పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

41

మఱియు వ్యష్టిభూతులైన మునులు స్వదేహంబుల త్రికూటాగ్రంబుల నాత్మధ్యానంబు సేయుదు రట్ల సమష్టిభూతుండనైన నేనును బ్రహ్మాండ దేహంబునకు త్రికూటస్థానంబగు నా త్రికూటాద్రియందు ధ్యానసమయంబుల నేకాంతంబుగా నివసించి యుందును గావున నచ్చోట మీకును బ్రహ్మోపదేశంబు జేసెదనని వారలతోడం బలికి సనకసనందనాది పరమహంసలను వాలఖిల్యాది యోగసిద్ధులను నారదాది దేవర్షులను వసిష్ఠాది బ్రహ్మర్షులను మేధాది ప్రధాన రాజర్షులం దోడ్కొనివచ్చి సవ్యాపసవ్య మధ్యదేశంబులంగల బ్రహ్మ విష్ణు రుద్రులతోడ నేకీకృతయగు నిజమూర్తి ననుసరించి సవ్యాపసవ్య మధ్యదేశంబుల బ్రహ్మ విష్ణు రుద్రరూప శిఖరంబుల నొప్పు నప్పరమేశ్వరాకార ధారుణీధర మధ్యశిఖరంబున బిల్వకాంతార కాంతేందుకాంత కుట్టిమస్ఫుట వటవిటపి నికట స్ఫటిక ఘటిత సహస్ర స్తంభ సంభార సంభృత మణి మండ పాంతర భాస్వర కార్తస్వర వేదికామధ్యంబున నుద్భాసిత వీరాసనాధ్యాసిత పదుండును జ్ఞానముద్రిత హస్తుండును నాసాగ్ర నిరీక్షణుండునునై స్వరూపాలోకానంద పరవశుండై యుండె నంత నమ్మునిసమాజంబుల గిరీంద్రోపత్యకాధిత్యకా స్థలంబులం బ్రవేశించిరి.15


కొందఱు భూరిసానువులఁ గొందఱు దివ్యనితంబ భూములన్
కొందఱు గండశైలములఁ గొందఱు బిల్వవనాంతరంబులన్
కొందఱు రత్నకూటములఁ గోరి వసించుటఁజేసి మారజి
న్మందిర మన్నగంబు మునిమందయనన్ విలసిల్లె నెంతయున్. 16

అంత నద్దేవు నర్చించి యాత్మవిద్య
కరుణ దయచేయుమను సనకముఖమౌని
నికరములఁజూచి యానంద నిలయుఁడైన
దక్షిణామూర్తి బల్కె తత్వైక సరణి.17