పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

374 శుకసప్తతి


వాజ్ఞావశుండై యాహారంబుఁ గొనంగానక వెఱచినవారి వెంటంబడి తదీయజనప్రకల్పితరాత్రి కాననంబుల నుద్దండతరజఠరానలంబున శృంగాటకంబులఁ గాఁపుగరిత లగ్గలంబుగా భగ్గునం దరికొన బలియర్పించు పొంగళ్లవలనం గొంతకొంత సంతసించుచు నిడుమలకుం గడగానక యప్పట్టనంబున నెట్టుకొని యున్నవాఁ డగుటం జేసి యతం డొక్కనాఁడు.

583


క.

నరపతికిం గానుకగా
విరిపొట్లము గొనుచు నొకఁడు వీథింజనుచో
గురుతర మగు సురుచిరత
త్పరిమళముల వెంటనంటి పాయక చనియెన్.

584


ఉ.

భూపతి యంత నవ్విరులపొట్లముఁ గైకొని కొల్వు దీఱి క్రీ
డాసరమైన బాళి నిగుడ న్వెస నంతిపురంబుఁ జేరి కొ
మ్మాపువుఁబోణి యంచు మణిమంజరి కిచ్చి తదీయమన్మథో
ద్దీపితకేళిఁ దేలి పొడతెంచు రవిం గని లేచిపోయినన్.

585


క.

ఆకమలనయన పరసుర
తాకాంతుల్ నిగుడ నెవ్వఁడైనను మగవాఁ
డీకడకు వచ్చి కోరిక
నాకొనగూర్చునని నెమ్మనంబునఁ దలఁపన్.

586


క.

క్రూరుం డప్పుడు తనయా
కారముతో నిలిచి యళుకుగాంచినదానిం
జేరంగ నరిగి వెఱవకు
మోరమణీ వినుము మన్మహోదంతంబున్.

587