పుట:Adhunikarajyanga025633mbp.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభుత్వముల నడపునది మంత్రివర్గములు. మంత్రివర్గములకు, ప్రభుత్వాధికారముల నడపుటకు ధనమగత్యము. ధనమును శిస్తులద్వారా ఇవ్వగల్గునది శాసనసభలు. కనుక ధనాధిపత్యముబొందిన శాసనసభలకు, ధనాభావముకల్గిన మంత్రివర్గము లొంగియుండుట సహజమే! ఈశతాబ్దారంభమునుండియు ప్రభుత్వపు సాధారణఖర్చులకే గాక, బీదసాదలు, అనాధలు, అబలులు, మున్నగువారి రక్షణార్థమై వారిజీవితము శుభప్రదముగా నొనర్చుటకై ధనికులపై శిస్తులవేసి వసూలైనధనమును ఖర్చిడుట మేలను భావము ప్రచారితమైనది. ఏకొలదిమందియో కోటీశ్వరులై యుండ, ప్రజలెల్లరు నిర్ధయులైయుండుట క్షేమకరము గాదుగాన, ధనికుల నుండి కొంతధనమును శిస్తులరూపకముగా గైకొని, బీదలపై ఖర్చిడుట ప్రభుత్వధర్మమని తలపబడుచున్నది. బీదలు శిస్తుల చెల్లింపజాలరుగాన అసలే తినుటకు లేని వారిమీద శిస్తులువేయుట కూడదు. గనుక శిస్తులభారము ధనికులపైననే మోపుట శుభమని ఎల్లరియభిప్రాయము. కనుకనే ధనికులపై బడు ఆదాయపుపన్నులు హెచ్చగుట, బీదలపైబడు ఉప్పు, కాఫీ, పంచదార, పొగాకు శిస్తులు తగ్గుచుండుట జూచుచున్నాము. ఎంతవరకు శాసనసభలు ప్రజలయందీవిషయమున సంతృప్తికల్గించుచుండునో అంతవరకు ప్రజాస్వామికము సురక్షితమవును.


___________________