పుట:Adhunikarajyanga025633mbp.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చూచుట కధికారము పొందుటవలన, ప్రభుత్వమెల్లప్పుడు తనకు బాధ్యతకల్గియుండునట్లు చేయుట శాసనసభలకు సాధ్యమగుచున్నది. ఈదినములందు ప్రభుత్వము అన్నిదేశములందును, ప్రజల ఆర్థిక సాంఘికాభివృద్ధి కొరకైకూడ, అపారమగు ధనమును వెచ్చించుచున్నది. ప్రజల జీవితమునందనేక సమయములం దనేక వ్యవహారములలో, ప్రభుత్వపు జోక్యము కల్గుచున్నది గాన, ఆప్రభుత్వమును నడపు శాసనసభ ప్రజల జీవితమం దత్యంత ప్రాధాన్యత వహించుచున్నది. రాచకీయపక్షపు లేక బృందముల ఏమంత్రివర్గము నిలుపవలెనో అను విషయము, ఆయారాచకీయపక్షములయొక్క బడ్జెట్టు కార్యప్రణాళికలపై ఆధారపడియుండును. ఇంగ్లండునందు హెచ్చుశిస్తుల చెల్లింపనిష్టపడనిచో ప్రజలు కన్సర్వేటివు పార్టీవారిని బలపరచి, కన్సర్వేటివు మంత్రివర్గమును తెచ్చుకొందురు. కాని ప్రభుత్వపు కార్యభారము హెచ్చుచేసి బీదసాదలకు హెచ్చుప్రభుత్వసహాయము కల్గించుటకుగా హెచ్చుశిస్తుల వేయుటకు ప్రజలిష్టపడుచో, లేబరుపార్టీ జయమందుటయు లేబరుమంత్రివర్గము ఏర్పరుపబడుటయు జరుగును. కనుక శాసనసభలయందెప్పుడెప్పు డిట్టియభిప్రాయములు, ప్రభుత్వపుధర్మముల గురించి ప్రచురమైయుండునో ఆయభిప్రాయముల కనుకూలమగు మంత్రివర్గములే స్థాపించబడుచుండును.