12
ఉ॥ వీరరసార్ద్రమౌ కధలు వీనులు సోఁక నమస్కరించి పూ
జారతి వీరులన్ గొలుచు సజ్జనుఁడౌటను రాజపుత్ర ధా
త్రీరమణాళి సత్కధలు రేయుఁబవల్ గడియించి యాంగ్ల భా
షా రమణీయకావ్యముగ శ్రద్ధమెయిన్ రచియించె నాతఁడున్.
సీ॥ సర్వసన్నుతము రాజస్థానదేశంబు
మాతృదేశము మించి మహితభ
క్తి గొలిచి తద్దేశ వాసుల బంధువులపోల్కిఁ
ప్రేమించుటను జేసి వృధ్విజనులు
పాశ్చాత్యుఁడైన నెప్పటికి టాద్దొర రాజ
పుత్రుఁడే యనుచు సమ్మోదమంది:
రతఁడును రాజపుత్రావనికొఱకుఁ బ్రా
ణములైన నిచ్చు చందమున మెలఁగె;
గీ॥ నమ్మహాత్ముండు వ్రాయు గ్రంధమ్మునందు
వీరరసతరంగములతో క్షీరజలధి
కరణి మాధుర్యములు పెంచు చరితలెన్నొ
కలవు కలవారియిండ్ల బంగారమట్లు.
శా॥ ఆకర్ణద్వయపావనంబగు చరిత్రాంశంబు లందెల్లఁ గ
న్నాకై దివ్యరసాలవాలమయి సత్య న్యాయ సంపూరితం
బై కన్పట్టెడి నాప్రతాపు చరితం బద్దాని గోస్తనీ
పాకంబొప్పఁగ నొక్క దొడ్డకృతిగా వ్రాయన్ బ్రయత్నించెదన్.”
మ॥ అన "నీమాటలు వేదవాక్యము; లవశ్యంబిప్డు రాణాప్రతా
పుని గీర్తింపు; మతండు వీరజనతా పూర్వాభిగణ్యుండు; క
మ్మని నీకైతకు నమ్మహాప్రభుని ధర్మ శ్రీరతుల్ హాటకం
బునకున్ సౌరభపూరముల్ గలుపు సొంపున్ గాంచి వాసిన్ గనున్"
క॥ అని ప్రోత్సహించుమతి నని
యెను వెంకట శేషశాస్త్రి: యేనంతం బ్రతా
పుని చరిత కావ్యరూపముగను
వెలయింపంగ వ్రాయఁగా మొదలిడితిన్.