అక్కన్న మాదన్నలు
మాదన్న ప్రతిభ అట్టిదిగా నుండెను.ఇగంతయు ఆత్మరక్షణ కొరకు మాదన్న చేయవలసివచ్చెను. కాని సార్వభౌమ ప్రభుత్వమునకు కట్టవలసిన కప్పము యథాప్రకారము మాదన్న చెల్లింపసాగెను. అంతియెగాదు. 1692 లో చక్రవర్తి దక్షిణాపథమునకు రాగా, మాదన్న పదునైదు ఏనుగులను, కొన్ని మణుగుల బంగారమును, కప్పమును బురహాను పురములో నున్న యాతనికి సత్కారపూర్వకముగా బంపెను. అయినను అక్కన్న మాదన్నల యెడ క్రోధము విడనాడక ఔరంగ జేబు "జన్నారుదారానె దక్కన్ ఖాబిలె గర్దజదన్" (దక్షిణపు యజ్ఞోపవీత ధారులు అక్కన్న మాదన్న వధార్హులు.) అని తానాషా ప్రభువునకు వ్రాయుచుండెడి వాడు.
మాదన్న పరిశ్రమలకు, వాణిజ్యములకు ఎక్కుడు ప్రోత్సాహమిచ్చెను. గోలకొండ వణిజులు ఓడలనిండ సరకుల నింపుకొని తూర్పు, పడమరలనున్న దూరదేశములకు పోయి, వ్యాపారము చేయుచుండిరి. ఆంగ్లేయులు, పరాసు వారు, సయాం చక్రవర్తిని ప్రోత్సహించి గోలకొండ పర్తక నౌకలను దోపిడి చేయించుచుండిరి. రెండుమూడు పర్యాయములు మాదన్న ఉపేక్షించెను. అయితే అది మాదన్న నీరసతగ నెంచి గోలకొండ వర్తకనావలను తరుచు కొల్లగొట్ట సాగిరి.అందుచే మాదన్న తన నౌకాబల సహాయముచే సయాం, ఆంగ్ల, పరాసులు సంయుక్త నౌకాబలమును 1685 ఉత్తరార్ధమున నోడించి, తన వ్యాపారమును సురక్షితము చేసెను. మాదన్న భూనైన్యములనేగాక, సముద్ర సైన్యములను సహితము సంస్కరించి, సత్వసంపన్నములనుగా నొనర్చియుంచెనని తెలియుచున్నది.
దేశరక్షణ వ్యవస్థ:- దేశరక్షణ విషయములో మాదన్న అత్యంతము జాగరూకతను వహించి సువ్యవస్థగావించెను. భువనగిరి, ఓరుగల్లు, ఖమ్మముమెట్టు, కొండపల్లి, కొండవీడు మొదలగు దుర్గములను వృద్ధిపరచెను. ప్రతి దుర్గము నందును ఉండు పండ్రెండువందల సైనికుల సంఖ్యను రెండు వేలకు పెంచెను. (1682). మన్సబుదారి పద్ధతి పైన జాగీరుదారులు కొంత సైన్యమును రాజునకు సహాయార్థము సిద్ధముచేసి యుంచెడివారు. కాని జాగీరుదారులతోనే యుద్ధము సంభవించినచో జాగీరు సైన్యము జాగీరు వారి పక్షముననే యుండునుగదా.మాదన్న ఈ విధానమును మార్చివై చెను. సైనిక నిర్మాణ వ్యవస్థయంతయు రాజాధీనముననే యుండు నట్లేర్పరచెను. దేశీయ, విదేశీయ సైనికుల జీతములందుగల హెచ్చుతగ్గులను మాదన్న సవరించెను. ఆశ్విక దళమును, శతఘ్నీ దళమును విస్తృతపరచెను. సామ్రాజ్యపు ప్రబలసైన్యములను ఎనిమిదినెలలు పది రెండు దివసములు కాలూననీక అదలించినదీ శతఘ్నీ దళమే.
రాజ్య వ్యవస్థ : భూమ్యాదాయ, పరిపాలనాశాఖల సౌలభ్యము కొరకు మాదన్న దేశమును ఖండములుగను, ఖండములను సర్కారులుగను, సర్కారులను పరగణాలుగను విభజించెను. తెలంగాణ ఖండములో ఇరువది సర్కారులును, రెండు వందల ఇరువదినాలుగు పరగణాలును; కర్ణాటక ఖండములో ఇరువది రెండు సర్కారులును, మున్నూట పదునాలుగు పరగణాలును; ఆర్కాటు (తమిళ) ఖండమునందు పదునారు సర్కారులును, నూట పదునారు పరగణాలును ఉండెను. గోలకొండ రాజ్యము మూడు ఖండములు, ఏబది ఎనిమిది సర్కారులు, వందల ఏబదినాలుగు పరగణాలు కలదిగా నుండెను.
అక్కన్న మాదన్నల హత్య :- క్రీ. శ. 1685 అక్టోబరు నాటి సంధి ననుసరించి ఈ యన్నదమ్ములు పదభ్రష్టులయి, కారాగారవాసులయి యుండవలసి యుండెను. సుల్తాను దాని నమలుపరచలేదు. కాని ఆ సంధి నియమముల వలన మాదన్న విరోధులకు ధైర్యమెక్కువయినది. రాజాంతఃపురమునందును, వెలుపలను ఈ యన్నదమ్ములను హత్యచేయుటకు కుట్రలు ప్రబలెను. 1686 మార్చి నెల తుది భాగమున ఒకనాటి రాత్రి మొదటి యామమున రాచకార్యములు ముగించుకొని, రాజాజ్ఞ గై కొని అక్కన్న మాదన్నలు ఇంటికి బోవుచున్న సమయమున కుట్రదారులు తటాలున వారిపైబడి కనుమూసి తెరచునంతలో వారిని హత్య చేసిరి. విశేషముగ లంచముల కావరకే అంగరక్షకులు లోబడియుండుటచే ఈ హత్యాకాండ సునాయాసముగ జరిగిపోయినది. తరువాత హంతకులు నగరము పైబడి రుస్తుంరావును (పులిపల్లి, ఎంకన్న) రెండు వేల బ్రాహ్మణ కుటుంబములను సమూలముగా హత్యగావించిరి. వారి యిండ్లను దగ్ధమొనర్చిరి.