ఇట్టి రత్నమాలలు మూడుగ్రుచ్చి జనులకు సమర్పింప వలయునని నే దలచితిని. అవి యేవి యనిన:-
1. అబలాసచ్చరిత్ర రత్నమాల యొక్క మొదటిభాగము:- ఇందు హిందూదేశమునందు బుట్టిన యైతిహాసిక స్త్రీల చరిత్రము లుండును. ఐతిహాసిక కాల మనగా వేయి సంవత్సరములనుండి నేటివరకు జరిగినకాలము. ఈ భాగమునందు పద్మావతి, సంయుక్త మొదలయిన ప్రాచీనస్త్రీలు మొదలుకొని, ఆనందీ బాయి మొదలయిన యర్వాచీన స్త్రీలవరకు నయిన యుత్తమ స్త్రీల చరిత్రములు రాగలవు.
2. రెండవభాగము:- ఇందువైదిక పౌరాణిక బౌద్ధ స్త్రీలయొక్క చరిత్రములు రాగలవు. వైదిక స్త్రీలనగా వేదమందు వర్ణింపబడిన గార్గి, మైత్రేయి మొదలయిన స్త్రీలు, పౌరాణిక స్త్రీలనగా పురాణాదులలో వర్ణింపబడిన పార్వతి, సీత, తార, దమయంతి, ద్రౌపది మొదలయిన స్త్రీలు.
3. మూడవభాగము:- ఇందు ఇంగ్లండు మొదలయిన పరదేశములలోని స్త్రీలచరిత్రము లుండగలవు.
కాలమానమునుబట్టి చూడగా రెండవభాగములోని వైదిక, పౌరాణిక స్త్రీలు మొదటిభాగమునందును, మొదటి భాగమునందలి యైతిహాసిక స్త్రీలు రెండవభాగమునందును రావలసియుండును. కాని, ప్రస్తుతము రెండవభాగమువ్రాయుటకై