పోయిన దుష్టులు మాసవతితల్లిగారిచే బంపబడినవారు. నేనికమీద నిచ్చటనుండిన పక్షమున, నీయన్నగారు మాతండ్రికి సామంతుడుగాన, నతనికి జేటు వాటిల్లును గనుక, నేను పట్టణ సంస్థానమునకుబోయి యచ్చట నుద్యోగమును సంపాదించుకొని, నిన్ను బిలిపించుకొందును. పోవుటకు ననుజ్ఞయిమ్ము అని పలికెను. అందుపయి వీరమతి, తన్ను వెంటదీసికొని వెళ్ళవలయునని తొందర పెట్టసాగెను. అందుమీద జగదేవుడు బావమరదియగు బిరజుని సమ్మతి బుచ్చుకొని, భార్యను వెంట దీసుకొని పోవుటకు సమ్మతించెను. వెంట గొంతసైన్యము దీసి కొనవలసినదని బిరజుడు బలవంతపెట్టెనుగాని, యందుకు జగదేవుడు సమ్మతింపక పోయెను. భార్యాభర్తలిరువురు రెండుగుర్రములపయినెక్కి, యుద్ధమునకు నుపయోగించు శస్త్రములను వెంట దీసుకొని, పట్టణమునకు బయలుదేరిరి.
ఇట్లుప్రవాసము చేయుచు వారొకనాడు మధ్యాహ్నమొక యూరిలోదిగి, భోజనముచేసి, విశ్రమించి, యచటి వారిని పట్టణమునకు ద్రోవయేదియని యడుగగా, వారు రెండు దారులుగలవనియు, నందొకదారిలో మనుష్యులను దిను రెండు బెబ్బులులున్నవనియు జెప్పిరి. అప్పుడు పులులున్న త్రోవనే మనము వెళ్లి, వానిని వేటాడి చంపి లోకుల కుపకారము చేయుద మని వీరమతి జగదేవునితో జెప్పెను. భార్యయొక్క శౌర్యోత్సాహములను జూచి జగదేవుడు సంతసించి యాదారినే వెళ్లుటకు సమ్మతించెను. వారాత్రోవను నాలుగు క్రోశముల దూరముపోగానే వారు "ఈ క్రూరమృగమునుజంపి మాప్రా