అజంతా
కనిపించును. మొదటి గుహ మొదలుకొని పడవ గుహ వరకు పైనున్న కొండల వరుస కత్తివాయివలెను, ఆగుహలన్నిటిని 'దాటి జలపాతమునకు చేరువరకు క్రమముగా విస్తృతముగుచు కనిపించును. జలపాతము యొక్క ఎత్తు మొత్తముమీద 178 అడుగులు. అందు ఏడు కక్ష్యలు కలవు. అంత్య కక్ష్యకు "సత్కుండు" అని పేరు. సత్కుండము నుండి వాఘోరానది తిరిగి ప్రవాహరూపమున బయలుదేరును.
ఈ గుహాలయములు ప్రచండ శిలాఖండముల నుండి నిర్మితములై యున్నవి. వీటి పొడవు 600 గజములకు పైగా నున్నది. అసంపూర్తిగా నున్న వాటితో కలుపుకొని ఈ గుహలన్నియు ముప్పదియై యున్నవి. వీటి అడుగు తలము సమముగా లేదు. ఎనిమిదవ గుహ అన్నింటికంటె మిక్కిలి తగ్గుగాను, నీటిదరికి విశేషముగా దగ్గరగాను ఉన్నది. 29 వ గుహ అన్ని గుహలకంటే ఎత్తయినది. ఈ గుహలను నదితోను, ఈగుహల నొండొంటితోను కలుపుచున్నట్టి ప్రాచీన సోపానములు ఇప్పటికిని అచ్చటచ్చట కాననగును. మిక్కిలి ప్రాచీనములయిన గుహలకు సామీప్యము నందును, ఎదుటనున్న కొండల యొక్క ఉన్నత ప్రదేశములందును కొన్ని ఇటుక కట్టడముల అవశేషములు అచ్చటచ్చట కనుపించుచున్నవి.
ఈ ముప్పది గుహలలో 9, 10, 19, 28, 29 సంఖ్యలుకల గుహలు చైత్యశాలలు (లేక సామాజిక ఆరాధనశాలలు), శేషించిన గుహలు సంఘారామములు లేక విహారములు (అనగా భితువులకు నివాసస్థానములు).
త్రప్వుపద్ధతి :- అసంపూర్తిగా త్రవ్వబడి నేటికిని ప్రాథమిక స్థితియందు నిలచియున్న (కొన్ని) గుహలను బట్టి ఈ గుహలను త్రవ్వుటయందు అనుసరింపపడిన పద్ధతిని మనము సులభముగా ఊహింపవచ్చును. మున్ముందుగా వాస్తు శాస్త్రాభిజ్ఞ సార్వభౌము డొకడు సమగ్రముగా ఈ గుహానిర్మాణ విధానమును పరికల్పించి యుండు ననుట స్పష్టము. అందతడు వాస్తుశాస్త్రము, అలంకరణము, ధ్వనిశిల్పము, తక్షణాలంకరణము (అది ప్రలంబ శిల్ప పట్టికా రూపమునగాని జ్యామితి రీతులలోగాని ఉండవచ్చును) మున్నగు వాటి వివరములను, సమృద్ధిగా వెలుతురు కల్పించుటకును, చూపరులకు మనోహరమగు దృశ్యములభించుటకును వలసిన ఏర్పాట్లను చిత్రణముల విస్తీర్ణమును, సన్నివేశములను కూడ అతడు తొలుదొ ల్తనే పథకము వేసి యుండును.
దేశీయమైన చిన్న ఉలిచేతను, సుత్తెచేతను, ఒకప్పుడు శిలయందు లోతైన సందులు కల్పింపగల బరువైనట్టి మొనగల ఒకరీతి గునపము చేతను, గుహలను తొలుచు పని సాక్షాత్తుగా జరిగినట్లు కనిపించును. మొట్టమొదట కఱ్ఱబొగ్గుతో కాని, రంగుల బలపపు రాతితో గాని రూప రేఖను గీచి, వితానమునుండి క్రింది భాగమునకు తొలుచు పని ఆరంభింపబడెను. రాతిలో రెండు మూడు అడుగుల లోతుగల సందులను కొట్టిన మీదట, మధ్యనున్న రాతి కట్టలను పగులగొట్టి తీసివై చి, అవసరమయిన తావులలో స్థూలశిలాఖండములను వదలిపెట్టుచు, వాటిని పిమ్మట స్తంభములుగా గాని, విగ్రహ శిల్పములుగా గాని, ఇతర వాస్తుశాస్త్ర - శిల్పశాస్త్ర ఉక్తలక్షణములు గలవాటినిగా గాని, నిర్దిష్ట విధానానుసారముగాగాని మలచుచుండిరి. ఈ విధముగా నేలమట్టము శగులు వరకు ఖనన కృత్యము సాగెను. అయితే గండశిలను తొలుచుట, మలుచుట, తీర్చిదిద్దుట. ఈ పనులన్నియు తోడ్తోడనే జరిగెననుటను అసంపూర్తిగ నిర్మాణములయిన గుహలు తెలివిడిచేయు చున్నవి.
వర్ణచిత్ర విధానము :- రంగువేయుటకు ఆధారముగా భిత్తితలమును, వితానమును సిద్ధముచేయు విధానమును, వర్ణచిత్ర విధానమునందు సాంకేతిక విద్యా ప్రగల్భతను చూచినచో చిత్రకారునకు గొప్ప కౌశల్యము, ఊహా సమృద్ధి గలదని స్పష్టమగుచున్నది. రాతిపొడిగాని, ఇనుప మట్టిగాని, బంకమట్టి, ఆవుపేడ తరుచుగా పొట్టుతోనో, ఊకతోనో, వనస్పతి పీచుతోనో కలిపి, పెసర కషాయముతో గాని, బెల్లపు నీటితో గాని, జిగురుపదార్థముగా నూరి ఆ పదార్థమును కఠినముగాను, గరుకుగాను ఉన్న శిలాతలముపై గట్టిగాను, సమముగాను లేపనపట్టిగా మెత్తుదురు. ఆ లేపన పట్టిక విషమ శిలాతలమును గట్టిగా పట్టుకొనును. అట్లు గట్టిగా పట్టుకొన్న ఆ లేపన పట్టిక, తడిగా నుండగనే దాని నొక కర్ణికతో చదునుగాను, నునుపుగాను చేయుదురు. దానిపై చక్కగా సున్నము కొట్టగా, ఆ లేపన పట్టిక ఆ సున్నము నాకర్షించును.