పుట:సత్యశోధన.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

373

16. కార్య విధానం

చంపారన్ పరిస్థితుల్ని వివరించడమంటే చంపారన్ రైతుల చరిత్రను వివరించడమే. ఆ వివరాలన్నీ యీ ప్రకరణాలలో పేర్కొనడం సాధ్యం కాదు. చంపారన్‌లో జరిపిన పరిశీలనంతా అహింసా ప్రయోగమే. అందుకు సంబంధించిన వివరాలు అవసరమైనంత వరకే వివరించాను. మొత్తం వివరాలు తెలుసుకోదలచిన పాఠకులు బాబూ రాజేంద్ర ప్రసాద్ యీ సంగ్రామాన్ని గురించి వ్రాసిన గ్రంథం చదవవచ్చును లేక యుగధర్మ్ ప్రెస్ ద్వారా ప్రకటించబడ్డ ఆ గ్రంధపు గుజరాతీ అనువాదం చదవవచ్చు.

ఇక అసలు విషయానికి వద్దాం. గోరఖ్‌బాబుగారి యింటి దగ్గర వుండి నేను యీ పరిశీలనా కార్యక్రమం నిర్వహించియుంటే వారు యిల్లు వదిలి పెట్టి వెళ్లవలసి వచ్చేదే. మోతీహారీలో కిరాయి చెల్లించినా యిల్లు యిచ్చే పరిస్థితిలో ఎవ్వరూ లేరు. అందుకు భయమే కారణం. కాని ప్రజకిషోర్‌బాబు వ్యవహారదక్షులు. ఆయన అద్దెకు ఒక పెద్ద భవనం సంపాదించారు. మేమంతా ఆ యింటికి వెళ్లాం. అక్కడ డబ్బు లేకుండా పని జరిగే పరిస్థితి లేదు యిటువంటి ప్రజాకార్యక్రమాలకు ప్రజల దగ్గర విరాళాలు తీసుకునే పద్ధతి ప్రారంభం కాలేదు. ప్రజకిషోర్‌బాబు, వారితో బాటు వున్న మిత్రమండలి వారంతా వకీళ్లే. వాళ్లు తమ ఖర్చులు తామే భరిస్తూ. అవసరమైతే మిత్రుల దగ్గర డబ్బు తీసుకోకూడదని నా దృఢనిర్ణయం. వాళ్ల దగ్గర డబ్బు తీసుకుంటే ఉద్యమ అర్థం మారిపోతుందని నా అభిప్రాయం. యీ కార్యక్రమం కోసం దేశప్రజల్ని కూడా డబ్బు అడగకూడదని నా నిర్ణయం. అలా తీసుకుంటే వ్యవహారానికి రాజకీయరంగు పులిమే ప్రమాదం వున్నది. బొంబాయి మిత్రుల నుండి 15 వేల రూపాయలు ఇస్తామని ఒక తంతి వచ్చింది. కృతజ్ఞతలు తెలిపి వాళ్ల కోరికను నిరాకరించాం. బాగా ఆలోచించి చంపారన్ బయటవుండే బీహారుకు చెందిన ధనికుల దగ్గర ప్రజకిషోర్‌బాబు బృందం సాధ్యమైనంత డబ్బు ప్రోగుచేయాలని, లోటుపడితే డాక్టర్ ప్రాణజీవన్‌దాస్ మెహతాగారి దగ్గర డబ్బు తీసుకొని భర్తీ చేస్తానని నేను చెప్పాను. అవసరమైనంత డబ్బు వ్రాసి తెప్పించుకోమని డాక్టర్ మెహతాగారు మొదటే నాకు వ్రాశారు. దానితో డబ్బును గురించి చింత తొలగిపోయింది. తక్కువ డబ్బు ఖర్చు పెట్టి యీ సమస్యను పరిష్కరించాలని మా నిర్ణయం. అందువల్ల ఎక్కువ డబ్బు అవసరం పడలేదు. రెండు లేక మూడు వేల రూపాయల కంటే ఎక్కువ డబ్బు అవసరం లేదని భావించాను. వసూలు చేసిన డబ్బులో అయిదు వందలో లేక వెయ్యి రూపాయలో మిగిలినట్లు నాకు గుర్తు.