పుట:Aandhrakavula-charitramu.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

220

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

       క. "మగణమ్ముఁ గదియు రగణము
            వగవక కృతి మొదట నిలుపువానికి మరణం
            బగు నిక్కమండ్రు, మడియఁడె
            యగు నని యిడితొల్లి టేంకణాదిత్యుఁ డనిన్."

ఈ పద్యమునుబట్టి నన్నెచోడుఁడు శుభాశుభగణపరిజ్ఞానములేనివాఁడని యధర్వణునియభిప్రాయ మయినట్టు తేలుచున్నది. నన్నెచోడుఁడు తన కుమారసంభవమునందు స్రగ్ధరావృత్తములో మగణము తరువాత రగణముండియే తీఱవలెను. ఈ నన్నెచోడకవి నన్నయభట్టారకునకును, తిక్కన సోమయాజికిని నడిమికాలమునం దున్నవాఁడు. ఇతడు తన పుస్తకము నందు సుకవి స్తుతియు కుకవినిందయు షష్ఠ్యంతపద్యములను వేసియున్నాఁడు. వీనిని వేయుటలో మొదటివాఁడని యింతవఱకును తిక్కని సోమయాజికి వచ్చిన ప్రతిష్ట యిప్పు డాతనినుండి తొలఁగి యీతనిని జేరు చున్నది.

[శ్రీరామకృష్ణకవిగారు కుమార సంభవమును పూర్తిగాఁ బ్రకటించిన ముప్పది మూఁడేండ్లకుఁ బిదప మద్రాసు విశ్వవిద్యాలయమువారును, శ్రీవావిళ్లవారును 'కుమారసంభవము" ను బ్రకటించియున్నారు. విశ్వవిద్యాలయమువారి-ప్రచురణకు శ్రీ కోరాడ-రామకృష్ణయ్యగారి విపుల 'పీఠిక' కలదు నాఁటివఱకును ఈ కావ్యమునుగూర్చి కలిగిన చర్చల నన్నింటిని పరిశీలించి యొకరీతి సిద్ధాంతముగనే శ్రీరామకృష్ణయ్యగారు కవి కాలాదులను గూర్చి వివరించియున్నారు ఆ విషయము సంగ్రహముగా నిచటc దెలుపఁబడును.

"ఈ కవికాల నిర్ణయమునుగూర్చి పరిశీలించిన వారిలో నొకరిద్దరు తక్క తక్కిన వారందరు నన్నయ తరువాతి వాఁడని నిరూపించుటకే యత్నించిరి. అందు పలువురు నన్నయ తిక్కనల నడిమికాలపువాఁడై యుండునని తలంపఁగా నిటీవల 'కుమార సంభవ విమర్శనము' ను బ్రకటించిన శ్రీ లక్ష్మీపతి శాస్త్రులుగారు తిక్కనకుఁ గూడఁ దరువాతివాఁ డగునని