అడవి బాపిరాజు
ఛత్రాకార పత్ర సమూహముతో తోడ్పడును. అంతే గాక, ఉద్భిజ్జావరోధము వలన భూసార విశేషము (soil) కొట్టుకొనిపోక నిలిచియుండును.
వ్యవసాయము కొరకు నిర్మూలనము చేయుట వలన పూర్వము దట్టమగు అరణ్యములతో నిండియున్న పెద్ద భూభాగములు (దక్కను పీఠభూమిపై నున్న దండా కారణ్యము) ఇప్పుడు బయళ్లుగా నున్నవి. అందుచే ప్రపంచమందన్ని దేశముల యందును భూసార విశేషమును పదిల పరచియుంచుట ఒక పెద్ద సమస్యయైనది. నాగరక దేశములన్నిటి యందును ఇప్పుడు క్రమపద్ధతిని మొక్కలు నాటుట, అరణ్యములు పెంచుట అను కార్యక్రమములు విరామములేకుండ జరుపబడుచున్నవి. అడవులను పెంచుట (ఇది భారత దేశమున 'వనమహోత్సవము' అనబడు చున్నది). ఒక ప్రత్యేకమగు శాస్త్రజ్ఞానము. దానిని పరిశీలించి, వ్యవసాయ, ఆర్థిక సంబంధమగు లాభములకే గాక ఆయా ప్రదేశ సౌందర్యము కొరకును ఆచరణలో పెట్టవలెను.
బంజరుభూములకు తగిన ప్రత్యేక జాతుల మొక్కలను నాటుట, క్రమక్రమముగా వాని స్థానమున ఎక్కువ శ్రేణికి చెందిన వృక్షజాతులను పెంచుట, వర్షజలము యొక్క వేగమును తగ్గించుట కొరకు వంకర టింకర కాలువల నేర్పరచుట భూసారపు తేమను పదిలపరచు పెద్ద కార్యక్రమములో జరుగుచున్న కొన్ని పద్ధతులు.
ప్రకృతి శాస్త్రజ్ఞులు, వ్యవసాయదారులు, ఇంజనీయర్లు కల ప్రత్యేక సంఘములు ఎడతెగని పరిశోధన చేయుటకును, ప్రస్తుతము ఉన్న అరణ్యములను సంరక్షించుటకును, దూరదృష్టి లేక వెనుక కాలమున నాశనము చేయుటచే లోపించిన విశాలారణ్య ప్రదేశములను పునరుద్ధరించుటకును సంస్థాపితములయినవి.
స. జి.
అడవి బాపిరాజు :- కథలోనే పుట్టి, కళలోనే పెరిగి, కళలకు జీవిత మంకితము చేసి, కళాసేవలోనే కాల ధర్మము చెందిన కళాతపస్వి శ్రీ అడవి బాపిరాజుగారు. ఆయన జననము 1895 అక్టోబరు 8వ తేది. శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు, ధర్మవరం రామ కృష్ణమాచార్యులు, గురజాడ అప్పారావుగార్లు ఆధునిక సాహిత్య సౌధ నిర్మాణమునకు పునాదులు వేసిన కాలమది.
కళామయుడైన శ్రీ బాపిరాజుగారు ఆ సౌధమున కొక స్తంభము. అదొక విశిష్ట స్తంభము. హంఫీ హజార రామాలయ స్తంభమువలె ఇసుమంత స్పందనమునకై నను చెమ్మగిలునట్టిది; విఠలాలయ శిలా స్తంభము వలె రాగరంజనలు చిలుకరించునట్టిది; కష్టాలు పై కొన్నప్పుడు మందరమువలె మథించునట్టిది.
కథకుడు కవి యగుట, కవి నవలారచయిత యగుట, నవలారచయిత చిత్రకారు డగుట - వీటన్నిటను నిష్ణాతుడు, నాట్యకోవిదుడు అగుట అరుదు. కాని శ్రీ బాపిరాజుగారు కథకుడు, కవి, నవలారచయిత, చిత్రకారుడు, నాట్యాచార్యుడు "ఒకరికీ చేయినిచ్చి, ఒకరికి కాలునిఛ్చి, ఒకరీకి నడుమునిచ్చీ కూరుచున్నానోయ్ అని ఆయన అభినయించుచు పాడుచున్న పాటవలె, తన చేతిని, కాలును యావచ్ఛరీరమును కళలకు అంకితము చేసినాడు.
ఇంతటి కళామయుడు మధురమూర్తి యగుటలో ఆశ్చర్యమేమున్నది? ఆమలిన హృదయము, అజాత శత్రుత్వము, బహుముఖ ప్రజ్ఞా ప్రాభవము - అనెడు త్రివేణుల సంగమము ఆయన. సహృదయత, సరసత, సదయత పెనవేసికొన్న మానవు డాయన.
" ద్వేషమేనా బ్రతుకుమార్గం
వేషమేనా సత్యరూపం
మోసమేనా నిత్యకర్మం
మూర్తి మంతులకున్, "
అని వాపోయి, వ్యత్యాసాలెరుగని సుందర సమాజము నెలకొనవలెనని అంగలార్చిన ఆదర్శ జీవి.
బాపిరాజుగారు జన్మించినది గోదావరీ తీరమున భీమవరము సమీపములోని సరిపల్లెలో. ఈ గోదావరి "గద్గద నదగ్గోదావరి కాదు.” అన్నిటిని గుండెలలో పెట్టుకొని, విస్తృత గంభీరముగా ప్రవహించెడి గోదావరి. ఆ గోదావరి గంభీరత బాపిరాజుగారి గుండెల లోతులలోనికి, గోదావరి విస్తృతి ఆయన దృక్పథములోనికి తొంగి చూచుటలో వింతయేమున్నది? ఈయన తండ్రి శ్రీ కృష్ణయ్యగారు. రసవత్తరమయిన కథలను ఆశువుగా అల్లి వీనులవిందుగా వినిపించుటలో ప్రజ్ఞాశాలి. తల్లి