కాని పోలోసోదరులును మార్కోయును, చీనా దేశప్రయాణమును విడువక సాగించిరి కుబ్లయిఖాను, వారిరాకకు చాల ముదమంది యెప్పటికంటె నధికముగ సత్కరించి యాతిథ్యము నెఱపెను. చక్రవర్తిదృష్టిని, యువకు డగు మార్కోపోలో విశేషముగ నాకర్షించెను. నాడు మొదలుకొని యాతడు చక్రవర్తి ప్రత్యేకమన్ననలకు బాత్రుడై, విశ్వాసముతో నాతని గొలిచెను. మార్కోపోలో అనతి కాలములో చీనా భాషను, తార్తారభాషను, వ్రాయను, మాటలాడను గూడ నేర్వగలిగెను. చక్రవర్తి యాతని ప్రజ్ఞాబుద్ధివిశేషముల కచ్చెరువంది దూరస్థములయిన రాజ్యము లెట్లు బరిపాలింపబడుచున్నవో, జూచి తనకు నివేదించు కొఱకు విశ్వాసపాత్రమైన నియోగిగా వొనర్చి పంపుచువచ్చెను. అత డట్లు దూరస్థములయిన రాజ్యములను సందర్శించుటకు బోయినపు డొక సమయమున, హిందూ దేశమును కూడ జూడవచ్చెను. అట్లే తెంచినపుడీ, మార్కోపోలో, కాకతీయ రాజ్యమునందు గల ప్రసిద్ధ రేవుపట్టణమున మోటుపల్లికడ నోడదిగి, కాకతీయరాజ్యములోని కేగియుండెను.
అట్లు చీనా చక్రవర్తికడ, క్రీ.శ. 1273, మొదలుకొని క్రీ.శ. 1290 వఱకును పదునేడు సంవత్సరము లూడిగము సలిపినపిమ్మట, నీవెనిషియనులు, తాము స్వదేశమునకు బోవ కుతూహలముతో, నాతురతతో నున్నామనియు, సెలవీయవలసినదని ఖానుని ప్రార్థించిరి. ఇట్లు చక్రవర్తిని యెన్నిసారులో