పీఠిక
పూర్వకథారచనాయోగంబునం బ్రసిద్ధి గాంచిన సర్పపురమాహాత్మ్యంబును నచ్చతెనుఁగుంగబ్బములలో నొక్కఁ డై వన్నెకెక్కిననీలాసుందరీపరిణయంబును శ్రీమత్కూచిమంచితిమ్మకవిప్రణీతములు, ఈతిమ్మయ లోకంబున నభినవవాగనుశాసనుఁ డనియుఁ గవిసార్వభౌముఁ డనియు బిరుదులఁ గాంచినమహాకవి.
ఇతఁడు నియోగిబ్రాహ్మణుఁడు; కౌండిన్యసగోత్రుఁడు. బయ్యనామాత్యుని మునిమనుమఁడు. ఇతనిపితామహుఁడు తిమ్మయ, తండ్రి గంగనామాత్యుఁడు. తల్లి లక్ష్మమ. జగ్గన సింగన నరసనయు నితని పెదతండ్రులు, వీరమ పాపమయును మేనత్తలు. రాజనయు జగ్గనయు సూరనయు సహోదరులు. తిమ్మనయు సింగనయుఁ బెదతండ్రికొడుకులు. భార్య బుచ్చమ. ఈతనినివాసస్థలము గోదావరీమండలమందలి [1]పీఠికాపురసంస్థానములోని కందరాడ యనుగ్రామ మనియు నితఁ డాయూరికరణ మనియుఁ దెలియవచ్చెడిని. ఇతఁడు పుట్టి పెరిఁగినతావు చంద్రమపాలెము.
ఇతఁడు దెందులూరిలింగనారాధ్యదేశికేంద్రదత్తమాహేశ్వరాచార్యవృత్తిరతుఁ డైనను గేవలశైవుఁడు గాక యద్వైతమతమే యవలంబించినట్టు లితనిగ్రంథములవలనఁ దెలియ వచ్చుచున్నది. కావుననే భావనారాయణస్వామి తిమ్మకవికి స్వప్నమునందు సాక్షాత్కరించి.
| "శివునకు నాకును భేదము యవమాత్రము లేదు. ...... .... .... | |
మని కోరఁగా గ్రంథమును రచించి యాదేవునకు సమర్పించినట్టు లీసర్పపురమాహాత్మ్యములోఁ దెల్పఁబడియున్నది.
ఈకవి పీఠికాపురసంస్థానమునకుఁ బ్రభువైన రావుమాధవునికాలములో నుండి కృతులు వ్రాసి కవిసార్వభౌముఁడు లోనుగా బిరుదులం బడసియున్నట్లు తెలియుచున్నది. ఈతని రెండవకృతి యగురుక్మిణీపరిణయము హూణశకము 1715 వ సంవత్సరమున రచియింపఁ బడియుండుటచేతను నీతనికడపటికృతి యగు శివలీలావిలాసము హూణశకము 1758వ సంవత్సరమందుఁ జేయఁబడియుండుటచేతను నీతిమ్మకవి హూణశకము పదునెనిమిదవశతాబ్దారంభమునకుఁ గొంచెము పూర్వము జనించి తచ్ఛతాబ్దమధ్యముదాఁక జీవించియుండినట్టు గనఁబడుచున్నది.
- ↑ పీఠికాపురమునకె పీఠీపురమనియుఁ బీఠపుర మనియు నామాంతరములు. ఇప్పుడు పిఠాపుర మని ప్రసిద్ధి.