పుట:హాస్యవల్లరి.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మడతపేచీ

ఒకసారి చందనబస్తీ పత్రికలో ఒక చాటింపు పడింది! “లక్షారావుగారు ప్రమాదంవల్ల పడిపోయారు. వారినడుం మడతపడిపోయింది. చిట్టిచిట్టి ఉపాయాలవల్ల గుణం లేకుండా ఉంది. ఇక్కడికి వచ్చి కుదర్చగల వైద్యుడికి వెయ్యిరూపాయలు పైగా ఉండే బహుమతి ఇస్తారు. ప్రజ్ఞగల వైద్యులు కావాలి. స్వయంగా వచ్చి మాట్లాడుకోవచ్చును. వివరాలకి వ్రాయవచ్చు - చిరునామా, పత్రికాధిపతి! చందనబస్తీ” అని.

ఆ బస్తీకి ఒకపూట నాటుప్రయాణంలో కరూరుఅనే పట్నం ఉంది. ఆ ఊళ్ళో వైద్యాభ్యాసం చేస్తున్న డాక్టర్ ధనాధన్ గారుకూడా, అందరికిమల్లేనే, పత్రికలోపడ్డ ఘోషణ చదివి చప్పరించి ఊరుకున్నాడు. కాని, ఆ మర్నాడే పత్రికాధిపతి దగ్గర్నించి ఆయనకి ఓ పెద్దఉత్తరం వచ్చింది. అందులో రోగిగారిని గురించిన వివరాలన్నీ ఉన్నాయి. ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఇంతమంది ఘన వైద్యులు ప్రపంచంలో ఉంటూంటే తనపేరు అప్పుడే పత్రికాధిపతికి ఎట్లా తెలిసిందో గదా అని ఆయన అనుకుని, లోపల సంతోషించుగుని భార్యని కేకేసి, మీసం ఉండవలిసిన చోట తర్జన్యంగుష్టాలతో గాల్ని మెలిపెడుతూ, “చూశావా, మనతఢాఖా!” అంటూ ఆవిడికి ఆ ఉత్తరం చూపెట్టాడు. తక్షణం ఆవిడ నవ్వేసి, "తఢాఖాలనే ఉంది మొన్న నేను పత్రికాధిపతి పేర రాయగా, ఆయన తబిసీళ్ళు రాశాడుగావును. ఇంత మాత్రానికే పొంగిపోకండి మరి" అంది. ఆయనకి కొంచెం చిన్నతనంవేసినా, మాట్లాడానికి వీల్లేక ఊరుకున్నాడు. బహుమతీ ఆశ ఎవడి కుండదూ? ఆయనా నిలబడ్డపాట్న ఆకేసు అంగీకరించి ఉండేవాడే కాని, అతనికి ఆ ఉత్తరంలో చాటింపులో లేని షరతు ఒకటి మహాపాపిష్ఠిది కనిపించింది. ఏమంటారా, వైద్యానికి కుదురుకున్నవారు వందరూపాయలు ధరావతు కట్టిం తరవాతే వైద్యం ప్రారంభించవలసి ఉంటుందని ఎక్కడేనా చక్కటి బజానాముందు పుచ్చుగుని పని ఒప్పుగుంటారు గాని ఇవ్వడం ఏమిటి అన్నాడాయన. పెద్దవాళ్లతో వ్యాపారం ఆమాత్రం బరువుగానే ఉంటుందని గ్రహించుగోవాలి అందావిడ. ఆ బహుమతీకి ఓ అరదణ్ణం పెట్టి మనపని మనం చూసుగుంటే నయం అని ఆవిడతో నయాన్నీ భయాన్ని చెప్పిచూద్దాం అని ఆయన యత్నించాడు. ఆవిడ ససేమిరా వినిపించుకోలేదు. సరిగదా!

భార్య - మనకి బ్యాంకిలో నిలవ ఎంతుంది?

డాక్టర్ - నూరు పైనే ఉంటుంది.

భా - రేప్పొద్దున్న అది పుచ్చేసుగుని వెళ్ళిమీరు ఈ బేరం అచ్చుగోండి.

డా - అక్కడ ఎంతమంది ఉన్నారో పోటీకి?

భా - ఏ కాళ్ళో పట్టుగుని బేరం చేచిక్కించుగోవాలి. దాట పెట్టుగుంటే ఓరికేసి ఓరు చూస్తూ కూచోవాలి.

డా - నాకింకా వైద్యపరంగా చెయితిరగలేదు, అర్ధపరంగా గుక్క తిరగలేదు! మనస్థితి కింకా ఎక్కడా గాలి తిరగలేదు.

భా - మృతనష్టపు కేసులు ఎన్ననిచేసి సంపాదిస్తే అంత అవుతుంది?

అని వాదించింది. డాక్టర్ ధనాధన్ పనివాడే గాని, మాటశూరుడు కాడు. అందులో, ఇవతలమనిషి భార్యగాని, మరొకరూ మరొకరూ కాదు. అందుకని, మర్నాడు

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

150

హాస్యవల్లరి