అబుల్ హసన్ తానాషా
సమన్వయపరచి సూత్రీకరించినచో ఈతని కౌమార యౌవనదశా విశేషములను గూర్చి తెలిసికొనవచ్చును.
కుతుబ్ షాహి పాదుషాలు విషయలంపటులు, ఆద్యంతముల రాజులిరువురు తప్ప మిగత వారెవ్వరును షష్టి పూర్తి చేసికొనలేదు. వీరి యల్పాయుర్దాయమునకు కారణములను ఇతరత్ర వెదకనవసరము లేదు. అబుల్ హసన్ పుట్టి పెరిగిన వాతావరణ మెట్టిదో పై విషయముల వలన సుగ్రాహ్య మగుచున్నది. పరిసర పరిస్థితుల ప్రభావమువలన అబుల్ హసన్ విషయ లౌల్యమున నెల్లరను తలదన్ను వాడయ్యెను. అంతఃపుర ఆదర్శములు పవిత్రత సడలి మలినమయి పోయినవి. అంతఃపుర స్త్రీల మానములు, పరిచారకుల శీలములు శిథిలములుకా జొచ్చినవి. అతి మెత్తనివాడును, విషయలోలుడును అగు అబ్దుల్లా సుల్తానుకు గూడ నీతని ప్రవర్తనము దుస్సహ మయ్యెను. ఆతడు మందలించెను, రాణులు చులకన చేసిరి. రాజును, రాణులను అనుసరించి తిరుగు పరిచారికా బృందముకూడ ఈ మార్పును గమనించి ఆ రాజకుమారు నవమానించి యుందురు.
అబుల్ హసన్ అవమానములను సహింపలేని వాడయ్యెను. రాజ భోగములకు స్వస్తి చెప్పి, అంతఃపుర సౌఖ్యములను త్యజించి ఫత్తేదర్వాజా (విజయ ద్వారము) కడ నివసించియున్న విఖ్యాత వలీ (యోగి) యగు షా రాజూ ఖత్తాల్ ను ఆశ్రయించెను. అప్పు డాతని వయస్సు రమారమి ఇరువది సంవత్సరము లని తెలియుచున్నది. అతడు భయ భక్తులతో, ప్రేమ విశ్వాసములతో గురువును సేవించుచు, అతని కృపకు పాత్రుడయ్యెను. అందుచే నా వలీ అబుల్ హసనును “తానాషా" యని ముద్దుగ పిలిచెడువాడు. “తానాషా" యన "బాలయోగి" యని యర్థము. తానాషా పదునాలుగేండ్లు గురు శుశ్రూష చేయుచు ఆ యాశ్రమమందే గడపెను.
ఆ యాశ్రమజీవిత మాతనిని ప్రజాసామీప్యమునకు దెచ్చినది. ప్రజల అవసరములు, ఆవేదనలు, ఆ వేశ కావేషములు, కష్టసుఖములు తెలిసికొని, వాటిలో భాగస్వామి యగుట కనేక అవకాశములు అతనికి లభించినవి. ప్రజాబాహుళ్యములో రాజుగ నాతడు సంపాదించిన అనుపమ ప్రేమ గౌరవములకు ఈ ఆశ్రమ జీవితము పునాది రాయియైనది. క్రింది తరగతి వారితో సన్నిహితత్వ మేర్పా టయినది. మతసహనము, పీడిత ప్రజానీకము నెడ సానుభూతి, విశాలదృక్పథము ఏర్పడినవి. అందువలన దక్షిణాపథ మేలిన ముస్లిం ప్రభువులలో సేరికిని లభ్యముగాని గౌరవ ప్రతిపత్తు లీతనికి లభించినవి. ఇతనిలో కలిగిన అద్భుతమగు మార్పును గమనించి మున్నీతని ద్వేషించిన వారిప్పుడు ఈతనియెడ అనురక్తు అయిరి.
అబుల్ హసన్ వివాహము విశ్రాంతి గొల్పు పరిస్థితులలో జరిగినది. సుల్తాన్ అబ్దుల్లా కుతుబుషా తన మూడవ కుమారిక వివాహము చేయవలసి వచ్చెను. పెద్దల్లుడగు సయ్యదు నిజామొద్దీన్ అహమదు ఆలోచనానుసారము అతని గురు పుత్రుడును, అరేబియా దేశీయుడును అగు సయ్యదు సుల్తాన్ అనువానికి ఆమె నిచ్చి పెండ్లిచేయుటకు అబ్దుల్లా కుతుబుషా నిశ్చయించెను. రాజ ప్రాసాదములో వివాహ సన్నాహములు చురుకుగా సాగు చుండెను.
ఆ సమయముననే ఫతేదర్వాజాకడ నున్న ఆశ్రమములో షా రాజూ ఖత్తాల్ తన శిష్యపుంగవుడగు అబుల్ హసన్ తానాషాను పెండ్లికొడుకును జేసెను. ఆ యోగి పుంగవుడు సొంత పర్యవేక్షణమున అంతఃపురములో జరుగు వివాహ కార్యకలాపములను స్నాతకములవంటి వాటిని ఆశ్రమములోకూడ జరిపించెను. ప్రజలు ఆశ్రమములోని వేడుకలను, ఆ యోగిచర్యలను విడ్డూరముగ చూడసాగిరి. అబుల్ హసన్ వివాహప్రయత్నము జరుగనున్నదని షా రాజూ ఖత్తాల్ వలీ అందరకు వివరించుచుండెను.
చిత్రము! ఇంతలో సుల్తాను పదమున పెత్తనము వహించి వరనిశ్చయము చేసిన పెద్దల్లుడు నయ్యదు నిజామొద్దీన్ అహమదునకును, వరుడుగా నిశ్చయింపబడిన సయ్యదు సుల్తానునకును మధ్య దైవ ప్రేరితముగ తీవ్ర విరోధ మేర్పడెను. కలహభోజనుల యాజ్ఞికమున ఆవిరోధ జ్వాల యాకసమంటునట్లు ప్రజ్వరిల్లినది. సయ్యదు సుల్తానునకు రాకుమారి నిచ్చి పెండ్లి చేయవలదని ఆతడు పట్టు పట్టెను. తనమాటనుత్రోసిపుచ్చి, నిశ్చయించిన ప్రకారము రాకుమారి వివాహమును జరుపనున్నచో తాము సపరి వారముగ ఔరంగజేబుతో జేరిపోయెదనని పెద్దల్లుడు