దేశాటనము చేసినపు డాయాతావుల యందలి సోదరీమణులకు నైకమత్యము, సత్కాలక్షేపముచే దోడిసోదరీతతిని బాగుచేసి తాము బాగుపడెడి విధానము మున్నగు ధర్మములను బోధించుచు వచ్చినది.
ఎట్టివిపరీతపు స్వభావము కలవారినైను ధన సౌజన్యముచే దన కనుకూలముగా ద్రిప్పుకొను చాతుర్యమీమెకు జక్కగ సాధ్యమైయుండెను. ఇందుకు గొప్పయుదాహరణ మీమె భర్తయే. ఆయన తొలుత మిక్కిలి కోపమును, స్త్రీలను గారాగృహమువంటి ఘోషాలోనుంచిన గాని పాతివ్రత్య రక్షణము జరుగనేరదను రూహను కలిగియుండెడివారు. ఆయన యిచ్చ ననుసరించి యీ సాధ్వి మొట్టమొదట కారాగృహమువంటి ఘోషా ననుభవించి, తన సౌజన్యమువలనను, అనుపమేయ ప్రవర్తన చాతుర్యమువలనను బతిని శాంతస్వభావునిజేసి స్త్రీలకు విద్యయు, నుచిత స్వాతంత్ర్యమును సామాజోద్ధారణకు మూలాధారములని యాయనకు దోచునట్లు చేసెను.
ఈమె పాతివ్రత్యానుష్ఠానము వర్ణనాతీతము. ఈమె జగత్పూజ్యము గా రచించిన 'అబలా సచ్చరిత్ర రత్నమాల' యందలి పతివ్రతా మణులగు వీరమతి, మీరాబాయి, కొమర్రాజు జోగమాంబ మున్నగువారి చరిత్రముల వ్రాయుచో వారి యుత్కృష్ట పాతివ్రత్యభావములు వర్ణించునప్పుడీమె యుత్సాహము మూర్తీభవించి ఆయాస్థలముల యందు దాండవకేళి సల్పుచున్నట్లుండును. ఒక్క కాగితమైనను సరిగానిండని కొమర్రాజు జోగమాంబగారి చరిత్ర యొక్క పాతివ్రత్య విషయముకొరకే తన రత్నమాల యందు జేర్చి యీసతి దన పాతివ్రత్యాభిమానము నగపరిచినది. ఈ యమ 'అబలా సచ్చరిత్ర రత్నమాల' గన్న వారికి దానియందలి యంకిత యామెసతీత్వవిశేషముల జెప్పకయే చెప్పుచుండును. ఈసతి సద్గుణసమితి యందలి మాకుగల యభిమానముచే వాని నిచట మరల బ్రచురించుచున్నాము. "ఎవరి పరిపూర్ణ కటాక్షంబుచే నాకీ గ్రంథము వ్రాయునంతటి శక్తియు, స్వాతంత్ర్యంబును గలిగనో, నా శరీరము నందలి చర్మంబుచే బాదరక్షల నిర్మించి జన్మజన్మంబునందు బాదంబులకు దొడిగినను నెవరిఋణంబుదీరి నేను ఋణవిముక్తురాలనగుట యసంభవమో, యెవరు నాకు దేవాధిదేవునికంటే నధికతముడైన దేవుండో, యట్టి నా ప్రియభర్తయగు మ|| రా|| శ్రీ|| భండారు మాధవరావు గారి దివ్యపాద పద్మములకు నీ గ్రంథము