క్షేపణలు, దుర్వదంతులు స్వదేశీయులైన క్రైస్తవ స్త్రీలకు లేశమును గలుగుట లేదు. పొగబండిలోగాని, వీధుల వెంటగాని నే నొంటరిగా బోవునపుడెల్ల ప్రజలు కొందరు నన్ను జేరి నా మొగమువంక నట్టే చూచుచు కొంటెప్రశ్నలచే నన్నలయింపు చుందురు. ఈ పొడిమాటలకంటె కొన్ని యుదాహరణముల వలన నిజము మీ మనసులకు నాటజెప్పెదను చిత్తగింపుడు.
కొన్ని సంవత్సరముల క్రిందట నేను బొంబాయి నగరమున నుండగా పాఠశాలకు బోవుచుంటిని. చేత పుస్తకములం బట్టుకొని నేను బడికి బోవుచుండునపుడు కొందరు కిటికీలగుండ నన్ను చూచువారును, మరికొందరు బండ్లెక్కి పోవుచు నన్ను జూచువారును, వీధులలో ద్రిమ్మరుచుండు నిక కొందరు పెద్దపెట్టున నవ్వుచు "ఇదేమి వింత! కాళ్ళకు మేశోళ్ళను బూట్సులను దొడిగికొని పాఠశాల కేగు నీ గరిత యెవ్వతె! ఇందు మూలమున కలి యప్పుడే ప్రజలమనసుల నావహించినజాడలు బొడగట్టుచున్నవిగదా!" యని నాకు వినబడునట్టుగా కోలాహలముగా బలుకువారుగ నుండిరి.
ఓమానినీమణులారా! అట్టిప్రశ్నలను మిమ్మడిగినప్పుడు మీ మనసెట్టి సంతాపమును బొందెడినో మీరే సులభముగా నూహించి తెలిసికొనగలరు.
ఒకప్పుడు నేను కొంతకాలము పాఠశాలలో నుండవలసివచ్చి భోజనము నిమిత్తము దినమునకు రెండు సారులు బంధువుల యింటికి బోవలసి వచ్చెను. నేనపు డట్లు పోవుచు వచ్చుచున్నప్పుడెల్ల వీధి వెంట నేగువారు నా చుట్టును జేరి