అంతర్జాతీయ సంస్ధలు
అంతర్జాతీయ కార్మిక సంఘము, అంతర్జాతీయ వర్తక సంఘము మొదలైనవి స్థాపింపబడుటకు ఇట్టి పరిణామమే
ప్రధాన కారణము.
ప్రకృతిశాస్త్ర పరిశోధనాభివృద్ధి యుద్ధముల స్వరూపమును మార్చి ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థకు అవసరమును కల్పించెను.
రాజ్యములమధ్య వివాదములు తప్పవు. వివాదములను పరిష్కరించుకొనుటలో సామ దాన భేదోపాయములేగాక యుద్ధము (దండము - బలప్రయోగము) కూడ న్యాయమైన సాధన మన్నభావము ప్రపంచమందనాదిగ వ్యాపించియున్నది. అందుచేత వివాదము లనేకములు యుద్ధముల మూలమున పరిష్కృతము లగుట సర్వసాధారణమయ్యెను. ప్రపంచ చరిత్రలో చాలభాగము యుద్ధముల చరిత్రయే కాని ఇటీవలి కాలమున యుద్ధముల స్వరూపము పూర్తిగ మారిపోయెను. వానిలో పాల్గొను సైనికుల సంఖ్య కొన్ని వేలనుండి కొన్ని కోట్లవరకు పెరిగెను. ఆధునిక యుద్ధములన్నిటికి మూలస్థాన మని చెప్పతగ్గ యూరపు ఖండమందు పదునారవ శతాబ్దపు యుద్ధములలో ముప్పది వేలకు మించిన సైన్యములు పాల్గొనియుండలేదు. పందొమ్మిదవ శతాబ్ద ప్రారంభమున నెపోలియన్ నాయకత్వము క్రింద జరిగిన యుద్ధములలో పది లక్షల సైనికులు పాల్గొనిరి. ఇరువదవ శతాబ్దములో జరిగిన మొదటి ప్రపంచయుద్ధమందు ఆరుకోట్ల సైనికులును, రెండవదానియందు సుమారు ఎనిమిదికోట్ల సైనికులును పాల్గొనిరి. పదు నెనిమిదవ శతాబ్దమందు జరిగిన యుద్ధము లన్నిటియందును హతులై నట్టియు. గాయపడినట్టియు సైనికులసంఖ్య నలుబది యైదు లక్షలు; రెండవ ప్రపంచయుద్ధ మందు హతులసంఖ్య 220 లక్షలు, వికలాంగులసంఖ్య 340 లక్షలు; హిరోషిమాలో ఆటంబాంబు పేలుడువలన ప్రాణముల గోల్పోయిన వారిసంఖ్య 78,000. ఈ కాలపు యుద్దముల మూలమున సైనికులేకాక - విమానముల నుండి ప్రేలు బాంబుల కారణమున సామాన్యజనులు కూడా హతులగుటయు, వికలాంగులగుటయు సంభవించు చున్నది. పట్టణములు, పల్లెలు లెక్కలేనన్ని నేలమట్టము అగుచున్నవి. ఆస్తినష్టమునకు మితిమేరలు లేవు. రెండవ ప్రపంచయుద్ధములో ఒక యూరపు ఖండమునందు కలిగిన నష్టము 1,500,000,000,000 రూపాయలకు మించి యుండునని అంచనా వేసియున్నారు. యుద్ధము ముగిసిన తర్వాతకూడ అగ్రరాజ్యములమధ్య పెరిగిన విరోధముల కారణమున, మరియొక ప్రపంచయుద్ధము రానున్నదను భయముచేత, అట్టి ప్రమాదమునుండి తప్పించుకొనుటకు ప్రతిరాజ్యము దాని ఆదాయములో అర్ధభాగమును సైనిక, నావిక, విమాన బలములను చేకూర్చుకొనుటకై ఖర్చు పెట్టుచున్నది. రెండవ ప్రపంచయుద్ధములో ఆటంబాంబు నొక్కదానినే ప్రయోగించిరి. కాని ఇప్పుడు ఆటంబాంబులేగాక హైడ్రొజన్ బాంబులుకూడ తయారగుచున్నవి. ఇవి బ్రహ్మాస్త్రమునకంటె నెక్కుడుశక్తి గలవి. వీని ప్రయోగము మూలమున దేశములకు దేశములే తుడుచుకొని పోవుననుటలో అతిశయోక్తి లేదు.
యుద్ధస్వరూపమందు ఇట్టి విపరీతమైన మార్పులు కలుగుట చేత రాజ్యములమధ్య సంభవించు వివాదములను సర్వనాశకరముగు యుద్ధ సాధనమున పరిష్కరించు కొనుట ఆత్మహత్యవంటి దన్న అభిప్రాయము మొదటి ప్రపంచ యుద్ధ కాలమందే వ్యాపించెను. సాధనాంతర మొకటియున్న గాని వివాదపడు రాజ్యములు యుద్ధమును మానుట జరగదన్న హేతువున అట్టి సాధన మొకదానిని కల్పించు ఉద్దేశముతో 1919 లో నానాజాతి సమితి (League of Nations)ని స్థాపించిరి. ఇది కొన్ని సంవత్సరములపాటు పనిచేసెను. దాని నిర్మాణములో కొన్ని లోపములున్నట్లు అనుభవము మూలమున తెలియవచ్చుట చేత, వాటినన్నిటిని సవరించి రెండవ ప్రపంచ యుద్ధానంతరము విజేతలైన రాజ్యములన్నియు కలసి 1945లో ఐక్యరాజ్యసమితిని స్థాపించినవి. అంతర్జాతీయ సంస్థలన్నిటిలో దీనిదే అగ్రస్థానము. దీనిని గురించిన వివరములను కొన్నిటిని తెలిసికొనుట అవసరము.
ప్రపంచమందంతట శాంతి భద్రతలను స్థాపించుట, రాజ్యముల మధ్య సంభవించు వివాదములను అంతర్జాతీయ న్యాయసూత్రముల ననుసరించి శాంతిమార్గమున పరిష్కరించుట, దురాక్రమణోద్దేశముతో యుద్ధములకు ఉపక్రమించు రాజ్యములను శిక్షించుట, రాజ్యముల మధ్య వివాదములు సంభవింపకుండ చేయగల వాతావరణములు సృష్టించుట. ప్రపంచమందలి ఉత్పత్తికిని,