పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

అక్కన్న మాదన్నల చరిత్ర

తానాషా అందుకొని ‘ఔను. నీకు కలలో వచ్చిన భగవదాజ్ఞ నాకు మెలఁకువలోనే వచ్చినది. భగవదాజ్ఞను నెఱవేర్పుము.’ ఖిలేదారు ఆశ్చర్యపడెను. ఆతర్వాత కొన్ని నిముసముల కంతయు తానాషా మరణించెను. తత్క్షణమే ఖిలేదారు ఢిల్లీపాదుషాకు తెలుపకయే తానాషా శవమును కొనిపోయి ఆతని గురువు సమాధికి ప్రక్కన పాతి సమాధి కట్టించెను. ఇందు చేతనే ఈయన గోరి గోలకొండలో లేదు. గురుశిష్యులు మరల కలసికొనిరి. ఆయన స్థానము భక్తులతోగాని ప్రభువులతో కాదు. తానాషా చనిపోయిన నాటి తారీఖు తెలియదుగాని జీవితకాలము ఏబదియాఱేండ్లు.

తానాషా ఖైదులో పడిన తర్వాత ఆతని కొక కుమారుఁడు పుట్టెను. సుల్తానుగాన ఆతనియంతఃపురముకూడ నాతనితో దౌలతాబాదులోనే యుండెను. ఆపిల్లవానికి బందిసుల్తానని ఇతరులు పేరుపెట్టిరి. అతఁడు పెద్దవాఁ డైనంతట పాదుషా వానికి ఆస్థానమునకు వచ్చుట కనుజ్ఞయొసంగెను. కాని ఆ బాలుఁడు వచ్చుట కారంభించినంతట తానాషా పూర్వభృత్యులకు వానియందు దాక్షిణ్యభక్తులేర్పడి వారందఱును అతనికి సలాము లిడసాగిరి. ఈవిషయము పాదుషాకు తెలియఁగానే వానిని ఆస్థానమునకు రానీయక రహస్యముగా చంపించెను.