వారు రెండు పక్షముల వారయి సైన్యసహితులగుట గని మి ఆన్ మంజూ మిగుల చింతించి అక్బర్ బాదుషా కొడుకగు మురాదను నాతనికి మీరు నాకు సహాయము చేసినచో అహమ్మదనగరము మీస్వాధీనము చేయుదునని వర్తమానము నంపెను. కాని మురాద్ సైన్యసహితుడయి వచ్చులోపల అహమ్మద నగరమునం గల రెండుపక్షముల వారికిని యుద్ధము జరిగి సిద్దీలను మి ఆన్ మంజూ ఈడించెను. కాన దా ననిన ప్రకారము అహమ్మద నగరము మురాద్న కిచ్చుటకు సమ్మతింపడయ్యె. అంత నారాజపుత్రుడు యుద్ధసన్నద్ధు డయ్యెను. ఆసమయమున నీప్రధాని సైన్యమునంతను ఆదిల్షహా, కుతుబ్ షహాలను సహాయమునకు బిలువబోయెను. అత డరిగినపిదప బహదుర్ రాజ్యమని చాటించి చాందబీబీ రాజ్యమును తానే నడుపుచుండెను.
ఆ సమయమునం దిద్దరు ముగ్గురు రాజ్యము తమకే కావలయునని యనుటవలన నచటి లోకులు రెందు మూడు పక్షములుగా నుండిరి. ఇట్టిసమయమున చాందబీబీ తన దృడ నిశ్చయము విడువక, నేహంగఖానునకును శహా అల్లీ సిద్దీకిని వర్తమానములనంపి వారిని రాజధానికి బిలువనంపెను. చాందబీబీ యాజ్ఞప్రకారము వా రిరువురును వచ్చుచుండగా త్రోవలో శత్రువులు వారిని రానియ్యక నిలిపిరి. నేహంగఖాన్ మాత్రము శత్రుసైన్యము నుపాయముగా జీల్చి రాజధానిం బ్రవేశించెను.