పుట:Abaddhala veta revised.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పునర్వికాస పరిణామం
హిందువులు మళ్ళీ పునర్వికాసం ఆరంభించాలి

భారతదేశంలో హిందువులు అత్యధిక సంఖ్యలో వున్నారు. ముస్లింలు అల్పసంఖ్యాకులు. క్రైస్తవులు మరీ తక్కువ. సిక్కులు ఒక రాష్ట్రంలో అధికంగా వున్నారు. బౌద్ధులు, పార్సీలు కూడా అల్పంగానే వున్నారు. అల్పసంఖ్యాకులు భయపడడం, తమ సంస్కృతిని, మనుగడను కాపాడుకోవాలనుకోవడం సహజం. కాని అటువంటి ధోరణి అధికసంఖ్యాకులైన హిందువులు కనబరుస్తున్నారు. ముఖ్యంగా కొన్ని సంఘాలు హిందువుల సంఘటన పేరిట తరచు ఆందోళనలు చేస్తున్నవి. ముస్లింలను, క్రైస్తవులను, సిక్కులను చూపి రెచ్చగొడుతున్నారు. సంకుచిత భావాలతో ప్రజల్ని ఆవేశపరుస్తున్నారు. మతకలహాలు అప్పుడప్పుడూ సంభవిస్తున్నవి. మతద్వేషాలు నిరంతరం ప్రబలుతున్నవి.

బ్రిటిష్ వారి పాలనలో, చీలించి పాలించే ఎత్తుగడలు కూడా,హిందూ-ముస్లిం ద్వేషాలకు బాగా దోహదం చేశాయి. క్రైస్తవులుగా మార్చడంలో బ్రిటిష్ వారి మద్దత్తు లభించడం వలన అక్కడక్కడ క్రైస్తవ-హిందూ ద్వేషాలు ప్రబలాయి.

కాంగ్రెసు పార్టీ ఏర్పడిన నాటికే దేశంలో ఆర్యసమాజ్ ప్రబలి వుంది. కాంగ్రెస్ లో అతివాదవర్గం మతపరంగా హిందువులను పురికొల్పింది. రాజకీయాల్లోకి మతభావాలు ప్రవేశపెట్టిన బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాలను, శివాజి పేరిట హిందువుల ఐక్యతను కోరాడు. రాజకీయాల్లో అదొక శాపంగా పరిణమించింది. హిందూ-ముస్లిం ద్వేషాలు పెచ్చరిల్లాయి.

కాంగ్రెస్ లోని అతివాదులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా హింసను ప్రోత్సహించినారు. జాతీయవాదాన్ని, వందేమాతరం పేరిట హింసాత్మకతను కలిపేశారు. తిలక్, అరవిందో, లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్ యిందులో ప్రముఖపాత్ర వహించారు. ముస్లింలు కాంగ్రెసు పార్టీ ద్వారా తాము పోరాడలేమనుకున్నారు. ముస్లింల సంరక్షణ జరగదనుకున్నారు. అతివాదుల మతనినాదాలు వారిని భయభ్రాంతులను చేశాయి. కాంగ్రెస్ కు దూరమై ముస్లీంలీగ్ పెట్టుకున్నారు. జాతీయోద్యమంలో అంటీ అంటనట్లే వున్నారు. కొద్దిమంది జాతీయ ముస్లిం నాయకులు కాంగ్రెస్ ఉద్యమాల్లో పాల్గొన్నా, అత్యధిక ముస్లింలు వేరుగానే వుంటూ వచ్చారు. 20వ శతాబ్దం మొదటి భాగంలో హిందూ సంఘటన సంస్థలు వెలిశాయి.

హిందూ మహాసభ

లాంఛనంగా హిందూ మహాసభ 1907 నాటికే ఏర్పడినా, అంతగా వ్యవస్థీకరణ చెందలేదు. ఆర్యసమాజ్ వారి శుద్ధి ఉద్యమాన్ని బలపరచిన హిందూ మహాసభ తొలుత బలంగాలేదు. తిలక్ శిష్యుడుగా బయలుదేరిన సావర్కార్ హిందూ మహాసభలో ప్రముఖ