ప్రకరణము ౧౫ - పాదుషాతో రాయబారము
షాఆలము పంపిన రాయబారులు పాదుషాకు సకలవృత్తాంతమును నివేదించిరి. పాదుషా సంతోషించుటకు బదులు మండి పడెను. అంతధనము లూటీ కానిచ్చినందులకు షాఆలము చేతఁ గానివాఁడనియు బుద్ధిహీనుఁ డనియు అఱచెను. తనకుమారుఁడు లూటీలో చాలభాగము దాఁచుకొని కొంతయే తనకుపంపి ద్రోహముచేసియుండునని యనుమానించెను. అందుచే మొగలాయీలు రెండవమారు గోలకొండమీఁదికి దాడివెడలిరి. అక్టోబరునెల 1685 సంవత్సరము షాఆలము మొదట డోబీపేట మీఁదుగా హైదరాబాదునకు పదునాఱుమైళ్లు పడమటినుండి గగౝపహారి పేటకు వచ్చియుండెను. అచ్చటినుండి ఇప్పడు ఘోషామహలు నగరునకుపోయి కోటకుచెంత తానాషాయొక్క ఉద్యానవనమును ఆక్రమించెను. కొన్ని దినములవఱకు అక్కన్న మాదన్న తానాషాలు రాజకుమారునితో రాయబారములు జరుపుచుండిరి. పాదుషా కోరినదెల్ల తాముచేయుటకు సంసిద్ధుల మని తెలుపుచుండిరి. పాదుషా సంధినిబంధనలలో దేశభాగమును డబ్బునుగాక పైపెచ్చు అక్కన్న మాదన్నలను తొలఁగించుట ప్రధానభాగ మైనది.
షాఆలము తానాషాప్రార్థనపై గోలకొండనుండి లేచి నలువదియెనిమిదిమైళ్లదూరమున కుహిర్ అను చోటికిపోయి పాదుషా ఆజ్ఞను తానాషా నిర్వహించు నని ఎదురుచూచు