పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


శా॥ జానొందన్ బహుళాంబు పూరము వనాకాశంబలల్ నింప స
    స్యానీకంబు సమృద్ధమై యెదిగె భాగ్యస్ఫూర్తి హెచ్చింప ల
    క్ష్మీనిత్యోత్సవ మందిరంబయి తనర్చెన్ విశ్వసర్వోన్నత
    స్థానంబంది సమస్త వైఖరులు రాజస్థాన మవ్వేళలో.3
    
సీ॥ ఇట్టిరాజస్థాన మెపుడు స్వతంత్రులౌ
              జనపాలమణుల పాలసమునొందు
    దేశంబు లిరువది దీపింప వెలుగొందు
              వానిలోనెల్ల మేవాడదేశ
    మగ్రగణ్యము; దాని యధిపతియగు వాని
              ‘రాణా' యని జనులు ప్రస్తుతింతు
    రతఁడు మతాధిపత్యమున నెల్లరకు జ
               గద్గురుఁడగుచు విఖ్యాతిగాంచు.
               
గీ॥ నగరములలోనఁ గాశికానగర మట్లు
   చిరయశముఁగాంచుఁ జిత్తూరు పురవరంబు
   నచటి రాణాయు నందఱ నగ్రపూజ్యుఁ
   డెల్ల సురలందుఁగాశి విశ్వేశు మాడ్కి.
   
సీ॥ హారావళి పర్వతావళి విరివిగా
             నింద్రనీల శిలల నిచ్చుచుండ
    సాంబారు లూనీ విశాల ప్రదేశములో
             సహజమౌ లవణం బొసంగుచుండ
    గను లెల్లెడల మరకతములు రత్నముల్
             సౌవీరమును మంచి స్ఫటికములును
    జంద్రకాంత శిలల స్వర్ణరౌప్యంబుల
            నెడతెగకయె యెప్పు డిచ్చుచుండ,
            
గీ॥ భాగ్యము లొసంగి యేలిన వారియిండ్లు
   బంగరుంగొండలట్లు చేయంగఁగలిగి
   రత్నగర్భ యటన్న సార్ధక పదంబుఁ
   బడసి మేవాడ దేశంబు పరిఢవిల్లె.5