పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9


లము నొక చట్రాతిపైఁ బొడిచెను. అచ్చట జల ముద్భవించేను. శివుఁడందు లింగరూపమున వెలసెను. ఆతఁడు వారి కందు స్నాన మొనర్చి తన్నారాధించి దోషవిముక్తులుకం డని చెప్పి మాయమయ్యెను. వారట్లోనర్చి ధన్యులయిరి. నాఁటి నుండి యచ్చటి లింగమును పాపవినాశనేశ్వర లింగమనుట వాడుక. ప్రజలిందు తొలుదొల్త స్నానమాచరించి శివుని సేవించుట ముఖ్యమని పురాణస్థ విషయము. దీనినే గ్రద్దల బోడనియు, విష్ణుశిఖర మనియు నందురు.


బ్రహ్మశిఖరము :


రుద్ర శిఖరమునకుఁ గ్రిందుగా నైరృతిభాగమున బ్రహ్మ వసించి, జ్యోతి ర్లింగ మచ్చట లేకుండుటకుఁ జింతించి శివునిఁ గూర్చి ఘోర తపస్సు చేసెను, శివుఁడును బ్రత్యక్షమై బ్రహ్మకోర్కె చెల్లించుట కట్టులే వెలసెను. అదియే నేఁడు సర్వులు పూజించు నూత్న కోటీశ్వరలింగము. ఈ లింగమును స్థల పురాణమున వచ్చు సాలంకయ్య యను భక్తుఁడు ప్రతిష్ఠించినట్లు గలదు. ఇచ్చట శివుఁడు తాండవము సల్పుచుండును. దీనికి ఉత్తరమున సమీపస్థ గ్రామము 'ఎల్లమంద' లేక 'మునిమంద’, ఇందు మునులు గుంపుగా నివసించెడివారఁట. ఈ గ్రామ సంబంధముచే నీ దేవునికి 'ఎల్లమంద కోటీశ్వరుఁ" డని వాడుక యైనది. ఇందలి జ్యోతిర్లింగము లగోచరమైన కారణమున మనుష్యులు శిలాలింగముల నేర్పఱచి పూజించుచుండిరి. వివరములు తెలియవు. ఇవి సురనర సేవ్యములై మోక్షప్రదము లగుచున్నవి. ఈ గిరి స్థలమున నిప్పటికి నొక సిద్ధుఁ డదృశ్య రూపమునఁ తిరుగు చుండునని చెప్పుచుందురు.

ఓంకార నది (ఓగేరు) :


దేహమునకు త్రికూట స్థానమందు ఓంకారము ప్రముఖమైనట్టు లీ త్రికూటాద్రికి దక్షిణముగ ఓంకారనది పాఱుచున్నది. ఇందు తైర్థికులు స్నానమాడి తీర్థశ్రాద్ధములొనర్చి దేవుని సేవించిన స్వర్గము కరతలామలకము. పూర్వము శిబిచక్రవర్తి యను రాజు అగస్త్యోపదేశమున జగదేకదాతయై ఆర్తరక్షణ బిరుదాంకితుఁడై యుండెను. అతని దానశీలమును పరీక్షించుటకై ఇంద్రుఁడు శ్యేనమై, యగ్నిహోత్రునిఁ గపోతముగఁ జేసి వేటాడుచు వచ్చెను. ఆకపోతము కిరాతరూపమున నున్న శివునిచేఁ బడి తప్పి శిబినిఁ జేరి శరణు 2