Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/610

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర లక్షణగ్రంథములు


చేను. కావ్యాలంకార చూడామణియందు తొమ్మిది ఉల్లాసములు కలవు. భావమును, భావభేదములను తెలుపుటతో గ్రంథ మారంభమయినది. ప్రథ మోల్లాసమున విభావాదులును, స్థాయి భావములును తెలుపబడినవి.ద్వితీయమున రసస్వరూప నిరూపణము చేయబడినది. తృతీయోల్లాసమున నాయికా నాయక లక్షణములు, సప్త విధ కవులు, అష్టాదశ వర్ణనములు వివరింపబడినవి. చతుర్దొల్లాసమున ముక్తకాది కావ్య భేదములు, ఉదాహరణ లక్షణము, విభక్తుల దేవతలు, సద్దళి మొదలయిన కావ్యములు, పాకశయ్యాదులు, కావ్యరీతులును చెప్పబడినవి. పంచమోల్లాసమున అర్థాలంకారములు వివరింపబడినవి. దండికృత కావ్యాదర్శ పద్ధతితో ఈ యలంకార క్రమ మున్నది. షష్టోల్లాసమునందు సంకరాద్య లంకారములు, శబ్దాలంకారములు, చతుర్విధ కందములు, బంధకవిత్వ లక్షణములు, పదదోషములు, వాక్యదోషములు, అర్థదోషములు మున్నగు నంశము లున్నవి. సప్తమోల్లాసము నందును, అష్టమోల్లాసము నందును ఛందస్సు చెప్పబడి నది. యతిప్రాసలక్షణములు, వృత్తలక్షణములు మున్నగు విషయములు ఇందుగలవు. నవమోల్లాసము వ్యాకరణ విషయములు కలది. తత్సమాది శబ్దస్వరూపములు క్రియా ప్రకరణము మొదలయిన విశేషము లిం దున్నవి.

ఇట్లు కావ్యాలంకార చూడామణి సర్వసాహిత్య లక్షణములును గలిగియుండుటచే దీనిని వ్యాకరణ గ్రంథ మనియు, ఛందోగ్రంథమనియు, అలంకార గ్రంథమనియు చెప్పవచ్చును.

ఆంధ్రచంద్రాలోకము  : విజయనగర రాజుల కాశ్రితుడై రామచంద్రపురము, చీపురుపల్లి అను గ్రామము లందుండిన అడిదము సూరకవి ఈగ్రంథమును రచించెను. ఇది జయ దేవకృతమైన సంస్కృత చంద్రాలోకమునకు అనువాదము. సంస్కృతకవులలో జయదేవులు కొందరు గలరు. వారిలో ప్రసన్న రాఘవ నాటకకర్తయు, చంద్రాలోక రచయితయునగు జయదేవు డొక్కడేయని విమర్శకుల యభిప్రాయము. జయదేవుని చంద్రాలోకమును ఆధారముగా జేసికొనియే అప్పయ్యదీక్షితుడు కువలయానందమును రచించెను. అప్పయ్యదీక్షితుడు గ్రహించిన పాఠభేదముల ననుసరించియే అనగా అప్పయ్యదీక్షితకృత కువలయానంద మూలము ననుసరించియే ఇది యనువదింపబడినది. అడిదము సూరకవి (క్రీ. శ. 1720-1785) గొప్ప తెలుగుపండితుడు. ఇతడు కవిసంశయ విచ్ఛేదము, ఆంధ్రనామ శేషము, కవిజనరంజనము, రామలింగేశ శతకము మున్నగు గ్రంథములను రచించెను. సూరకవి ఆంధ్రీకరణము, మూలమువలె సుబోధము గాకపోయినను, పద్యములు కంఠస్థము చేయుటకు యోగ్యముగా నున్నవి. అలంకారశాస్త్రము తెలుగున స్వతస్సిద్ధముగాక అనువాద రూపమగుటచేత మూలమువలె నుండని లోపము అన్నింటియందునువలె ఈ గ్రంధమునందును గలదు. ఉన్న వాటిలో నెల్ల చిన్నదై విద్యార్థులకు ఉపయోగకరమైనదీ గ్రంథము. ఇందు నూరలంకారములకు లక్ష్యలక్షణములు గలవు. తాడూరి లక్ష్మీనరసింహారావు, నేలనూతుల శివరామయ్యకవి, గని శేషయ్యశాస్త్రి అనువారు సైతమీ చంద్రాలోకము ననువదించిరి. ఆంధ్ర చంద్రాలోకము అక్కిరాజు ఉమాకాంతముగారి వ్యాఖ్యతో మిక్కిలి ఉపయోగకరమై యున్నది.

కావ్యాలంకార సంగ్రహము  : వసుచరిత్ర కారుడయిన రామరాజభూషణు డీగ్రంథమును రచించెను. అతడు తన నామ ధేయము నిందు “మూర్తికవి” అని పేర్కొనెను. శ్రీకృష్ణదేవరాయల అల్లు డయిన అళియరామరాజునకు అల్లుడగు తొరగంటి నరసభూపాలునకు ఈగ్రంథ మంకితము చేయబడుటచేత దీనికి “నరసభూపాలీయ" మను వ్యవహారము కలిగినది. ఈ నరసరాజు తండ్రి 'ఓబళు' డగుటచేత పెక్కుతావుల కవి, కృతిపతిని 'ఓబయ నారసింహ' 'ఓబయ నరసధీర' అని పేర్కొనెను. ఈ కృతి కర్తయు, కృతిభర్తయు క్రీ. శ. 16వ శతాబ్దివారు.రామరాజభూషణుడు యువకుడుగా నున్నప్పుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానమునందుండి చరమవయస్సున వసు చరిత్రను అళియరామరాజు తమ్ముడగు తిరుమల దేవరాయలకు అంకిత మిచ్చెను. ఈ మధ్య కాలమున నెప్పుడో ఓబయ నరసరాజునకు అంకితముగా ఈ నరసభూపాలీయమును, రచించెను. ఐదాశ్వాసముల గ్రంథము. ప్రతి పద్యమునందును నరసరాజు పేరుండును. ఒక్క నాటక లక్షణము తప్ప తదితర కావ్యలక్షణములును, రసభావాది నిరూపణమును ఇందుగలవు. విద్యానాథుడు రచించిన