అన్నమాచార్యులు - తాళ్లపాక
రచించిన ఈ జోలపాటను పాడగా స్వామి దర్శనార్థమై వచ్చిన భక్త కోటికి ఆ పాట జిహ్వాగ్రగతమై లోకమున వ్యాపించి యుండును.
గండవరపు బాలగోపాల నామాంకితముగా నున్న 'లాలిపాట' కూడ అన్నమయ్య రచించినదే అని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు అభిప్రాయపడినారు. ఆ పాటలో ఎచ్చటను అన్నమయ్య పేరు లేకపోయినను గండవరము తాళ్ళపాక వారికి చెల్లుచు వచ్చిన గ్రామ మగుటచే, అన్నమయ్య తమ ఊరి స్వామిమీద ఈ 'లాలి పాటను'— 'జోలపాట ను రచించినట్లే, — రచించి యుండునని వారి యూహ.
ఇట్లు అన్నమయ్య సంకీర్తనములే కాక ఇతర సారస్వత ప్రక్రియలనుగూడ రచించెను.
అన్నమయ్యకు పూర్వము తెలుగులో పరాశ్రయ రచనములకే వ్యా ప్తియుండినది. ఆత్మాశ్రయ రచనమును తొలిసారిగా తెలుగులోనికి తెచ్చినకీర్తి అన్నమయ్యదే అనవలసి యున్నది, ఇతర వ్యక్తుల కంటెను, వారి అనుభవముల కంటెను అతడు తన పదరచనములలో తన అంతరంగ బహిరంగానుభవములనే ముఖ్యముగా వెలువరించినాడు. ఇట్టి 'విషయి ప్రధానమయిన రచనమునకు వర్చస్సు నిచ్చునది 'ఆర్జవము" అనుగుణము. ఆర్జవమనగా తాననుభవించిన భావములనే వెలువరించు అకృత్రిమ స్వభావము. ఇతరుల మెప్పులకో, సంప్రదాయ సంరక్షణమునకో ఆశపడి తన మనస్సున నిజముగా లేని భావములను ఆరోపించుకొని అతడు రచనా వ్యాపారమును సాగింపలేదు. ఋజుత్వమే జీవధర్మముగా బ్రతికినవాడు అన్నమయ్య. ఆ అర్జవగుణమే అతనికి వ్యవహారములోను కవితలోను భావములకు తీవ్రతతోపాటు భాషకు పదనైన తీర్పునుకూడ ఈయగలిగినది. అన్నమయ్య సంస్కార సిద్దమై సహజమయిన కవితాశిల్పమును ఎన్నడును పదను చెడని భావనాశక్తిని కలవాడు. తన ఇష్టదైవమైన వేంకటేశ్వరమూర్తి నే ఆధి భౌతికమును ఆధ్యాత్మికమున సర్వ ప్రపంచములోను అంతర్యామిగను, బహీర్యామిగను భావించి, పూజించి, ప్రేమించి, కలహించి, ప్రాధేయపడి, ప్రార్థించి, పొగడి, తెగడి, అనుభవించి, ఏకీభవించి జీవితములోని అంతరంగ బహిరంగ పరమాణువులన్నిటను అతని బ్రతుకే బ్రతికినాడు. ఆ యనుభవములను మానసికముగాను, కాయికముగాను మాత్రమే కాక వాచికముగా కూడ అనుభవించినాడు. ఆ వాచి కానుభవాలే ఆయన 'పదకవితలు'.
ఇట్టి పదకవితలను ఈతడు వేలకొలదిగా సంకీర్తనాత్మకముగా వ్రాయుటకు వైష్ణవ సంప్రదాయమునకు చెందిన ఆళ్వారుల ద్రవిడ ప్రబంధములు కొంతవరకీతనికి ఉద్బోధకములై యుండవచ్చును. తెలుగునకు సంబంధించినంతవరకు అన్నమయ్యయే ఇట్టి పద రచనకు ఆద్యుడు. అందుచేతనే ఆతనికి గల 'పదకవితా పితామహుడు' అను బిరుదము సార్థకమనదగి యున్నది. కృష్ణమాచార్యుని 'సింహగిరి నరహరి వచనములు' ఇంత కంటె పూర్వమే తెలుగున వెలసియున్నను అవి గేయ రచనములేయయ్యు అంగాంగిభావ విభాగము లేక అఖండ గద్యధారగా గేయగంధులుగా మాత్రమే ఉన్నవి. అవికూడ మనకు నేడు లభ్యములగుట లేదు. పదునైదవ శతాబ్దమునకు కొంచెము ముందుగా కన్నడ భాషలో ముఖ్యముగా వైష్ణవదాసుల రచనములలో పదకవిత ఒక అచ్చుకట్టయిన స్వరూపమును సంపాదించుకొని నిలిచినది. ప్రాచీన సంగీత గ్రంథములలో ప్రబంధములనబడు గేయరచనలు మనదేశములో అసంఖ్యాకములుగా నుండెడివనియు, రాగము, తాళము, శబ్దము, అర్థము, సందర్భము మొదలయిన వాటినిబట్టి ఆ రచనలలో పెక్కు విభాగములు ఏర్పడియుండిన వనియు తెలియుచున్నది. ఆ చాదస్తములను అన్నిటిని వదలిపెట్టి సుప్రసిద్ధములయిన దేశిరాగములలో, సుగ్రహము అయిన లయ తాళములలో నిబంధించి సులభీక రింపబడిన రచనములే పదములు, కన్నడభాషలో ఇట్టి రూపముతో వెలసిన పదరచనమును తొలిసారిగా తెలుగు లోనికి దించినవాడు అన్నమయ్య. పదమునకు రెండే అంగములు. అవి పల్లవి, చరణము అనునవి ముఖ్యమై కేంద్ర భూతమయిన అర్థము పల్లవిలో నుండును. దాని విస్తరణమే. - వివరణమే చరణములో నిబంధింపబడును. పల్లవిలోని భావ మొక వాక్యములో ముగియకున్న యెడల రెండవ వాక్యమును అనుపల్లవిగా చేర్చి రచించుట కలదు. ఇట్లు పదరచనముల కొక అచ్చుకట్టు