అడవి బాపిరాజు
ఆయన తక్కిన నవలలు నారాయణరావు, కోనంగి, తుఫాను, జాజిమల్లి, నరుడు సాంఘికమైనవి.
బాపిరాజు గారి నవలలోని ప్రత్యేక లక్షణా లివి :
1. చరిత్రాత్మకమైన నవలలో, చరిత్రానుసరణ విషయములో, ఆయనది అసిధారావ్రతము. కథా గమనము కోసమో, చమత్కారము కోసమో చరిత్రను తారుమారు చేయుట ససేమిరా పనికిరాదు. ఏ రాజుల కాలపు కథ తీసికొని నవల వ్రాయదలచినా, మొదట ఆకాలపు శాసనాలు మొదలు కవిలెకట్టలదాక కుణ్ణముగా చదివి, చరిత్ర కారులతో తర్క వితర్కాలు జరిపి, సమన్వయించు కొని, అప్పటి ఆచార వ్యవహారాలకు, సంప్రదాయాలకు లోటు రాకుండ రచన సాగించేవారు. తుదకు రాజుల బిరుదావళులను కూడ వదలెడువారు కారు. ఇందులకు "గోన గన్నా రెడ్డిని ప్రత్యేకముగా ఉదహరించవచ్చును.
2. సాంఘికమయిన నవలలలో తన దృష్టిని కేవలము పాత్రల మీదనే కేంద్రీకరించక పరిసర పరిస్థితులను, దేశములోని ఘటనల్లో ప్రధాన పాత్ర వహించిన వ్యక్తులను కలిపివేసి, వాస్తవికతను మరింత స్పష్టముగా తోవజేసెడువారు. కనుకనే "నారాయణరావు” లోని జమీందారీ పద్ధతి నిర్మూలనము గాని, తుఫానులోని శర్వరీ భూషణుని కళాతృష్ణ కాని, “నరుడు”లోని హరిజన-ఆంగ్లో ఇండియను వనిత వివాహము కాని, విడ్డూర మనిపించవు సరిగదా, పాఠకునికి సన్నిహితముగాను, వాస్తవికము గాను కనుపించును. "నారాయణరావు" ఆంధ్ర విశ్వవిద్యాలయము మన్ననపొందినది.
3. దేనికి తగిన భాష దానికి అనేది బాపిరాజుగారి రచనలోని మొదటి కిటుకు. “హిమ బిందు”లో భాష ప్రాచీన ప్రబంధ ధోరణిలో కదం తొక్కును. 'కోనంగి', 'నరుడు' వంటి సాంఘికాలలో వ్యవహార భాషలో నల్లేరుపై బండివలె సాగును. భాష యేదయినా ఈ శైలిలో కవిత్వము తొంగిచూచుచుండును.
4. చరిత్ర విషయములో వలెనే భూగోళ విషయములోను ఆయనకు పట్టుదల యెక్కువ. ఆయన ఏ నవల చదివినను (ఏ కథ చదివినా) ఆయా ప్రాంతాలలో విహరించినట్లు పాఠకులు తన్మయులయ్యెదరు. తనదేశ పర్యటనానుభవాలను యుక్తాయుక్త విచక్షణతో క్రోడీకరించి, అక్కడక్కడ చొప్పించుట ఆయనకు పరిపాటి. “తుఫాను” లో ఆయన వివిధరాష్ట్రాల ప్రజల జీవితాలకు సంబంధించిన సూక్ష్మాతి సూక్ష్మవిషయాలను అద్భుతముగా చర్చించుట చూడవచ్చు.
5. ఆయనపాత్రలలోని ఉదాత్తత నిరుపమానము. సంఘములోని ఎగుడు దిగుళ్ళను సరిచేసే ఆ వేశము పాత్రలలో తొణికిసలాడుచు ఉండును. ఆయన సిసలైన గాంధీ వాది. తనకు నచ్చని విధానాలను, సిద్ధాంతాలను వికారముగా చూడక సానుభూతితో పరిశీలించే సహనముగలవాడు. రచయితకు అవసరమయిన ఈ నిజాయితీ గలవాడు-కనుక ఆయన పాత్రలుకూడ ఈఉదాత్తతను పోతపోసికొన్నవి. ప్రతిపక్షుల వాదాలను ఎంత ఉదాత్తతతో తర్కించునది "తుఫాను” సాక్ష్యమియ్యగలదు.
కథలు :- బాపిరాజుగారి కథలు కళా మూర్తులు, రసగుళికలు. అతి సామాన్య విషయముతో అసాధారణ కథ అల్లగల మొనగాడాయన. బాపిరాజు గారితో తెనుగు కథారంగములో నూతన కళాత్మకాధ్యాయము ప్రారంభమై, మహోన్నతిని పొందిన దనుట నిస్సందేహము. ఆయన కథలలో "శైలబాల, భోగీరలోయ, వీణ” దివ్యపారిజాతాలు. ఆయన కథలు కొన్ని, రాగమాలిక, తరంగిణి, అంజలి" అనే మూడు సంపుటాలుగా వెలువడినవి. కొన్ని కథలు శైలబాలవంటివి, ఆంగ్ల, కన్నడ, హిందీభాషలలోకి అనువదింపబడినవి కూడ.
బాపిరాజుగారి కథలలో ధగధగలు, భుగభుగలు కనుపించవు, వినిపించవు. నిస్పృహ, దౌర్బల్యము అగుపించవు. "ఆయన కాళ్ళు నేలమీదనే యున్నను ఆయన చూపు నింగిమీదే. అందుచేత, ఆయన కథలు ఇతరుల కథలవలె కన్పట్టవు. అవి ఆయన దివ్యస్వప్నాలుగా ఉండును. ఆయన కనెడుకలలనే కథలుగా చెప్పివాడు...ఆయన తన కల్పన ద్వారా హృదయస్పందన లెన్నింటినో కథాత్మకముగా చేసినాడు.”
ఇంతమాత్రాన ఆయన కాల్పనిక జగములోనే విహరించినారనికాదు. వాస్తవిక జగత్తుకూడ ఆయన విహార భూమియే. "వాన, నేలతల్లి, గాలివాన” వంటి కథలలో ఆయన భూమిబిడ్డల సంగతులు వ్రాసి పేదల పెద్దతనమును పెద్ద చేసి ధనికుల దౌర్జన్యమును ఖండించినారు.