Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అబుల్ హసన్ తానాషా


బెదరించెను. సయ్యదు సుల్తాన్ సంబంధము మేమొల్ల మనియు, మమ్ము నిర్బంధించినచో ఆత్మహత్య చేసికొందు మనియు పెండ్లికూతురును, ఆమె తల్లియును శఠించిరి. సర్వసన్నాహములు పూర్తియగుటచే సుల్తాన్ అబ్దుల్లా కర్తవ్యమును ఊహింపజాలకుండెను. వివాహమాపుట మంచిదిగాదు. గృహకల్లోలము దెచ్చుకొనుటకూడ వాంఛనీయము కాదు. అందుచేత ఆ సుముహూర్తముననే రాకుమారిని మరియొకని కిచ్చి పెండ్లి చేయుటకు రాజు నిశ్చయించెను. అంతరంగికులును అట్లే అభిప్రాయపడిరి . అరిషడ్వర్గముల కతీతుడై సర్వసంగ పరిత్యాగియై సర్వజన రంజకుడై యున్న అబుల్ హసన్ మాత్రమే ఈ సందర్భమున ఎల్లరకును హృగ్గోచరుడయ్యెను. రాణులును, మంత్రి సామంత హితులును, సర్దారులును ముక్తకంఠముగ అబుల్ హసనునకు రాజు తన మూడవ కుమార్తెనిచ్చి వివాహము చేయనగునని చెప్పిరి. రాజును అబుల్ హసన్ విషయమున తాత్పర్యముగలవాడయి యున్నందున మనఃపూర్తిగ నందుల కంగీకరించెను.

పెండ్లినాడు సుల్తాను యొక్క ఆజ్ఞా ప్రకారము సామంతహిత పురోహితులు సాలంకృతమును, సుసజ్జీ కృతమును అగు నుత్తమాశ్వమును తీసికొని గోలకొండ కోట తూర్పు ద్వారమగు విజయ ద్వారమునొద్ద ఘాజీ బండపై నున్న ఖత్తాల్ ఆశ్రమమునకు వచ్చిరి. పెండ్లి కుమారుని వేషములోనున్న అబుల్ హసనును వివాహ వేదిక కడకు తీసికొనిపోయిరి. సయ్యదు సుల్తానుతో వివాహము కొరకు సిద్ధమయిన సరంజామాతో సుల్తాన్ అబ్దుల్లా కుతుబుషా ఆ సుముహూర్తముననే తన మూడవ కుమార్తెను అబుల్ హసనున కిచ్చి పెండ్లిచేసెను. సయ్యదు సుల్తాన్ సపరివారముగ ఔరంగజేబు కొల్వులో ప్రవేశించెను. అబుల్ హసనున కీ భార్యవలన అబ్దుల్లా జీవిత కాలములోనే ఇరువురు కుమార్తెలును, ఒక కుమారుడును కలిగిరి. ఈ వివాహము తరువాత సుల్తాన్ అబ్దుల్లా కుతుబుషా పండ్రెండు సంవత్సరములు రాజ్యము చేసెను. ' అబుల్ హసను పట్టాభిషేకము గూడ అత్యద్భుత పరిస్థితులలో జరిగినది. పెద్ద అల్లుడగు నయ్యదు నిజామొద్దీన్ అహమదు రాజ్యాంగముపై అధికారము నెరపు చుండెను. క్రీ, శ. 1670 లో హయాత్ బక్షు బేగం చనిపోయెను. అప్పటి నుండి గోలకొండ పరిపాలనా చక్రము అతనికి సంపూర్ణముగ స్వాధీనమయి పోయెను. 1672 ఏప్రిలులో అబ్దుల్లా కుతుబుషా జబ్బుపడెను. 1672 సం. ఏప్రిలు 19 వ తేదీనాడు అతనికి స్మారకము తప్పినది. అతడెట్టి మరణ శాసనమును వ్రాయలేదు. అబ్దుల్లా రెండవ అల్లుడు మహమ్మదు సుల్తాను అనుమానముపై తండ్రి యగు నౌరంగజేబుచే నిర్బంధింపబడి, చెరసాలయందే కృశించి మరణించెను పెద్ద అల్లుని అవజ్ఞతయు, పెద్ద బిడ్డ అహంభావమును అబ్దుల్లాకు సహింపరానివయ్యెను. తనకల్లుడును, కొడుకువంటి వాడును అగు అబుల్ హసనునే రాజుగా చేయవలయునని ఆతడు కోరుచుండినట్లు ఆతని నడవడికయే నిదర్శనముగ నుండెను. పెద్ద బిడ్డకు సంతానములేదు. అయినను, ఆయమ తన సవతి కుమారుడగు సయ్యదలీ మాసూం అనువానికి పట్టము కట్టవలయునని భావించుచుండెను. సైన్యము, సర్దారులు, రాజ లాంఛనములు, పరిపాలనా చక్రము, బొక్కసము అన్నియు పెద్దల్లుని స్వాధీనమున నుండెను.

మరణశయ్యపయి నున్న మామను చూడబోయిన అబుల్ హసనును అంతఃపురములోనికి పెద్దల్లుని పరివారము రానీయలేదు. అతని గుఱ్ఱమును గాయపరచిరి. అతని నవమానించి పంపివేసిరి. సైన్యాధ్యక్షుడును, నిజామొద్దీను నసహ్యించు కొనువాడును అగు సయ్యదు ముజఫరు ఈ సంఘటనను సాకుగ దీసికొని తన కార్యదర్శి, పేష్కారు లగు మాదన్న అక్కన్నల దీవిశేషమున సైనిక పరిపాలన, ఆర్థిక ప్రాముఖ్యముగల ప్రదేశములను చేజిక్కించుకొని రాజ ప్రాసాదమును ముట్టడి వేసెను .నిజా మొద్దీనును లోలోన నేవగించువారెల్లరు ఈ పరిస్థితిని గమనించి అబుల్ హసనున కండగ నిలిచిరి. అబ్దుల్లా కుతుబుషా 1672 ఏప్రిలు 21 తేదిన మరణించెను. సయ్యదునిజా మొద్దీన్ అహమదు, అతని భార్య, అతని కుమారుడు సయ్యద లీ మాసూం బంధింపబడిరి. మాసూం పారిపోయి ఢిల్లీ చక్రవర్తి కొలువులో చేరెను. నిజామొద్దీను అతనిభార్యయు వధింపబడిరి 1672 సం. ఏప్రిలు 23 వ తేదీయందు అబుల్ హసన్ తానాషా రాజుగ ప్రకటింపబడెను.