Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అబిసీనియా (ఇథోపియా)

దేశములో ఆధునిక జీవన పద్ధతిని ప్రవేశ పెట్టి అభ్యుదయమునకు రాస్ తఫారిమా కొనెన్ పాటుపడెను. 1928 లో ఇథోపియా నానాజాతి సమితి (League of Nations) లో సభ్యత్వమును పొందెను, జుడిత్ రాణి యొక్క మరణానంతరము 1930 లో మాకొనెన్ "హేలే సెలా షే" అను బిరుదముతో ఇథోపియా చక్రవర్తి యయ్యెను.

ఇటలీ సామ్రాజ్య తృష్ణ చేత అబిసీనియాను బెదరించ మొదలు పెట్టినది. 1934 లో ఎరిట్రియా వైవు ఎన్నో సరిహద్దు సంఘటనలు జరిగెను. అక్టోబరు 8, 1935 నాడు ఇటలీ అబిసీనియాపై దాడిచేసెను. బ్రిటిష్ వారు ఫ్రెంచి వారు చేసిన సంధి ప్రయత్నములు విఫలమయ్యెను. ఆధునిక యుద్ధ సాధనములతో, విమాన దాడులతో ఇటాలియను సేనలు అబిసీనియాను నాశనము చేసెను, అబిసీనియారాజు నానాజాతి సమితి సహాయమునుఅర్థించెను. కాని లాభము లేకపోయినది. మే 5, 1936 నాడు ఇటాలియన్ సైన్యములు ఇథోపియా రాజధాని యైన “ఆడిస్ అబాబా” లో ప్రవేశించెను. ఎరిట్రియాను, ఇటాలియన్ సోమాలి లాండును, ఇథోపియాను కలిపి "ఇటాలియన్ తూర్పు ఆఫ్రికా" అని పేరు పెట్టిరి.

ఇటాలియనులు వలస రాజ్యమును బలపరచిరి. అబిసీనియావారు గెరిల్లా యుద్దమును ప్రారంభించిరి.ఇటాలియనులు దేశములో రోడ్డులు నిర్మించి గెరిల్లా దళములను తరుముటకు ప్రారంభించిరి. 1938 లో " హే లే సెలా షే" బ్రిటనులో తలదాచుకొనెను. ఇంతలో రెండవ ప్రపంచ సంగ్రామము వచ్చెను. అబిసీనియా కూడ యుద్ధరంగమయ్యెను.అబిసీనియా రాజు 1941 లో బ్రిటిష్ వారి సహాయముతో స్వదేశము చేరుకొని ఇటాలియనులతో యుద్ధము సాగించెను. విజయము పొందెను. "హేలే నెలా షే" మరల అబిసీనియా చక్రవర్తి (మే 1941) యయ్యెను. తరువాత మిత్ర రాజ్యములతో చేరి జర్మనీ, ఇటలీ, జపాన్ దేశములపై అతడు యుద్ధమును ప్రకటించెను. యుద్ధానంతరము ఐక్య రాజ్య సమితి (U.N.O.) లో అబిసీనియా చేరిపోయెను, 1945 లో ఆసమితి ఛార్టరుపై సంతకము చేసిన 50 దేశాలలో అబిసీనియా కూడ ఒకటి.

అబిసీనియాలో విద్య ఆరోగ్యరక్షణము పరిశ్రమలు రవాణా సౌకర్యములు మున్నగువాటిని అభివృద్ధి చేయుటకై ఐక్యరాజ్య సమితి యందలి వివిధ శాఖలు, అమెరికా బ్రిటస్ దేశములు తోడ్పడుచున్నవి. దేశము అభివృద్ధి పొందుచున్నది.

డిసెంబరు 2, 1950 నాడు ఎరిట్రియా, అబిసీనియాలో చేరిపోవలెనని ఐక్యరాజ్య సమితి నిర్ణయించెను. ఆ నిర్ణయము ప్రకారము 1952 లో ఎరిట్రియా ఆంతరంగిక పరిపాలనలో సంపూర్ణ స్వపరిపాలనాధికారము గల. రాష్ట్రముగా అబిసీనియాలో అంతర్భాగమై పోయెను. ఎరిట్రియా ప్రతినిధులు అబిసీనియా పార్లమెంటు సభ్యులైరి.

ఉ. రా.

అబిసీనియా (భూగోళము) :- అబిసీనియా లేక ఇథోపియా అనబడు దేశము ఆఫ్రికా ఖండములో నొక పెద్ద స్వతంత్ర దేశము. 1936 లో ఇటలీ తనలో అబిసీనియాను కలుపుకొన్నప్పటికి, రెండవ ప్రపంచ యుద్ధానంతరము, అనగా 1942 లో ఈ దేశము మరల స్వాతంత్య్రమును సంపాదించుకొనెను. దీని చుట్టును బ్రిటిషు, ఫ్రెంచి, ఇటలీ రాజ్యము లున్నవి. ఈ దేశము చాల భాగము పర్వతమయము. ఈ దేశము యొక్క విస్తీర్ణత 3,50,000 చదరపు మైళ్ళు. దీని జనాభా షుమారు 1,00,00,000. దేశమంతయు మొత్తముమీద ఎత్తైనభూమి అగుటచేతను, పర్వత ప్రాంత మగుట చేతను, అందు రాకపోకలకు ఎంత మాత్రము సౌకర్యములు లేవు. ఈ కారణము చేతనే, ఈ దేశములో కొంత ఖనిజసంపద ఉన్నప్పటికిని ఆర్థిక-అభివృద్ధి చాల మందముగా నున్నది. ఈ దేశమునకు సముద్ర ప్రాంతము ఎంతమాత్రము లేకపోవుట చేత, ఇతర దేశములతో వ్యాపారమునకై ఫ్రెంచి సోమలిలాండు లోని జిబుతి రేవు పట్టణము మీదనే అబిసీనియా ఎక్కువగా అధారపడవలసివచ్చినది. భూమి సారవంతమైన దగుట చేతను, వేసవి యందు వర్షములు కురియు కారణము చేతను, ఈ దేశములో వ్యవసాయము ఎక్కువగా అభివృద్ధి నొందినది. ప్రత్తి, గోధుమ, కాఫీ, బార్లి - ఇచ్చట ప్రధానమైన పంటలు. బ్లూనైలు నది ఆధారము వలన ఎల్లప్పుడు భూమి దున్నుటకును, వ్యవసాయము చేయుట