పుట:1857 ముస్లింలు.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విూర్జా ఇలాహి బక్ష్‌, జఫర్‌ వ్యక్తిగత వైద్యులు హకీం ఎహసానుల్లా లాంటి స్వజనుల దుర్బోధల వలన బలమైన ఆంగ్లేయులతో వైరం సాగించినట్టయితే తన బిడ్డకు నష్టం వాటిల్లగలదన్న వ్యక్తిగత స్వార్థంతో కొంతకాలం తరువాత ఆంగ్లేయాధికారులకు అనుకూలంగా వ్యవహరించిన ఆమె అపఖ్యాతి మూటగట్టుకున్నారు. చివరకు ఢిల్లీ నగరం తిరిగి ఆంగ్లేయుల పరం కావటంతో భర్త జఫర్‌తోపాటు ప్రవాసశిక్ష అనుభవిచేందుకు ఆమె రంగూన్‌ వెళ్ళారు. 1840లో తన 19 సంవత్సరాల వయస్సులో 64 ఏండ్ల బహదూర్‌ షా జఫర్‌ ను వివాహమాడి, చివరి వరకు ఆయన వెంట ఉన్న ఆమె 1862లో జఫర్‌ మరణించిన తదుపరి అతిసాదా సీదా జీవితాన్ని గడుపుతూ చివరకు 1882లో కన్నుమూశారు.

చరిత్ర ప్రసిద్దికెక్కిన ఈ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన ముస్లిం సమాజానికి చెందిన స్త్రీలు తమ అపూర్వ త్యాగాలతో, ఆత్మార్పణలతో స్వాతంత్య్రసంగ్రామ చరిత్ర పుటలను ఎరుపెక్కించారు. అటువంటి వారిలో ప్రముఖులు అవధ్‌ రాణి బేగం హజరత్‌ మహల్‌. బ్రిటీష్‌ పాలకులు కుయుక్తులతో ఆమె భర్త నవాబ్‌ వాజిద్‌ అలీషాను అరెస్టు చేసి అవధ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆయనను కలకత్తా పంపి నిర్బంధంలో ఉంచారు. ఆ సమయంలో ఇతర రాణులతోపాటుగా నవాబు వెంట కలకత్తాకు వెళ్ళకుండా బేగం హజరత్‌ మహల్‌ అవధ్‌ రాజ్య రాజధాని నగరమైన లక్నోలో ఉండిపోయారు.

స్వరాజ్యం పరుల పాలవడంతో ఆగ్రహించిన ఆమె ప్రజల, స్వదేశీ ప్రముఖుల అండదండలతో బ్రిటీష్‌ సైన్యంపై విరుచుకుపడ్డారు. 1857 మే 31న లక్నోలోని ఛావనీలో తిరుగుబాటు ఫిరంగులు పేలాయి. ఆ పోరాటంలో స్వదేశీ సైనికుల సహాయసహకారాలతో తమ రాజ్యాన్ని ఆమె తిరిగి సొంతం చేసుకున్నారు. ఆంగ్లేయాధికారులు అవధ్‌ నుండి పలాయనం చిత్తగించారు. ఆ సమయంలో ఆమె ప్రజల నుద్దేశించి ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజలంతా కత్తిపట్టాల్సిన అవసరాన్ని ఆమె వివరించారు.

ఆ ప్రకటన స్థూలంగా ఇలా సాగింది హిందూ- ముస్లింలకు ధర్మం, ఆత్మగౌరవం, ప్రాణం, ధనం అను నాలుగు అంశాలు ప్రధానం. ఈ అంశాలను కేవలం స్వదేశీ పాలనలో, స్వదేశీ పాలకులు మాత్రమే ప్రసాదించగలరు. కంపెనీ సైనికులు ప్రజలను దోచుకుంటున్నారు. ఆత్మగౌరవాన్ని మంట కలుపుతున్నారు. స్త్రీల విూద అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుపుతున్నారు...హిందూ-ముస్లిం పౌరులను హెచ్చరిస్తున్నాం. ఆత్మ