పుట:Aandhrakavula-charitramu.pdf/569

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

542

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

చీఁకటిపడఁగానే భీమేశ్వరస్వామి దాక్షారామములో భృంగిరిటీనో మఱియొకరినో కైదండగొని యంతఃపురస్త్రీలను టక్కుపెట్టి సంభోగేచ్చతో సానివీధి కరుగునఁట! దీని పయి పద్యములో దక్షపురిసానికూఁతుల దవిలినాఁడు ! విశ్వలోకకుటుంబి భీమేశ్వరుండు" అని చెప్పఁబడినది దీని క్రింది పద్యములో

      క. పదునాల్గు మహాయుగముల
         ముదుకగు భీమేశ్వరునకు మొగచాటై యుం
         డదు సాని పెండ్లి యెప్పుడు
         నది దాక్షారామమహిమ మగునో కాదో !

దాక్షారామముయొక్క యీమహిమ యద్భుతమైనది. ఈ మహిమ శ్రీనాథుని కాలమునకే తగినది. ఆ కాలమునందు జారత్వము తప్పుగా గణింపఁబడక పోవుటయే కాక యది కలిగి యుండుటయే ప్రతిష్టావహముగాను, పురుషుల కది వర్ణనీయమైన గుణవిశేషము గాను తలఁపబడుచుండునట్లు శ్రీనాథమహా కవివర్ణనలవలనఁ గనఁబడుచున్నది. శ్రీనాధుఁడు కథారంభమునకు ముందు భీమఖండమునందు దాక్షారామపురవర్ణనము చేయుచు నా పురములో సానులు తప్ప బ్రహ్మక్షత్రియవైశ్యశూద్రు లెవ్వరును లేనట్టుగా నొక్క సానులను మాత్రమే యత్యధికముగా బహుపద్యములలో నభివర్ణించెను. సప్తగోదావరము “దేవగంధర్వాప్సరోవధూటీ స్తనస్థానక శ్రీగంధధవళితం' బఁట ! ఇందుఁ బేర్కొనఁబడిన గంధర్వాప్సరోవధూటులు సానివారు. వారి నెప్పుడు వర్ణించినను శ్రీనాధుఁడు వారి గౌరవమునకు కొఱతరాకుండునట్లుగా సాధారణముగా నిటువంటి పదములనే వారియెడఁ బ్రయోగించుచుండును. అట్టిదొక్క పద్యము మాత్రము భీమఖండములోని దుదాహరించెదను.

    మ. మొరయించువ్ వరుఁ డిక్షుచాప మనిశంబుం దక్షవాటీమహా
        పురమధ్యంబున ముజ్జగంబు గెలువం బుత్తెంచులీలం బురం
        దరవిశ్రాణిత దేవతాభువనగంథర్వాప్సరోభామినీ
        చరణాంబోరుహనూపురస్వనములన్ జంకించు ఝంకారముల్.