పుట:Aandhrakavula-charitramu.pdf/570

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

543

శ్రీనాథుఁడు

“గంధర్వాప్సరోభామినీ” శబ్దసామ్యముచేతఁ దెలుగుఁరాయనిఁ గస్తూరి వేఁడిన పద్యము నిచ్చట మరల నుదాహరింప బుద్ధి పుట్టుచున్నది.

    శా. అక్షయ్యంబగు సాంపరాయని తెనుంగాధీశ! కస్తూరికా
        భిక్షాదానము చేయురా సుకవిరాడ్బృందారకస్వామికిన్
        దాక్షారామపురీవిహారపర “గంధర్వాప్సరోభామినీ
        వక్షోజద్వయకుంభికుంభములపై వాసించు నవ్వాసనల్.

ఇది దెలుగుఁరాయని కస్తూరి వేడిన పద్యము. ఈ కస్తూరిభిక్షాదాన మెవ్వరికి? సుకవిరాడ్పృందారకస్వామికి. సుకవిరాడ్బృందారకస్వామి యెవ్వరు ? సుకవి రాజేంద్రుఁ డయిన శ్రీనాథకవి కోరబడిన కస్తూరికాఁ దాన మెట్లు సార్థక మగును ? దాక్షారామపురీ విహారపరగంధర్వాప్సరోభామినీ వక్షోజద్వయ కుంభీకుంభములపై వాసించుటచేత. ఈ గంధర్వాప్సరోభామిను లెవ్వరు ? సానివారు : ఈ పద్యము సాధారణముగా "సుకవిరాడ్పుృందారక శ్రేణికిన్" అని చదువఁబడుచున్నది గాని యది సరియైన పాఠముగాదు; శ్రీనాథుఁడు కస్తూరీ వేఁడిన సందర్భమునఁ బొసఁగదు. దీనినిబట్టి శ్రీనాథునకును దాక్షా రామగంధర్వాప్సరోభామినులకును గల సంబంధ మేదో బుద్ధిమంతులు సులభముగా నూహించి గ్రహింపవచ్చును. మానవల్లి రామకృష్ణకవిగారు తమ క్రీడారామపీఠికలో “నక్షయ్యంబుగ” అను పద్యము నుదాహరించి యా సందర్భమున “దీనిచే శ్రీనాధునకు దాక్షారామవేశ్యలతో సంబంధముగలదని వేఱుగఁ జెప్పనక్కఱలేదు. వీథినాటకములోని చిన్నిపోతియే శ్రీనాథునకుఁ గూర్చు మగువయో యని సందియము కలుగుచున్నది.” అని వ్రాసిరి.

    సీ. అలకాపురంబున నంగారపర్ణుఁ డన్
                     గంధర్వపతికన్య కమలపాణి
       యా దివ్యగంధర్వి కపరావతారంబు
                     మధుమావతోర్గంటిమండలమున