Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అడవి బాపిరాజు


శ్రీమతి సబ్బమ్మగారు. అమలిన హృదయ, ఉదారస్వభావ. ఈ లక్షణాలు బాపిరాజుగారికి ఉగ్గుపాలతో అలవడినవి. కనుకనే శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారు —

మీయమ్మ యే తార చాయలో నినుగాంచె
ఏ యోషధులపాల పాయసంబిడి పెంచె
లేకున్న నీశిల్ప లీలాభిరుచి రాదు
కాకున్న నీస్వాదు కంఠమబ్బగ బోదు
       అడివోరి చిన్న వాడ
       అమృత ధారలవాడ "

అని ఆశ్చర్యము ప్రకటించినారు.

బాపిరాజుగారి విద్యార్థిదశ రాజమహేంద్రవరములో ఓస్వాల్డ్ కూల్ డ్రేగారి అంతేవాసిత్వములో గడచినది. కూల్డ్రేగారి ఒజ్జరికము బాపిరాజుగారిలో నిద్రాణమైన కవితను, కళను మేల్కొల్పినది. దీనికితోడు పాల్, లాల్, 'బాల్' అనెడు త్రిమూర్తులలో ఒకరైన బిపినచంద్ర పాల్ ఆవేశపూరిత ప్రసంగములు బాపిరాజుగారి హృదయములో దేశభక్తి నారులు పోసినవి. దాని ఫలితమే ఆయన 1921 లో సత్యాగ్రహోద్యమములో పాల్గొని కారాగారవాసము అనుభవించుట, తర్వాత ఆయన బి. ఎల్. పట్టముపొంది, కొన్నాళ్ళు. న్యాయవాది వృత్తి సాగించినను, నాలుగేళ్ళపాటు బందరు జాతీయ కళాశాల ప్రిన్సిపాలుగా పనిచేసినను, పిదప చలనచిత్రరంగంలో కళాదర్శకుడుగా పనిచేసినను, గుంటూరులో కళాపీఠము స్థాపించి " కులపతి " అయినను, పదపడి హైదరాబాదులో 1943 నుంచి నాలుగేండ్లపాటు "మీజాన్ " తెనుగు దినపత్రిక సంపాదకత్వము నిర్వహించినను, అనంతరము 1952 సెప్టెంబరు 22 వ తేదీన చెన్నపురిలో "పాహి మృత్యుంజయా - పాహి మృత్యుంజయా" అని సంస్మరించుచు, తుదిసారిగా కన్నుమూసెడు వరకు ఆయన హృదయ నైర్మల్యము చెక్కు చెదరలేదు. ఆయన కళాతృష్ణ కలక బార లేదు. సాహిత్యారాధన పసి చెడలేదు. పది నవలలు, పది కథా సంపుటాలు, వంద చిత్రాలు, వందపాటలు పూర్తిచేయవలెనని ఆయన కోరిక.

శ్రీ బాపిరాజు గారివలె ఇన్ని కళలలో, కావ్యరూపాలలో కలం నడిపినవారు చాల అరుదు. కలము నడపిన ప్రతి రంగములోను ఆయనవలె కన్నాకు అగుట అంతకన్న అరుదు. ఏకకాలములోనే అన్నింటిని ప్రారంభించి, ఇంద్రజాలికునివలె నిర్వహించెడువారు మరీ అరుదు. ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి కనుకనే ఆయన తన కోరికకు అనుగుణముగా పది నవలలు (పదవది “మధురవాణి " అసంపూర్ణము), ఏబదింటికి పైగా కథలు, శతాధికముగా గేయాలు వ్రాసినారు. పెక్కు చిత్రాలు గీసినారు.

తెలుగు నవలా సాహిత్యములో బాపిరాజు గారిది తొట్టతొలిబంతిలో మొట్టమొదటి పీట. ఆయన హిమబిందు, గోన గన్నారెడ్డి, అడవి శాంతిశ్రీ, అంశుమతి, మధుర వాణి ( అసమగ్రము) ఆంధ్రుల ఇతిహాసము ఇతి వృత్తముగా గలవి. " హిమబిందులోని ఇతివృత్తము ప్రథమాంధ్ర సామ్రాజ్య స్థాపకులయిన శాతవాహనుల నాటిది. అడవి శాంతిశ్రీ ఇక్ష్వాకుల నాటి కథ. అంశుమతిలోనిది ఆంధ్రచాళుక్య సామ్రాజ్యస్థాపన కథ. "గోన గన్నా రెడ్డి” కాకతి రుద్రమ దేవినాటి గాథ. "మధురవాణి" తంజాపు రాంధ్ర రాజుల నాటి సంగతి. ప్రాచీనాంధ్ర చరిత్రను ప్రామాణికముగా గ్రహించి, జాతి జీవనమును చిత్రించుటకు నవలలు రచించిన వారిలో ప్రథముడు, ప్రధానుడు బాపిరాజుగారే.