Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/832

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆయుర్వేద ధర్మములు

శారీరము మొదలగు గ్రంథము లావిష్కరింపబడినవి. ఆంధ్రదేశములో ముఖ్యముగా నభ్యసింపబడునవి “వైద్య చింతామణి” “బసవరాజీయము" అను రెండు పెద్ద గ్రంథములు కలవు. ఇవి స్వతంత్రములు కావు. పూర్వ గ్రంథములలో నుండి యుద్ధరింపబడిన విషయములతో నిండియున్నవి. నాడీజ్ఞానము మొదలగు అష్టస్థాన పరీక్షలు కర్మవిపాకము, జ్యోతిషాభిప్రాయము మొదలగు విశేషములు వీనిలో వర్ణింపబడినవి.

ఇంకను చికిత్సారత్నమను బాలురకు స్త్రీలకు కలుగు రోగముల చికిత్సలను బోధించు గ్రంథమును, చికిత్సా సార మను గోపాలదాసుచే రచింపబడిన గ్రంథమును కలవు.

రసతంత్రమునందును అనార్ష గ్రంథములు కలవు. వానిలో రసరత్న సముచ్చయము (వాగ్భట విరచితము), రసేంద్ర చూడామణి (సోమదేవ విరచితము), రససారము (గోవింద భిక్షు విరచితము) రప రత్నాకరము (నిత్యనాథ విరచితము) అనునవి ముఖ్యమయినవి. ఇంకను ఆయుర్వేద ప్రకాశము, రసేంద్రసార సంగ్రహము, రస సంకేత కలిక, రస కౌముది, లోహమంజరి, మొదలగు బహు గ్రంథములు కలవు.

నొ. రా. శా.

ఆయుర్వేద ధర్మములు :- ధర్మములు శాశ్వతములు. అనగా దేశ కాల వయః ప్రకృతి భేదముల ననుసరించి ఎప్పటికప్పుడు మార్పు చెందించుటకు వీలుచాలనివి. జగద్ధార్యమగు ధర్మపదమునకు ప్రతివ్యక్తియు నియమితమగు నిత్య కర్మాచరణమున వర్తించుటను తెలియచేయునది యని యర్థము. ధర్మములు- మానవ జీవిత సంపత్ప్రభా భాసకములు, చిరాయు రారోగ్య సంపన్నములు, ధర్మము లన్నింటియందును ఆయుఃపాలనము ముఖ్యమగుటను, జీవితకాలమును తెలియజెప్పి యుక్తాచరణమున ధర్మార్థ సుఖసాధన మగు ఆయుఃపాలనము చేయుటయందు నేర్పరితనమును బోధించుటచే ఈ ధర్మములు ఆయుర్వేద ధర్మము లని పేర్కొనబడినవి.

ఆయుర్వేద ధర్మములు కేవల సామాజికములుగా గాని, వర్ణ, వర్గీకరణములుగా గాని రూపొందింపబడి నిర్ణయింపబడినవి కావు. ఇవి సర్వమానవ సౌఖ్యావహములు. ప్రాణిమాత్ర జీవనోజ్జీవనములు. శాశ్వతములు. "శరీర మాద్యం ఖలు ధర్మసాధనం" ధర్మసాధనకు శరీరము మొదటిదిగా చెప్పబడినది. "శరీర రక్షణో ధర్మః" శరీరమును రక్షించుటయే ధర్మమని చెప్పబడినది.

     "ధర్మసాధనంబు తనువు, ధర్మము పరి
      జ్ఞానదాయి, యట్లుగాన తనువు
      నోమవలయు మర్త్యుడేమిట నేమర
      కాత్మహితముగోరి యనఘచరిత"

(మహాభారతము.శాంతి.)

శరీరమనగా నశించునదియని యర్థము. “శీర్యతే రోగాదినా ఇతి శరీరః. శాృ హింసాయాం" అని నిర్వచనము. శరీరము నందు అరువది అవయవములు కలవు. ఇందే యొక్కటి కొదువయైనను లేక పనిచేయకపోయినను సౌందర్య విహీనమై శరీరము యొక్క ఉనికియే కష్టముగ తోచును. శరీరమునం దాత్మ సుస్థిరముగా నుండవలయును. ఆత్మ నిలచి యుండునంతవరకు శరీరము నందన్ని అవయవములు సుసమాహితములై పనిచేయు చుండవలయును.

శరీరము - మనస్సు - ఆత్మ ఇవి ఒకదానినొకటి యెడబాయక కలసియుండునట్టి క్రియాత్మక మగు అవస్థావి శేషమునకు “ఆయువు" అని పేరు. ఆయుర్వేద ధర్మపముచ్చయమునందు మొదటి అధ్యాయము సద్వృత్తోపదేశము.(చ. సూ.1-46-47). ఆయుర్వేదమున చెప్పబడిన ఆ సద్వృత్తము నాచరించుటవలన ఆరోగ్యము, ఇంద్రియ విజయము అను రెండుఫలములు ఒకేసారి పొందనగును. అట్టి సద్వృత్త విశేషములను సమగ్రముగా నిందు పొందుపరచుచున్నాము :

1. "దేవ గో బ్రాహ్మణ గురువృద్ధ సిద్ధాచార్యా నర్చయేత్." దేవతలను, గోవులను, బ్రాహ్మణులను, తపోయోగ సిద్ధులను, విద్యా మంత్రోపదేశకులను, పూజించవలయును.

2. "అగ్ని మునచరేత్." హోమాది సత్క్రియా కలాపములవలన అగ్ని నారాధించవలయును.

3. "ఓషధీః ప్రశస్తా ధారయేత్." ఆరోగ్యదాయకములు, ఆయుర్వర్ధకములు, పవిత్రములు నగు ఓషధులను ధరింప వలయును.