివినా ఆ కథల్లోని సన్నివేశాలూ, పాత్రలూ, అన్నింటినీ మించిన కథ చెప్పే ఒడుపూ మనస్సులోనుంచి చెరిగి పోదు.

వడ్లగింజల్లో తంగిరాల శంకరప్పగారినీ, దివాంజీగారినీ తెలుగు పాఠకులు మరచిపోగలరని నేననుకోలేను.

“ఇల్లుబట్టిన...ఆదబడుచు” కథలో ఒక సాధారణ (బ్రాహ్మణ కుటుంబ సన్నివేశం ఎంత నేర్పుగా చిత్రించారో, వడ్లగింజల్లో గంభీరమైన ఒక తెనుగు దివాణాన్ని అంత లోకజ్జతతో వర్ణించారు. ఈ రచనలో శాస్త్రిగారి రచనా సౌందర్యం “పరిణత ్రజ్ఞస్యవాణీ మియామ్‌” అన్నట్టుంది. దాన్ని ఇంకా వివరించడానికి ఈ సంకుచిత స్థలం చాలదు.

సరిగ్గా ఇదే రంగస్థలం మీద గులాబీ అత్తరుతో షుకురల్లీ కనిపించి, “ఇదేనా తెనుగు జాతి రసికత” అని ఎర్రని కళ్లతో అడుగుతూ ఉంటే మన తెల్లని కళ్లు చెమ్మగిలుతూ ఉంటాయి.

మార్గదర్శి అంతా ఒక ఉపన్యాసం. కాని విసుగు పుట్టించదు. అందులో కొన్ని కథలు చరచర పరుగెత్తుతాయి. ఇందులోని టెక్సిక్‌ చిత్రమైనది. ఉద్యోగం పేరిట బానిసతనానికి ఎగబడే బ్రాహ్మణ యువకుల భావరుజకు ఈ రచన సంజీవిగా పని చేస్తుంది.

“శ్రుఖికేశిర ఆరోహ” అనేది ఒక చురుకైన “శటైర్‌”. అచ్చపు తెనుగు కుటుంబంలో అతకని ఉత్తర హిందూ నాగరికతా వ్యామోహాన్ని చమత్కారంగా నిరూపించి చాలా మంది ఆంధ్ర యువకుల భావ దాస్యాన్ని హేళన చేశారు. ఇందులో. అంతేగాదు - శాస్త్రిగారికి హిందీభాషమీద ఉండే సదభిప్రాయం కూడా దీనిలో తొంగిచూస్తూ కనబడుతుంది.

తల్లిప్రాణం ఒక మంచికథ. టీ కప్పులో తుఫాను అన్నట్టు ఒక బ్రాహ్మణ కుటుంబంలోని భావ సంఘర్షణ ఇందులో ఇతివృత్తం. శిథిలమైన సనాతనాచారానికి ఒక ముసలి వితంతువు ప్రతినిధి. పొంగివచ్చే సంస్కార వాహినికి ఒక ప్రోడ తెనుగు ఇల్లాలు ఆలంబం. మధ్య నిస్సహాయుడైన యజమాని యొక్క సంశయాత్మ, ఫలితం -

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మే 2019

31