పుట:Abaddhala veta revised.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలెగ్జాండ్రియా లైబ్రరీలో పనిచేసిన సుప్రసిద్ధ టాలమీ మొదలు న్యూటన్, కెప్లర్ వరకూ జ్యోతిష్యాన్ని నమ్మారు. ఆధునిక కాలంలో సైకాలజిస్టు కార్ల్ యూంగ్.ఇసెంక్ లు నమ్మారు. శాస్త్రీయంగా జ్యోతిష్యాన్ని రుజువుచేయాలని కృషిచేసి విఫలమయ్యారు. జ్యోతిష్యం అశాస్త్రీయమని రుజువైంది. అయినా అది వదలడం లేదు!

కెప్లర్ కాలానికి ఆరు గ్రహాలే తెలుసు. ఆ తరువాత ఖగోళవిజ్ఞానం మరో మూడు గ్రహాల్ని కనుగొన్నది. ఇండియాలో ప్రాచీనకాలం నుండి నవగ్రహాలను అంటిపెట్టుకున్నారు. ఉత్తరోత్తరా ఖగోళవిజ్ఞానం ప్రకారం కనుగొన్న ప్లూటో, యురేనస్, నెప్ట్యూన్ చేర్చలేదు అంటే అన్ని గ్రహాల ప్రభావాన్ని భారతీయ జ్యోతిష్యం పరిగణలోకి తీసుకోకుండానే, మనిషి భవిష్యత్తును అంచనా వేస్తున్నాయన్నమాట. మరి గ్రహాల ప్రభావం నిజంగా మనిషిపైవుంటే భారతీయ జ్యోతిష్యం వదలివేసిన గ్రహాల మాటేమిటి? అసంపూర్తి అంచనాలు సరైనవి ఎలా అవుతాయి? భారతీయ జ్యోతిష్యంలో గ్రహాలకూ,నక్షత్రాలకూ తేడా కూడా తెలియకుండా గ్రంథాలు రాశారు. సూర్యుడు నక్షత్రాలలో ఒకటి. అది స్వయంప్రకాశం. అదికూడా ఒక గ్రహంగా పేర్కొన్నారు. నవగ్రహాలకు వెలుగు వుండదు. గ్రహాలు సూర్యుని వెలుగు స్వీకరిస్తాయి.

నవగ్రాహలలో రాహువు, కేతువు అనేవి కేవలం గ్రహణం సందర్భంగా ఏర్పడే నీడ మాత్రమే. అదికూడా గ్రహంగా భావించడం తెలియకనే. భూమి చుట్టూ తిరిగే చంద్రుణ్ణి కూడా గ్రహాల్లో చేర్చారు. ఈ విధంగా ఖగోళశాస్త్రానికి భిన్నంగా లోపభూయిష్టంగా వున్న భారతీయ జ్యోతిష్యం యింకా ఎందరినీ నమ్మిస్తున్నదంటే, మనం ఎంత వెనుకబడివున్నామో గ్రహించాలి.

మూఢనమ్మకాలు మన గుత్తాధిపత్యం కాదు. యూరోప్, అమెరికాలలో సైతం జ్యోతిష్య వ్యాపారం సాగుతూనే వున్నది. ఒక రంగంలో చదువుకున్నవారు తమకు తెలియని ఇతర రంగాల విషయాలన్నీ అద్భుతాలని భావిస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ వంటి పత్రిక జ్యోతిష్యాన్ని ప్రచురించడంలేదు. కాని వాషింగ్టన్ పోస్టు వంటివి రాశిఫలాల్ని వేస్తున్నాయి. అమెరికా మూఢనమ్మకాల వ్యతిరేకసంఘం విజ్ఞప్తి చేయగా, కొన్ని పత్రికలు జ్యోతిష్యం అసలే మానేశాయి. పాఠకులను వంచించటంలో భాగమే జ్యోతిష్యం ప్రచురించడం.

శాస్త్రజ్ఞులు ఖగోళ పరిశీలన చేసిన అనంతరం గ్రహాలకు, నక్షత్రాలకు ప్రాచీన గ్రీకు, రోమన్ దేవుళ్ళ పేర్లు పెట్టారు. అదికూడా మూఢనమ్మకాలను అట్టిపెట్టడానికి దోహదం చేస్తున్నది.

జ్యోతిష్యం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రాచీనులు భయంతో కథలు అల్లి,వాటినే నమ్మినట్లు తెలుసుకోవచ్చు. గ్రహాలకు, నక్షత్రాలకు,ఆకాశంలో జరిగే వాటికీ దైవ ప్రభావాన్ని చూచారు.

జ్యోతిష్యంలో పేర్కొనే గ్రహాల ఆధారంగా, ఆకాశంలో రాశిచక్రాలను వూహించారు. ఆకాశాన్ని విభజించి రాశిచక్రాలు వేయడం పూర్వీకుల కట్టుకథల ప్రతిభకు నిదర్శనం. భారతీయులు,