Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/655

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - II


సందేహించుచున్నారు, కాని కవితాధోరణిని బట్టి చూడ అది ఈతని కృతియేయని తోచుచున్నది. ఈ శతక మాంధ్ర శతక వాఙ్మయమునకు తలమానిక మని చెప్పదగినది. ఇందు కవి పూర్వజీవితమున తాను గడపిన వర్తనమును గూర్చి అనుతావమును వెల్లడించుచు ఆత్మపరీక్ష కావించు కొని యున్నాడు. మదాంధులైన రాజుల యుద్ధతిని,వారవనితాసక్తిని, భోగభాగ్యములను ఇం దతడు నిరసించిన విధముచూడ వయస్సు పరిణత మగుకొలది అతడు విషయ పరాఙ్ముఖుడై వైరాగ్య తత్పరుడగుట తోచుచున్నది. ఇందలి శైలి ప్రౌఢమై ఎడనెడ స్వతంత్ర ప్రయోగములతో గూడి అత్యంత రమణీయముగానున్నది. ఇందలి పెక్కు పద్యములు ధూర్జటి శివభక్తి విశేషమును వెల్లడించుచున్నవి. తాను రచించిన శ్రీ కాళహస్తిమాహాత్మ్యమును అతడు శివునికే అర్పించెను. అందు దక్షిణ కైలాస మని ప్రసిద్ధిగన్న శ్రీ కాళహస్తి క్షేత్రమహత్త్వ మును దెల్పు కథలు వర్ణింపబడినవి. సంస్కృతమున స్కాందపురాణమున గల శ్రీ కాళహస్తి మాహాత్మ్యమే దీనికి మూలము. ఇందు మానవులేకాక తిర్యక్కులుకూడ శివభక్తిని ప్రదర్శించి ఎట్లు కైవల్యము నందజాలెనో వర్ణింపబడినది. - ఇందలి కథలలో భక్తి పరవశుడై శివునికి తన రెండుకన్నులను పెరికియిచ్చిన తిన్నడను పుళిందరాజ కుమారునికథయు, మహాకవియై శివుడు వ్రాసిన పద్యములో కూడ తప్పుపట్టిన నత్కీరుని కథయు రసపూరితములై అతి మనోహరములుగా నుండును. ధూర్జటి శైలి సమానభూయిష్ఠమయ్యు ఎడనెడ, లలిత పదకోమలమై రసానుగుణ పదప్రయోగముతోకూడి సహృదయరంజకముగా నుండును. ఈ కావ్యమునందలి వర్ణనలు మిక్కిలి సహజములై కవిప్రకృతి పరిశీలన పాటవమును వెల్లడించు చున్నవి. తిన్ననికథయందలి ఆటవికజీవిత వర్ణనమును, నత్కీరుని కథయందలి దుర్భిక్షవర్ణవమును, స్వర్ణముఖి ప్రవాహవర్ణనమును ఇందుకు నిదర్శనములు. ధూర్జటి పోతనాదులవలె కవిత్వమొక దివ్యకళావిశేష మనియు, దానిని ఈశ్వరారాధనమునకే వినియోగించుట యుక్త మనియు తలచిన మహనీయుడు.

అయ్యలరాజు రామభద్రకవి రామాభ్యుదయ మను కావ్యమును వ్రానీ రామరాయల మేనల్లుడైన గొబ్బూరి నరసరాజున కంకితము కావించెను. ఇతడు రాయలు సంస్కృతమున వెలయించిన సకలక థాసారసంగ్రహమును తెలిగించి ఆతనికే అంకితము చేయదలచె నని చెప్పుదురు. ఆగ్రంథ మిప్పుడు లభ్యమగుటలేదు. రామభద్రుడు రామాభ్యుదయమున రామాయణకథను ప్రబంధ రీతిని రచింపదలచినవా డగుటచే అందు ఉద్యాన విహార పుష్పాప చయ జలక్రీడాదు లగు ప్రబంధోచితము లగు వర్ణనలు ప్రవేశ పెట్టెను. అవి మనోహరముగనే యున్నను కొన్ని చోట్ల ఔచిత్యదూరములుగా నున్నవి. విశ్వామిత్రమహర్షి సీత సౌందర్యమును వర్ణించుపట్లను, ఋష్యశృంగుని కథలో వేశ్యలమాయలను, విభ్రమములను వర్ణించు పట్లను, ఇతడు కొంచెము మేరమీరినట్లు కానిపించును. ఇతనిరచన ప్రౌఢమైన సంస్కృత సమాసములకును లలిత కోమలములైన తెలుగుపదములకును నెలవై మనోహరముగా నుండును. ఇతనికి శ్లేష యమకాను ప్రాసాది శబ్దాలంకారములందును, చిత్రకవిత్వమందును ప్రీతి మెండు.

పింగళిసూరనార్యుడు కూడ అష్టదిగ్గజములలోని వాడే అని లోకమున వాడుక. కాని అతడు క్రీ.శ. 16 వ శతాబ్ది ఉత్తరార్థమున జీవించెనని కొందరును క్రీ.శ. 17 వ శతాబ్ది మొదటిపాదము వరకుకూడ కొందరును చెప్పుచున్నారు. రాఘవపాండవీయము, కళాపూర్ణోదయము, ప్రభావతీ ప్రద్యుమ్నము అను ఇతని మూడురచనలు మాత్రమే ఇప్పుడు ఉపలభ్యము లగు చున్నవి. ఇతడు తాను వ్రాసితి నని చెప్పుకొన్న గరుడ పురాణము నష్టమైనది. సూరన మిక్కిలి ప్రతిభావంతుడు. ఇతని కావ్యములు మూడును క్రొత్తదనముతో విలసిల్లుచు అతని పాండిత్య ప్రతిభాకళాభిజ్ఞతలను చాటుచున్నవి.

రాఘవపాండవీయము ద్వ్యర్థికావ్యము, వేములవాడ భీమకవి ఇట్టి కావ్యమొకటి వ్రాసెనని ప్రతీతికలదు గాని అది లభ్య మగుటలేదు. ఇందు రామాయణభారత కథలు రెండును జోడింపబడినవి. ఇది చదువునప్పుడు పఠిత ఎట్టి క్లేశమును లేకుండనే ఒకసారి రామాయణ కథను ఒకసారి భారతకథను స్పష్టముగా గ్రహింప జాలును. సూరన ఇందు వివిధములైన శ్లేషలను వాడి సంస్కృతాంధ్రములందు తనకుగల పాండిత్యవి శేషమును ప్రకటించెను. సామాన్యముగ ద్వ్యర్థికావ్యము లందు రస