అనపోతారెడ్డి
అనపోతనాయడు కావ్య కథన ప్రియుడు. అతని కుమారుడు సింగభూపతి రచించినట్లున్న “రసార్ణవ సుధాకరమున” అనపోతనాయకీయ మను గ్రంథము ఉదాహరింపబడినది. అయినవోలు శాసన రచయిత పశుపతి పుత్రుడగు నాగనాథుడు. ఇతడు మదనవిలాసమను భాణమును సంస్కృతమునను, విష్ణుపురాణమును ఆంధ్రమునను రచించినట్లు వినికి. చమత్కార చంద్రికను రచించిన విశ్వేశ్వరకవి నాగనాథునికి గురువు. విశ్వేశ్వరకవి అనపోతనాయని ప్రశంసగల చమత్కార చంద్రికను సంస్కృతమున రచించెను. ఈ విధముగ అనపోతనాయనికి వాఙ్మయముతో సంబంధము కలదు. మాధవనాయడు తన అన్నయగు అనపోతనాయనికి రాచకొండ విడిచిపెట్టి దేవరకొండ దుర్గమును రాజధానిగ జేసికొనెను. మాధవనాయడు శ్రీశైలోత్తర ద్వారమగు ఉమామహేశ్వరమున గొప్ప శివాలయమును కట్టించి శాసనమును నెలకొల్పెను. మాయిభట్టారకుడు ఈతని శాసనకవి. అనపోత నాయడు హేమాద్రి పేర్కొన్న దానము లన్నియు గావించుటయే గాక శ్రీశైలము నెక్కుట కనుకూలముగ సోపానములు గట్టించెను. రాచకొండ హైద్రాబాదునకు తూర్పున 32 మైళ్ళ దూరమున నున్నది. పర్వతముల మధ్యభాగముననున్న ఈ పట్టణము 15 మైళ్ళు చుట్టు కొలతగలది. నగర చిహ్నములు ఇప్పటికిని గోచరించును. ఈ వంశమున ఇద్దరు ముగ్గురు అనపోత నామధేయులు కలరు గాని అంత ప్రసిద్ధులు గారు.
బహమనీ రాజ్యము క్రీ. శ. 1347 లో నెలకొల్ప బడెను. పిదప మహమ్మద్ షా రేచర్ల అనపోతనాయని ఏలుబడిలోనున్న ఓరుగల్లు గోలకొండ దుర్గములపై దండయాత్ర సాగించెను. ఓరుగల్లు వశముగాలేదు. గోలకొండ దుర్గమును మాత్రము అనపోతనాయడు మహమ్మద్ షాహకు ఇచ్చి తన రాజ్యమున ప్రవేశింపకుండ కట్టడి చేసికొనెను. రాచకొండ దుర్గమున గాలిబు సాహెబుగోరీ కలదు. ఇతడు రాచకొండను గెలువవచ్చిన వాడందురు. ఇతడు క్రీ. శ. 1484 న ఉండెనని తెలియుచున్నది. వెలమవీరుల యేల్పడి అంతతో నశించెను. అక్క పోలమ్మ అను వీరకాంత విగ్రహమునుగూర్చి వింతకథ యొకటి చెప్పుదురు. రాచకొండ బౌద్ధయుగమునగూడ పేరొందినది. కాకతి గణపతిదేవుని కాలమున విశ్వేశ్వరశంభువు గోళగిమఠమును నెలకొల్పెను. వెలమవీరులు అనపోతనాయనివరకు శైవులే.
అనపోతనాయడు దుర్గమున భైరవ విగ్రహముల నెక్కుడుగ నెలకొల్పెను. శివాలయములను ప్రతిష్ఠించేను.రమణీయమగు శిల్పముగల విగ్రహములీ కోటలో నెక్కుడుగనున్నవి. ఇంత దృఢతరమగు దుర్గమేలుచున్న అనపోత నాయడు ఒక వైపు విద్యానగర రాజులతోడను, ఇంకొకవైపు కొండవీటి రెడ్లతోడను, మరియొక వైపు మహమూద్ షాహ తోడను సంగ్రామములను కావించుచుండుటచేత రానురాను బలము సన్నగిల్లి తరువాత రాచకొండ దుర్గము క్రీ. శ. 1484 తో అంతరించెను. తెలంగాణమునకు రాజధాని కావలసిన రాచకొండ మహారణ్యములలో లీనమయ్యెను. ఈదుర్గమును కాకతీయులు కట్టించి వెలమవీరుల సంరక్షణమున కుంచిరి. అనపోత నాయనితో దీని వైభవ మంతరించినది. తరువాత మూడు నాలుగు తరములలో ఈ వంశము క్షీణదశకు వచ్చినది.
ది. వి. ర.
అనపోతారెడ్డి : – (క్రీ. శ. 1350-1362) ప్రోలయ వేమా రెడ్డి అనంతరము అతని జ్యేష్ఠ కుమారుడు పోతారెడ్డి అద్దంకి సింహాసనమును అధిష్ఠించెను. "వీ రాన్న పోతనృపతి" అను బిరుదమును వహించిన ఈతడు తన తండ్రి కాలముననే యువరాజుగనుండి, రాజనీతియందు అసమానమైన ప్రావీణ్యముగల మహామంత్రుల చేతను- యుద్ధనీతి విశారదుడైన పినతండ్రి మల్లా రెడ్డి చేతను సుశిక్షితుడై యుండెను.
పట్టాభిషిక్తుడగుటకు పూర్వమే సంపూర్ణ పరిపాలనా పాటవమును ఆర్జించిన ఈతడు తాను ప్రభువై "పటుః పాలన కర్మణి" అను బిరుదము సార్థకమగునట్లు ప్రభుత్వమును నెరపెను. సప్తవిధ రాజ్యాంగములలో అతిముఖ్యమయిన దుర్గరచనా ప్రాముఖ్యము నెరిగిన ఈతని నీతి కౌశలమునకు పితృక్రమాగతమయిన అద్దంకి అను రాజధానిని కొండవీటికి మార్చుటయే ప్రబల నిదర్శనము. ఉత్సాహవంతుడై కృష్ణా గోదావరీ నదీద్వయ మధ్యస్థమయిన దేశమును జయించుటకు ఉవ్విళ్ళూరుచున్న అన పోతా రెడ్డికి శత్రుదుర్భేద్యమగు దుర్గమొకటి ఆవశ్యకమై