Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అన్నమాచార్యులు - తాళ్లపాక

ఎక్ స్ట్రాక్టులు, పైటమినులుగల ఆహారములు ఇచ్చుట ఇందులకు జరుగవలసిన చికిత్స.

డా. ఎస్. వేం. రా.

అన్నమాచార్యులు- తాళ్లపాక  :- తెలుగు సాహిత్య చరిత్రములో తాళ్లపాక వారి కుటుంబము మిక్కిలి ప్రసిద్ధి చెందినది. తెలుగుదేశములో ముఖ్యముగా రాయలసీమయందు 'తాళ్ళపాకవారి కవిత్వము కొంత, నా పైత్యము కొంత' అను సామెత యొకటి ప్రచారములో నుండుటయే అందులకు ముఖ్య నిదర్శనము. సుమారు రెండు వందల సంవత్సరములకింకను పై బడిన కాలమున (క్రీ.శ. 15, 16 శతాబ్దులలో) ఈ కుటుంబమునకు చెందిన వారు అనేక గ్రంథములను రచించి గొప్ప కవులుగాను గాయకులుగాను ప్రసిద్ధిచెందిరి. వారిలో అన్నమయ్య ప్రథముడు. ఇతనికి తరువాత పెద్ద తిరుమలాచార్యుడు, చిన తిరుమలయ్య, చిన్నన్న, తిరువెంగళప్ప అను వారు ఈ కుటుంబమున ప్రసిద్ధి వహించిరి.

వీరు తొలుత నందవరీక నియోగి బ్రాహ్మణులు. ఋగ్వేదులు. ఆశ్వలాయన సూత్రులు. భారద్వాజస గోత్రులు. వీరిలో అన్నమయ్య తొలుత వైష్ణవమును స్వీకరింపగా అతని తరువాత ఆ వంశమువారు అందరును వైష్ణవులైరి.

అన్నమయ్య క్రీ. శ. 1424వ సంవత్సరమునకు సరియగు క్రోధి సంవత్సరమున వైశాఖమాసములో విశాఖా న క్ష త్ర ము నందు జన్మించెను. ఇతని తండ్రి నారాయణసూరి. తల్లి లక్కమాంబ. పొత్తపినాటిలోని "తాళ్లపాక " గ్రామము వారి నివాసస్థలము. ఈ 'తాళ్లపాక ' (మను గ్రామము నేడు కడప మండలములో రాజం పేట తాలూకాయందు ఉన్నది. అన్నమయ్యశ్రీవేంకటేశ్వరస్వామివారి నంద కాంశమున అవతరించెనని ప్రసిద్ధి.

ఇతడు బాల్యమునుండియును గొప్ప భక్తుడు. ఎల్లప్పుడు భగవంతునే స్మరించుచు, అతని స్తోత్రపారాయణములే చేయుచు, తక్కిన విషయములందు అంత శ్రద్ధాభక్తులు చూపకుండెడివాడు. ఇతని తల్లిదండ్రులును, వదినె అన్నలును ఏవైన పనులు చెప్పినయెడల ఇతడు పరాకున నవిచేయ మరచి వారిచే చీవాట్లు తినుచుండెడి

వాడు. ఇట్లుండగా అతనికి పదునారేండ్లు నిండినవి. పరమ భక్తాగ్రేసరుడై ఎల్లప్పుడును తన్ను స్మరించుచుండుట తప్ప వేరొక్క పనిని చేయనొల్లని ఆ బాలునికి శ్రీవేంకటేశ్వరస్వామి ప్రత్యక్షమై అద్భుత శక్తులను ప్రసాదించెను. అప్పటినుండి ఆతడు స్వామివారి యానతి చొప్పున సంకీర్తనములు రచించుటకు ప్రారంభించెనుఅతడాడినమాట అమృతకావ్యమును, పాడిన పాట పరమ గానమును కాజొచ్చినవి. ఇట్లు కొన్ని నాళ్లు సంకీర్తనములు చెప్పుచుండి అతడు శ్రీ వేంక టేశ్వర స్వామినిదర్శించుటకై తిరుపతికి ప్రయాణమాయెను. మార్గ మధ్యమున సంకీర్తన గానము చేయుచు అతడు కొన్ని దినములు ప్రయాణముచేసి తిరుపతి చేరుకొనేను. దిగువ తిరుపతిలో ఆతడు వేకువజామున బయలు దేరి కొండ మీదికి ఎక్కి పోవుచుండెను. కాని సంప్రదాయము తెలియక చెప్పులతోగూడ కొండనెక్కి పోవుచుండిన యా బాలుడు మిక్కిలి యలసిపోయి, మోకాళ్ళపర్వతము దగ్గర ఒక వెదురుపొద నీడలో మైమరచి నిద్రింపజొచ్చెను. అప్పుడు కలలో అలమేలు మంగమ్మ అతనికి దర్శనమిచ్చి, అతని యాకలిని పోగొట్టి, ఆ పర్వతము సాలగ్రామ మయమ గుట చే చెప్పులతో ఆ కొండ నెక్క రాదనియు, చెప్పులు విడిచిపోవలసినదనియు బోధించి అంతర్ధానముచెందెను. అతడు నిద్రనుండి మేల్కొని తనకు వచ్చిన కలకు మిక్కిలి ఆశ్చర్యపడి అప్పటి కప్పుడే ఆశువుగా అమ్మవారిపై ఒక్క శతకమును చెప్పెను.

తరువాత ఆతడు కొండమీదికిపోయి అచట శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించెను. ఆ చుట్టుపట్టుల నుండిన గోగర్భము, ఆకాశగంగ, పాపవినాశము మొదలగు పుణ్యతీర్ధములను సేవించెను. అక్కడనే ఒక వైష్ణవాచార్యుని యొద్ద అతడు వైష్ణవదీక్షను స్వీకరించి ముద్రా ధారణాది సంస్కారములను పొందెను. ముద్రాభారణానంతరము ఆ కొండమీది వైష్ణవులు అతనిని తమ పంక్తిలో నిడుకొని భుజించిరి. ఇట్లు భగవత్సంకీర్తనము చేయుచు, గురువుకడ శుశ్రూష నలుపుచు అన్నమయ్య కొండమీద కొంతకాలము నివసించియుండెను. ఇట్లుండ అతని తల్లియగు లక్కమాంబ తన కుమారుని వెదకుకొనుచు దేశమంతయు, తిరిగి తిరిగి వచ్చి తుదకు తిరుమలపైనున్న'