Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/551

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశ చరిత్రము - IV


ఆనాటికి విశాఖపట్టణమండలములోని విజయనగరము వారి సంస్థానము మిక్కిలి గొప్పది. క్రీ. శ. 1710 మొదలు 1752 వరకు విజయనగర సంస్థానమును పరిపాలించిన పెదవిజయరామరాజుగారు తమ రాజధానిని పొట్నూరినుండి విజయనగరమునకు మార్చి, అచట ఒక కోటనుగట్టి చుట్టుప్రక్కలందు గల జమీందారులను లోబరచుకొని ఆ ప్రాంతములలో మిగుల బలవంతులుగ నుండిరి, విజయనగరము జమీందారీకి ప్రక్కగా శ్రీకాకుళములోనున్న నిజాము ఫౌజుదారు డీయన సహాయము నపేక్షించుచుండెను.

పైన పేర్కొనబడిన సందర్భములో విశాఖపట్టణము, గోదావరి మండలము మొదలుగాగల దేశభాగములను నిజాము ఫ్రెంచివారి కియ్యగా వారు వానిని స్వాధీన పరచుకొనుటలో నిజాము ఫౌజు దారుడు, ఆటంకములు కలిగించుట జూచి, బుస్సీ దొర పెద విజయరామరాజు గారికి ఆ రెండుజిల్లాలను చౌకబారు శిస్తుకు గుత్త కిచ్చెదనని చెప్పి ఆయనను తనవైపునకు త్రిప్పుకొనెను. అంతట అక్కడి జమీందారులను అణచుటకు బుస్సీ బయలుదేరి వచ్చెను.విజయరామరాజు గారు తమ విరోధులయిన బొబ్బిలి జమీందారీ నేలు వెలమ దొరలే అక్కడి జమీందారుల ధిక్కారమునకు కారణభూతులని బుస్సీ గారికి చెప్పగా, అతడు బొబ్బిలిమీదికి క్రీ. శ. 1757 లో చండయాత్రచేసి కోటను నేలమట్టము చేసెను. బుస్సీ పాత జమీందారీలను రద్దుచేసినట్లు ప్రకటించియు, ఫ్రెంచివారికి లోబడిన వారికి సన్నదుల నిచ్చి దేశాదాయములో పది యవవంతు చెల్లించుపధ్ధతితో వారికి మామూలుగా చెల్లు మర్యాదలను, రుసుములను ఉండనిచ్చెను. బొబ్బిలివారి వంశమున మిగిలిన చినరంగారావుగారిని మరల జమీందారునిగా బుస్సీగారు చేసిరి. బొబ్బిలి యుద్ధానంతరము పెద విజయ రామరాజుగారు వధింపబడిరి. వారి తరువాత ఆనంద రాజుగారు జమీందారు అయి శ్రీకాకుళము మొదలు రాజమహేంద్రమువరకు ప్రభువు అయిరి.

క్రీ. శ. 1758 లో ఫ్రెంచి గవర్నరు జనరలయిన కవుంటులాలీగారు బుస్సీగారీ ప్రాంతములం దుండుట వలన ప్రయోజనములను గుర్తింపలేక, కర్ణాటకములో తమకున్న ఫ్రెంచిస్థావరములకు కలుగుచున్న అలజడిని తప్పించి వాటిని స్థిరీకరించు నిమిత్తమై ఆయనను దక్షిణ ప్రాంతమునకు బదలాయించెను. దీనితో ఇంతవరకు మంచి అదనుకొరకు వేచియున్న ఇంగ్లీషు వర్తక కంపెనీ వారికి వీలుచిక్కెను. ఆనంద రాజుగారే వారి నాహ్వనించిరి. అంత ఇంగ్లీషువారు ఉత్తర సర్కారులలోనికి చొచ్చుకొనివచ్చి, మచిలీపట్టణమును పట్టుకొనిరి. అంత ఎనిమిది సంవత్సరములు కష్టపడి బుస్సీ నిర్మించిన ఫ్రెంచి రాజ్యము విచ్ఛిన్న మయ్యెను.

బుస్సీ ఈ ప్రాంతములందు శిస్తు నిర్ణయముచేసి, ప్రభుత్వ పద్ధతులు చక్కగా జరుగునట్లు కట్టుబాటులు చేసెను. అతనికాలమున శ్రీకాకుళము, రాజమహేంద్రవరము పరగణాలలో శిస్తులు రెట్టింపునకు పెరిగెను. జమీందారీలు దేశములో శాంతిని, భద్రతను కాపాడుటకు బాధ్యతవహించవలసి వచ్చెను. సాలునకు మూడు పంటలు ప్రభుత్వమునకును, రైతులకును మధ్య పంపిణీ చేయుటకును, మరాటీదండు మొదలయిన శత్రువుల వలన భయములేకుండ కాపాడుటకును, జమీందారులు పండ్రెండు వేల కాల్బలమును సిద్ధముగా నుంచుటకును, బుస్సీ కట్టుబాట్లు చేసెను. బుస్సీ తన అధికార గౌరవము నిలువ బెట్టుకొనుటకొరకును, తన సౌఖ్యముకొరకును, కావలసిన సొమ్ముకన్న హెచ్చుసొమ్మును తన క్రింద వినియోగించుకొనలేదు. దేశములో అక్రమములు చేయు వారికి బుస్సీ పేరు సింహ స్వప్నముగా నుండెను.

ప్రభుత్వమువారి ఆజ్ఞా ప్రకారము బుస్సీ తన ఫ్రెంచి సైన్యమును తీసికొని తరలిపోగా, నిజాము సలబతుజంగు దిక్కులేని వాడయ్యెను. ఈ యదనును గ్రహించి సలబతుజంగు తమ్ముడు నిజామలీఖాను రాజపదవి పై కన్నువైచి తత్సంపాదనాప్రయత్నములు చేయసాగెను. అందుచే జయములమీద జయములను పొందుచు. ఫ్రెంచి వారికి నిలువ నీడలేకుండ చేయుచున్న ఇంగ్లీషువారిని సలబతుజంగు ఆశ్రయించి క్రీ. శ. 1759 లో వారితో ఒక సంధిచేసికొనేను. ఆ సంధిప్రకారము నిజాము సలబతుజంగు మచిలీపట్టణముక్రింద నుండిన 80 మైళ్ళ సముద్రపు భూభాగమెల్ల ఇంగ్లీషువారికి స్వాధీనము చేసెను. మిగిలిన దేశము పేరునకు నిజాము క్రిందనున్నను, ఇంగ్లీషువారి పలుకుబడియే అక్కడ చెల్లుచుండెను. ఐతే