అఖిలేశ్వర వాదము
ఫజుల్ అను నాతడు అక్బరు ఆస్థానమునకు మణిదీపము, అక్బరునామా, ఐనీ అక్బరీ అనునవి అబుల్ ఫజుల్ యొక్క సుప్రసిద్ధ రచనలు. ఆతని తమ్ముడు ఫైజీకూడ గొప్పకవి. హిందువులలో, అక్బరుచే "కవిప్రియ” బిరుదమును పడసిన బీహారీమల్లు ముఖ్యుడు. తాన్ సేన్ అను నాతడు అక్బరు ఆస్థాన గాయకుడు. ప్రశస్త హిందూ గ్రంథములగు రామాయణము, భారతము, అధర్వణ వేదము, లీలావతీ గణితము, అక్బరు ప్రేరణచే పారశీక భాషలోనికి తర్జుమా చేయబడెను. అక్బరు స్వయముగ చిత్రకారుడు. భారతీయ, పారశీక శిల్పులు, చిత్రకారులు అనేకులు ఇతని ఆస్థానమందుండిరి. అక్బరు సేకరించిన 24,000 సంపుటములు గల గ్రంధాలయము ఆతని విద్యాభిమానమునకు నిదర్శనము.
ఈ సార్వభౌముని చివరిరోజులు కష్టములమధ్క కడతేరెను. అక్బరు కుమారులు మువ్వురును దుర్వ్యసన పరులు. అందిద్దరు అక్బరునకు పూర్వమే గతించిరి. పెద్ద కుమారుడగు సలీము అధికార లోభముతో తండ్రిమీదనే కత్తి గట్టెను. 1601 లో సలీము అలహాబాదులో స్వతంత్రుడగుటయే గాక అక్బరునకు ప్రాణమిత్రుడగు అబుల్ ఫజుల్ ను హత్య చేయించెను. ఈ సంఘటనలు అక్బరునకు తీవ్రసంతాప కారణములయి ఆరోగ్యమును పాడుచేసెను. సలీము దురాకృతములను అవకాశముగా గ్రహించి, కొలువుకూటమునందలి సర్దారులు కొందరు అక్బరు మరణానంతరము సలీము కుమారు డగు ఖుస్రూను సింహాసన మెక్కింప కుట్రలు పన్ను చుండిరి. ఇట్టి విషాద సంఘటనల మధ్య, పుత్రవత్సలుడగు అక్బరు సలీమునే తన యనంతరము చక్రవర్తిగా ప్రకటించి క్రీ. శ. 1605 అక్టోబరు 17 వ తారీఖున మరణించెను.
అక్బరు ఆజానుబాహువు. ప్రత్యణువునను రాజఠీవితో నిండిన విగ్రహ మాతనిది. శౌర్యసాహసములం దాతడు అసమానుడు, శరణాగతుడయినచో గర్భశత్రువు నైనను రక్షించు దయాస్వరూపుడు. కపటమెరుగని గంభీర స్వభావము గలవాడు. విద్యావిహీనుడయినను ఉత్తమ సంస్కారమును పొందినవాడు. ప్రజా క్షేమమే ఇతని పరిపాలనకు ఆశయము, ఇతనివలె ప్రజాభిమానమును పడసిన మహమ్మదీయ చక్రవర్తి మరియొకడు లేడు. జహంగీరు చెప్పినట్లు "అక్బరు మానవమాత్రుడు కాడు. అతని ప్రతిచర్యలోను భగవంతుని అంశము ప్రత్యక్ష మగుచుండెను.”
బి. ఎస్. ఎల్. హ. రా.
అఖిలేశ్వర వాదము :- అఖిలేశ్వరవాదమన నేమి?- అఖిలేశ్వర వాదమను పదము యొక్క నిర్వచనము మిక్కిలి సందిగ్ధముగ నున్నది. ఆ పదమును భిన్న భిన్న రచయితలు వివిధ రీతులలో ప్రయోగించిరి. వాటిలో పెక్కులు స్పష్టముగ లేవు. కాని విజ్ఞాన కోశములకు, నిఘంటువులకు ఆపద నిర్వచన విషయమున అభేదత కనిపించుచున్నది. అఖిలేశ్వరవాదము అనునది ఒక సిద్ధాంతము. అందు దేవునకును, విశ్వమునకును అభేదత నిరూపింపబడును.
అందుగూడ స్వల్పభేదమున్నది. దీనికి కారణము రెండు భిన్నములయిన పక్షముల ఉనికియే. ఒకపక్షమువారు "దేవుడన్నను, ప్రకృతియన్నను ఒకటే. దేవుడే కర్త. దేవుడే ఉపాదానము. అతడే కులాలుడు. అతడే మృత్తు" అందురు. ఇదియే క్రమమైన అఖిలేశ్వరవాదము. రెండవ పక్షమునకు చెందినవారు ఈ విషయమును విశ్వసింతురు. కాని వారు భగవంతుడు కేవలము స్రష్ట అని కాని, స్రష్టయు సృష్టియు గూడ అని కాని దేవునిగూర్చి తమ ఆశయమును తెలుపుటకు నిరాకరింతురు. 'ప్రకృతి విషయకమయిన యథార్థజ్ఞానమే భగవద్విషయకమయిన యథార్థ జ్ఞానము' అను విషయమున మాత్రము వీరు అభిలేశ్వర వాదులతో ఏకీభవింతురు. ఇంక వీరిట్లు వాదింతురు. "ఒక వేళ దేవుడు స్రష్టయు, సృష్టియునై యున్నచో, ప్రకృతియందలి భిన్నభిన్న దృశ్యములు ప్రతిభాస-ఆధారమగు భగవంతునియొక్క ఆవిర్భావములేయైయున్నచో, ప్రకృతియందలి భిన్న భిన్న సౌందర్యముల యొక్కయు, అందలి అపూర్వవస్తువుల యొక్కయు దృఢమైన పరిచయమే భగవంతుని యొక్క సంపూర్ణతా వైవిధ్యము యొక్క పూర్ణమయిన పరిచయము అనునర్థము సిద్ధించుచున్నది. అట్లుగాక దేవుడు కేవలము సృష్టికర్తయే యైయుండి, ప్రకృతి ఆతని చేతిపనియే యైయున్న యెడల, ఆతని కృత్యములను, భక్తి పూర్వకముగ మీమాంస యొనర్చుటయే ఆతనిని గూర్చి జ్ఞానమును, భక్తిని సంపాదించుటకు అనన్యమార్గము."