Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనపోతారెడ్డి


యుండెను. కాని అద్దంకి చిన్న నగరమగుట చేతను, అందు బలమైన దుర్గములు లేకుండుటచేతను, తూర్పు పడమరలందు సంగమ వంశీయులు, కాపయనాయకాదులు బలవంతులై యుండుట చేతను, అనపోతా రెడ్డి కొండవీటి దుర్గమును యంత్రసనాథముగ జేసి, సౌందర్య యుతమును, నివాసయోగ్యమును అగు నొక నగర నిర్మాణము గావించి తన రాజధానిని అచ్చటకు మార్చెను. తాను సింహాసనారూఢుడైన మూడు నాలుగు సంవత్సరములలోనే అనపోతా రెడ్డి బహుళ సైన్యములను కూర్చుకొని కృష్ణను దాటి విజయయాత్రకై బయలు దేరెను. రాజ్యధురంధరుడైన అనపోతా రెడ్డికి తన బంధువుల సహాయ సహకారములు అధికముగ లభించెను. దండయాత్రా సందర్భములందు ఇతనికి తన తోబుట్టువుల భర్తలును, సేనాపతులును అయిన నల్ల నూకయ రెడ్డియు, విధేయుడును, ప్రచండ సేనానియునగు అనవేమా రెడ్డియు మిక్కిలి తోడ్పడిరి.

క్రీ.శ. 1355వ సంవత్సరమునాటి ద్రాక్షారామ శాసనమొకటి ఇతని విజయములను ప్రశంసించుచున్నది. అందు ఇతడు 'ద్వీప జేత' గా పేర్కొనబడెను. వైరివీరమద భంజనుడను ప్రశస్తిని గడించిన ఇతనిరాజ్యము సర్వదా శత్రుకంటకమై, సాటివీరులకు కబళింపవలయునను కుతూహలమును గలిగించుటచేత, దక్షిణము నుండి కర్ణాటకులును పశ్చిమము నుండి పద్మనాయకులును ఈ రాజ్యము నాక్రమింపవలయునని ప్రబల ప్రయత్నములు సలుపుచుండిరి. ఈ రేచర్ల పద్మనాయకులు కాపయనాయకుని సామంతులు. వీరి నాయకరములు, ఆధిపత్యములు తెలంగాణాలోని కైలాసకోట, ఇందూరు, మెదకు ప్రాంతముల యందుండెను. ఈ రేచర్ల నాయకులగు అనపోతా నాయకునితోను,మాదానాయకునితోను అనపోతారెడ్డికి పోరు సంప్రాప్తమైనప్పుడు అనపోతారెడ్డి యొక్క గజ, హయ,రఖాది సాధనములన్నియు హతము కాగా, అతడు ప్రాణ రక్షణమునకై పారిపోయెనని వెలుగోటివారి వంశావళి పేర్కొ నుచున్నది.. కాని తదితరాధారములవల్ల ధాన్య వాటి పురము యొక్క ముట్టిడి సందర్భములో అనపోతా రెడ్డి ప్రచండ విక్రమార్కుడై భూరిసైన్యములతో వారల నెదుర్కొని ఘోర సంగ్రామమును నిలిపి శత్రువులను కృష్ణానది కావలిప్రక్కకు తరిమి పరాభవించెనని తెలియుచున్నది. ఈ సందర్భమునందు విజేత లెవ్వరైనను, రేచర్ల పద్మనాయకులకు మాత్రము ఆ రాజ్యము లభింపలేదనుట నిశ్చయము.

క్రీ శ. 1358 వ సం. నాటికే అనపోతా రెడ్డి దివిసీమను, గుడివాడ విషయమును, ప్రస్తుతపు బందరు తాలూకా ప్రదేశములను ఆక్రమించుకొని పాలించుచుండె ననుటకు నిదర్శనములు గలవు. శాలివాహన శకము 1280 వ సంవత్సరమున అనపోతారెడ్డి 'కొల్లూరు' గ్రామమును " అనపోతాపురము ” అను "పేరుతో బ్రాహ్మణులకు సర్వాగ్రహారముగ దాన మొసగెను. ఈ విధముగ కృష్ణా గోదావరి మధ్యస్థ దేశమును జయించుటకు సైన్యముల నడిపిన వీరాన్న పోతన్న పతికి కొన్ని దేశములు స్వాధీనపడియు, కొన్ని కొంతవరకే చేజిక్కియు, కొన్ని అధికతర నిరోధమును కల్పించియు చేజిక్కినవి. అట్లు స్వాధీనపడిన దేశాధిపతులలో భక్తి రాజులు, ఏరవచోడులు,కోన హైహయులు, మానవ్యస గోత్రీకులగు చాళుక్యులు, ఉండీశులు ముఖ్యులు. కొన్ని శాసనములలో అనపోతా రెడ్డి “కృష్ణాతటము నుండి 'గౌతమీ తీరమువరకును రాజ్యమును పాలించినటుల" కానవచ్చుచున్నది.

శ్లో॥ జిత్వా శ్రీ అనపోతభూతలవతి ర్వీరా నరాతీన్ బలా
దాకృష్ణాతటినీతటా ద్భువ మవ త్యాగౌతమీస్రోతసః॥
ఆవింధ్యా దితి యత్క వీంద్ర వచనం తస్యావధానస్తుతౌ।
ప్రత్యబ్దం ప్రతిపక్ష దేశజయిన స్త త్పూర్వపక్షాయ తే ॥

చారిత్రకాధారములవల్ల పై విషయము నిరూపితము కాకపోయినను అనపోతారెడ్డి ప్రత్యబ్దము ప్రతిపక్ష, దేశమును జయించుటకు దాడిసల్పుచుండుట మాత్రము నిశ్చయముగ కానవచ్చును.

అనపోతా రెడ్డి కాలములో జరిగిన గొప్ప విషయ మొకటికలదు. అది మోటుపల్లి రేవు సంస్కరణము. అది ఆతని పరిపాలనా కౌశలమును చాటును. అతని శాసనములలో " ముకుళాహ్వయ" పురమనియు, ముకుళ పురమనియు; కాకతీయుల కాలములో వేలానగర మనియు, " ధేన్సూయక్కండ " పట్టణమనియు పిలువబడి మార్కోపోలోచే ' మొటఫిలి' అని ప్రశంసింపబడిన రేవు పట్టణమే ఈ మోటుపల్లి. ఇది పురాతనకాలమునుండియు