పుట:హాస్యవల్లరి.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాడు కుడితర్జనితో తనకేసి చూపెట్టుగుని వెంటనే ఆవిడికేసి చూపించి, తర్జనీలు కలిపి చూపించాడు.

సి - (చాలా కోపంతో, అతివడిగా) నువ్వు చచ్చిపోనూ, 'నువ్వు రాలిపోనూ, నువ్వుకాలిపోనూ, నీకు నిచ్చిన కట్టా, నీకు సవ్వారికట్టా, నీకు పాడికట్టా, నీకు రాయికట్టా, నిన్ను మోసెయ్యా, నిన్ను తగలెయ్యా, నిన్ను పాతెయ్యా, నిన్ను పాతరెయ్యా, నిన్ను బారెట్టా, నిన్ను పుఠం వెయ్యా, నిన్ను బూడిద చెయ్యా, నీకు పన్నెండెట్టా, నీకు మాసిగం పెట్టా, నీ పిండం పిల్లులికెయ్యా, నీశార్థం చెట్టుకిం దెట్టా ..

అనేరకాలు కొన్ని సొంతంగా ప్రయోగించుగుంటూ చివర చివరకి రావడంలో, ఆవిడికి మాటకూడా పడిపోయింది. కళ్ళు తెరిచిఉన్నాయి, నోట్టోంచీ ముక్కు షోణాల్లోంచీ గాలిమాత్రంవస్తోంది. మరేమీలేదు. అయినా ఎరకలాడు ఇంకోసారిచూద్దాం అనుకుని, బుగ్గని వేలెట్టుగుని తక్కుతూ, ఆవిడ దగ్గిరిదాకా వెడుతూ వస్తూ బోగంఆట ఆడిచూశాడు. కోతికూడా అల్లానే చేసింది. కాని ఆవిడ ఎంత మాత్రం చేతావాతా కాకుండాపోయి కేవలం అశక్తురాలై బొమ్మలాగ చూస్తూ ఉండిపోయింది.

గ్రంథం అంతవరకు రానిచ్చి, ఎరకలాడు, ఒక్క మాటంటే ఒక్కమాటే నోరువిప్పి. “నేను నీకు ముగుణ్ణి కానుటే” అంటూ ఆవిడ కేసి చూసి సిగ్గు అభినయించాడు. ఈమాటతోటి, అస్ఖలితంగా బతికిన మనిషి గనక, సిమాలమ్మ తన అపజయం , పరాభవం , అవమానం, నిస్త్రాణ, నీరసం వగైరాలవల్ల గుప్పుమని పెద్దపెట్టున అప్పుడు మళ్ళీ పుట్టిన కోపంతో, ఊతం బలవంతం చేసుగుని, ఆఖరుమాటు చేతులు తిప్పుతూ ఆడిపోతూ కసిదీరా వాణ్ణితిట్టాలనుకొని చేతులు చాచి, “ఓరినీనోరు పడోవ్” అనడానికి ప్రయత్నించడంలో, గూళ్లు పట్టుతప్పిపోవడం వల్ల ఎల్లానో చాచినచేతులు అల్లానే ఉండిపోయాయి గాని మరి కిందికి రాలేదు, మాటలు అనడానికి తెరిచిన నోరు అంకిళ్ళు పట్లు వొదిలిపోడంవల్ల ఎల్లనో ఆ మాటలు అనేసి, తరువాత అల్లానే ఉండిపోయింది గాని దగ్గిరపడలేదు. ఒక్కక్షణం ఆస్థితిలో నిల్చిపోయి, చెయ్యీ దవడా స్వాధీనం తప్పిపోడం ఆవిడకి బాగా గుష్టుకి రాగానే, ఆవిడ కుంగిపోయి పక్కకి పడిపోయింది.

జనానికీ ఎరకలాడికీ ఆవిడమీద అది వరకే బయల్దేరిన జాలి విల్లివిరిసి పోయింది. ఎరకలాడు తనవైద్యం మరి కట్టేశాడు. అసలు వైద్యులొచ్చి ఆవిడ గూళ్ళూ అంకిళ్ళూ బాగుచేసి, మందిచ్చి ఉపచారాలు చేయించగా, ఆవిడ ఓ వారం రోజుల్లో లేచింది.

ఎరకలాడివేషం వేసిన ఆయనకీ ముష్టి అమ్మి వేషంలో కోతిని తీసుగొచ్చిన అతని తమ్ముడికీ వాగ్దానప్రకారం ఆ ఊరి జమిందారుగారు సిమాలమ్మధర్మమా అని ఓ అగ్రహారం ఇచ్చారు. సిమాలమ్మ తన ఆస్తి కూడా తన అనంతరం వాళ్ళకి చెందేటట్టు రాసేసింది.

తరవాత సిమాలమ్మగారు, తను జీవించిన పదికాలాల పాటూ, ఇల్లా నోరు విప్పి ఎరగదుట, నోరు విప్పగా ఎవ్వరూ వినలేదుట, ఆవిడమాట మానుకున్న అనంతరం ఆవిడ మాటలు వినాలని వేలాదిగా జనం వచ్చేవారుట. ఆవిడగొప్ప జ్ఞానురాలనీ, ఆలోచనపరురాలనీ, కవయిత్రి అనీ జనం అప్పుడు కనిపెట్టి ఎంతో మెచ్చేవారుట.

“సారస్వత ప్రౌఢిమార్థి... సురియ చేత నాలుకఁ గోసికోని ....... యిష్ట మొందు”

అని మన సూరన్న మాటలు

మాటలేనా!

- అక్టోబరు, 1938

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

149

హాస్యవల్లరి