పుట:Aandhrakavula-charitramu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

ఆంధ్ర కవుల చరిత్రము

(వేంగినాడు) 8౦౦౦ చదరపుమైళ్ళ వైశాల్యము కలదయి పడమటను తూర్పుకనుమలకును, తూర్పున సముద్రమునకును, ఉత్తరమున గోదావరీ నదికిని, దక్షిణమునఁ గృష్ణానదికిని మధ్యస్థమయిన తెలుఁగుదేశము. మొట్టమొదట నీ వేఁగి దేశమునకు వేఁగి యను పట్టణము రాజధానిగా నుండెను. ఆ వేఁగీపురము హేలాపుర మనబడెడి యేలూరున కుత్తరమున నేడుమయిళ్ళ దూరమున నున్నది ఇది పూర్వము రెండు క్రోశముల పొడవును వెడల్పును గల గొప్ప పట్టణమయి యుండియు, మహమ్మదీయులు దండెత్తి వచ్చి నాశనము చేయుటచేతనో మఱి యే హేతువుచేతనో యిప్పడు బొత్తిగా పాడుపడిపోయి పూర్వ పట్టణము యొక్కరెండుకొనలయందును వరుసగా పెదవేగి చినవేఁగి యసు పల్లెలను మాత్రము కలిగియున్నది. ఇక్కడ నిప్పటికిని పాడుపడిపోయిన దేవాలయము లేఁబదికంటె నధికముగా నున్నవి. ఇక్కడి దేవాలయములను పడగొట్టి మహమ్మదీయు లాఱాళ్ళతో నేలూరునం దొక కోటను గట్టిరి. ఈ పెదవేఁగి రాజమహేంద్రవరమునకు దక్షిణమున నలుబదియైదు మైళ్ళ దూరమున నున్నది. పెదవేఁగి కైదుమైళ్ళ దూరములో నున్న దెందులూరివఱకును గూడ పడిపోయిన దేవాలయాదుల చిహ్నములు కొన్ని కనఁబడుచున్నవి. వేఁగీరాజ్యము నిజమైన వేఁగినాటను మాత్రమేకాక దక్షిణమునఁ గాంచీపురము రాజధానిగాఁగల పల్లవవంశజులదైన చోళ మండలము వఱకును, నుత్తరమున గంగా వంశజుల దయిన కళింగరాజ్యము వఱకును వ్యాపించి యుండెను. రాజ్యమునకు మధ్యగా నుండునిమిత్తమయి రాజధాని వేంగీపురమునుండి రాజమహేంద్రవరమునకు రాజమహేంద్రుఁడను బిరుదు నామము వహించిన యమ్మహారాజుకాలములో మార్పcబడినదని చెప్పదురు. ఈ పట్టణమునకు రాజమహేంద్రవరపుర మన్నపే రీతనిని బట్టియే వచ్చినదనియుఁ జెప్పచున్నారు " వేఁగీ దేశంబునకు నాయక రత్నంబునుబోని రాజమహేంద్రపురంబునందు" అని భారతమునందుc జెప్పఁబడుటచేతనే చాళుక్యరాజులచేఁ బాలింపఁబడుచుండిన వేఁగీరాజ్యములో రాజమహేంద్రపురము మధ్యభాగమున నున్నట్టు స్పష్టమగుచున్నది. ఆ కాలమునందు వేఁగి దేశమున కధీశ్వరుఁడును చళుక్యవంశ సంభవుఁడును విమలాదిత్యుని పుత్రుఁడును నగు రాజరాజనరేంద్రుఁడు రాజమహేంద్ర