అన వేమారెడ్డి
ముమ్మడి నాయకుని రాజ్యసౌధమునకు మూలస్తంభము వంటి రాజమహేంద్రవరదుర్గమును ముట్టడించెను. ఈ యుద్ధ ఫలితముగా రాజమహేంద్రవరదుర్గము అన వేమారెడ్డికి వశమయ్యెను. మంచికొండదొరలు ఆతనికి సామంతులైరి.
రాజమహేంద్రవర విజయముతో నిరాటంకముగా అనవేమారెడ్డి తన సైన్యములను దక్షిణ కళింగమునందలి సింహాచల పర్యంతము నడపెను. దుర్గమారణ్య పర్వత పరిరక్షితమయిన ఈ ప్రదేశమును అనాగరకజాతులకు నాయకులయి వీరసామంతులని పిలువబడు మన్నెదొరలను వశపరచుకొని అన వేమా రెడ్డి తన కాలము నాటి వీరులలో మేటిగా గణన కెక్కెను.
గౌతమీతీరమునుండి ఉత్తరమున కళింగమువరకు వ్యాపించిన ఆంధ్రఖండమండలము అను భాగమునకు దొరలయి వీరసామంతులనబడిన కొప్పుల నాయకులను అన వేమారెడ్డి జయించెను. శారదానదీతీరమందలి వడ్డాది రాజధానిగ సింహాచల ప్రాంత దేశమును పాలించుచున్న మత్స్యవంశస్థుడగు వీరార్జున దేవునికూడ ఇతడు జయించెను. వారలచే కప్పములను గొనెను. అనవేమా రెడ్డి గొప్ప విజేత. ఇతడు "సింహాచలాది వింధ్యపాద ప్రతిష్ఠిత కీర్తి స్తంభు" డని పొగడబడెను. కాని ఇతడు బ్రతికియున్నంత కాలము రాచకొండ, దేవరకొండ దుర్గముల కధిపతులయి, రాచకొండ రాజ్యమును పరిపాలన చేయుచుండెడి అనపోత మాధవనాయకు లొకవంకను, విజయనగర ప్రభువు లొకవంకను ప్రబల విరోధులయి ఇతని రాజ్య మాక్రమించుకొనవలయు నని ప్రయత్నములు సతతము గావించుచునే యుండిరి. ఇతడు ప్రజాపరిచిత చతుర్విధోపాయుడు. కందుకూరు మొదలుకొని విశాఖ పట్టణమండలములోని సింహాచలపర్యంత దేశమును జయించి, ఈతడు పరిపాలన చేసినట్లు ఊహింపవచ్చును. శ్రీ శైలాది శాసనములందు కానవచ్చు బిరుదములలో కొన్ని వంశపారంపర్యముగా ఇతనికి సంక్రమించినవియే అయినను " రాజమహేంద్ర, నిరవద్యనగరాది బహువిధ స్థలదుర్గ వర్గ విదళన బలరామ". "సాగర గౌతమీ సలిల సంగమ సకల జలదుర్గ సాధన రఘురామ ' అనునవిమాత్రము ఇతని ప్రత్యేక బలప్రాభవములకు నిదర్శనములయి ఇకడు సాగించిన విజయ ప్రస్థానముల జయగౌరవచిహ్నములయి ఒప్పుచున్నవి.
ఇట్లు దిగ్విజయాలంకృతుడయి, ప్రజాహిత కారియై
"భూమీశే చిర మన్న వేమనృపతౌ భూయో లభంతే జనాః
మృగ్వన్నం మృదులాంబరం మృగమదం చామీకరం చానురమ్ ”
అను పొగడ్తకు పాత్రుడయి అన వేముడు ప్రజాపరిపాలన మొనర్చెను.
ఇతడు ఆగమశైవాచార పరాయణుడు. షట్కాలము అందు శివపూజ చేయు భక్తుడు. అనవేముని రాజ్యము శాంతి యుతమయి పాడిపంటలతో, ధనకనక వస్తు వాహనములతో తులదూగుచుండెను. ఇతడు గొప్పరసికుడు. కస్తూరీ, కుంకుమ, ఘనసార, సంకుమద, హిమాంబు, కాలాగరు, గంధసారములతో కవి, వాంశిక, వైతాళి కాదులకు ఉత్సాహ మధికమగునట్లుగా వసంతోత్సవము (మదనోత్సవము)లను జరిపి వసంతరాయడని పిలువబడెను.
అన వేమభూపాలుడు విద్యాభిమాని అనియు, పండిత పక్షపాతి అనియు, కవుల పాలిటి కల్పతరు వనియు అనేకములగు చాటుశ్లొక ములవలనను, పద్యములవలనను తెలియుచున్నది. ఇతనికాలమున బాలసరస్వతి విద్యాధి కారిగ నుండెను. తరువాత త్రిలోచనాచార్యుడు అను కవీశ్వరుడు శాసనాచార్యుడుగ కానవచ్చును. ఉప్పుగల్లు తామ్రశాసనమునకు బాలసరస్వతి కర్త. ఇమ్మడిలంక, వానపల్లి తామ్రశాసనములకు త్రిలోచనాచార్యుడు కర్త. ప్రకాశ భారతయోగి అను మరియొక ఆంధ్రకవీశ్వరుడు ఈ మహీపాలుని ఆస్థానమునందున్నట్లు తెలియుచున్నది. ఇతడు తన దాయాదుల చేతగూడ పొగడబడెను. కుమారగిరి పరపతిశాసనములో ధర్మతత్పరుడనియు, కాటయ వేమారెడ్డి శాసనములో సుజనుడనియు, కోమటి వేమారెడ్డి శాసనములో "విశ్వోత్తరుం”డనియు అన వేముడు పేర్కొనబడెను.
అన వేమారెడ్డి గొప్ప వితరణశీలుడు. తన తండ్రియగు ప్రోలయ వేమభూపాలునివలెనే బ్రాహ్మణ వృత్తులను, ధర్మములను కాపాడుటయేగాక, శ్రోతస్మార్త విద్యలను ప్రోత్సహించుటకై బ్రాహ్మణులకు అగ్రహారములు భూములు దానముచేసిన మహాదాతఇతడు. ఈ విషయమున